అగ్ని మహా పురాణము

Table of Contents

షాడ్గుణ్య వర్ణనము

పుష్కరుడు చెప్పెను: పరశురామా! సామదాన భేద దండోపాయములను గూర్చి వెనుక చెప్పబడినది. తన రాజ్యమునందు దండమును ఎట్లు ప్రయోగించవలెనో కూడ చెప్పబడినది. ఈ నాలుగు ఉపాయములను శత్రు దేశమునందు ఎట్లు ఉపయోగించవలెనో చెప్పెదను. గుప్తము, ప్రకాశము అని దండము రెండు విధములు. గ్రామమును మట్టిలో కలిపివేయుట, పంటకు నష్టము కలిగించుట, నిప్పు పెట్టుట-ఇవి ప్రకాశదండములు. విషము పెట్టుట, రహస్యముగా నిప్పు అంటించుట, అనేక విధముల మనుష్యులచే చంపించుట, సత్పురుషుల పై దోషారోపణము చేయుట, నీరు దూషితము చేయుట-ఇవి గుప్త దండములు. భృగునందనా! ఉపేక్షను గూర్చి వినుము-”యుద్ధము చేయుటకు, నాకెవ్వరితోను విరోధము లేదు. వ్యర్థముగా విరోధము అనర్థమూలము. సంధి చేసికొన్నను ఇట్లే అగును. సామ ప్రయోగము చేసితిని గాని ప్రయోజనము కలుగలేదు. దానముచే కేవలము ధనక్షయము కలుగును. భేద దండములచే గూడ ప్రయోజన మేమియు ఉండదు’. అని రాజుకు తోచినచో ఉపేక్షను, ఆశ్రయించవలెను. ఈతడు నాకు శత్రువైనను నాకే మియు నష్టములేదు. ఇప్పుడు నేను కూడ ఆతనిని ఏమియు జేయజాలను’. అను నమ్మిక కలిగినపుడు గూడ ఉపేక్షను అవలంబించవలెను. తన శత్రువును అనాదరము చేతనే తొలగించుకొనవలెను.

ఇప్పుడు మాయ అను ఉపాయము చెప్పెదను. అసత్యమైన ఉత్పాతములు చూపి శత్రువులలో భయాందోళనము కలిగించవలెను. స్థూలమైన ఒకపక్షి తోకకు చాల పొడవైన మండుచున్న ఉల్కను (కొరవి) కట్టి దానిని శత్రువుల గుడారము వైపు విడువవలెను. దానిని చూచి శత్రువులు ఉల్కాపాతమను భ్రాంతిచెందునట్లు చేయవలెను. ఈ విధముగనే అనేకమైన ఉత్పాతములు చూపవలెను. అనేక విధములైన మాయలు చూపు మదారీలను పంపి వారిద్వారా శత్రువులలో ఉద్వేగము కలిగించవలెను. తపస్వుల చేతను, జ్యోతిష్కుల చేతను ‘నీకు ఆపద రానున్నదని’ చెప్పించవలెను. భూమిని జయించదలచిన రాజు ఈ విధముగ అనేక ఉపాయములచే శత్రువులను భయభీతులను చేయవలెను. తనకు దేవతానుగ్రహము ఉన్నట్లును దేవతలు తనకు వరప్రదానము చేసినట్లును వారికి తెలియునట్లు చేయవలెను. యుద్ధము ప్రారంభమైనచో తన సైనికులతో-‘వీరులారా! నిర్భయముగ పోరాడుడు. మన మిత్రసేన వచ్చినది. శత్రువులు పారిపోవుచున్నారు’ అని గర్జించి చెప్పుచు హర్షధ్వనులు చేయవలెను. ‘నా శత్రువు హతుడైనాడు’ అని చెప్పవలెను. దేవతా దేశముచే వృద్ధిని పొందిన రాజు కవచాదులతో సన్నద్ధుడై యుద్ధ భూమిపై ప్రవేశించవలెను. 

ఇపుడు ఇంద్రజాలమును గూర్చి చెప్పెదను. రాజు సమయానుసారముగ ఇంద్ర జాలము ప్రదర్శించవలెను. తమ సాహాయ్యమునకై దేవతల చతురంగ సైన్యము వచ్చినట్లు శత్రువులకు చూపవలెను. శత్రుసేనపై రక్తవర్షము కురిపించి మాయచే, శత్రువుల భిన్నములగు శిరస్సులు భవనముపైన కనబడునట్లు చేయవలెను.

ఇప్పుడు ఆరు గుణములను గూర్చి చెప్పెదను. సంధి-విగ్రహములు ప్రధానమైనవి. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సంశ్రయములు ఆరు గుణములు. కొన్ని షరతులపై శత్రువుతో కలియుట ‘సంధి’. యుద్ధారులచే వానికి నష్టము కలిగించుట ‘విగ్రహము’. శత్రువుపై దండెత్తి వెళ్ళుట ‘యానము’ విగ్రహము ప్రారంభించి తన దేశమునందే ఉండుట ‘ఆసనము’. సగము సేనతో యుద్ధమునకు వెళ్ళుట ద్వైధీభావము. ఉదాసీనుని గాని, మధ్యస్థునిగాని శరణుజొచ్చుట ‘సంశ్రయము’.

తన కంటె దుర్బలునితో కాక, తనతో సమాన బలునితో, అధిక బలునితోను సంధి చేసికొనవలెను. తాను బలంతుడై శత్రువు దుర్బలుడైనపుడు ఆతనితో విగ్రహమే చేయవలెను. హీనావస్థలో నున్నను, తన పార్జ్షిగ్రాహకుడు మంచివాడైనచో బలవంతుడగు రాజును ఆశ్రయించవలెను. యుద్ధమునకు వెళ్ళకపోయినను శత్రుకార్యములను నశింపచేయగల రాజు, పార్ష్ణిగ్రాహకుడు మంచి వాడు కాకున్నను, విగ్రహము చూపి ఊరక కూర్చుం డవలెను. లేదా పార్ష్ణిగ్రాహకుడు మంచివాడు కానప్పుడు ద్వైధీభావమును అవలంబించవలెను. బలవంతుడగు రాజు చేతిలో పడిపోయెదమను భయమున్నపుడే సంశ్రయము అవలంబించవలెను. ఇది సామాది గుణములన్నింటి కంటెను అధమమైనది. సంశ్రయమునకు తగిన పరిస్థితులలో ఉన్న రాజు యానమవలంబించినచో జనమును, ధనమును కూడ కోల్పోవును. ఎవరినైన ఆశ్రయించుటచే అధిక లాభము కలుగునను ఆశయున్నచో సంశ్రయమును అవలంబించవలెను. అన్ని విధముల శక్తి క్షీణించినప్పుడు మాత్రమే ఇతరులను శరణు వేడవలెను. (234)