అగ్ని మహా పురాణము

Table of Contents

షట్కర్మ నిరూపణము

పరమేశ్వరుడు చెప్పెను:

అన్ని మంత్రముల సాధ్యరూపములకు ఆరు కర్మలను గూర్చి చెప్పెదను వినుము. శాంతి, వశ్యము, స్తంభనము, ద్వేషము, ఉచ్ఛాటనము, మారణము అని ఆరు కర్మలు. ఈ కర్మలన్నింటి యందును ఆరు సంప్రదాయములు లేదా విన్యాసములు ఉండును. అవి-పల్లవ, యోగ, రోధక, సంపుట, గ్రథన, విదర్భములు. ఎవని ఉచ్ఛాటనము చేయవలెనో వాని పేరు భూర్జ పత్రాదులపై వ్రాయవలెను. పిదప ఉచ్చాటన మంత్రము వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయు సంప్రదాయమునకు పల్లవమని పేరు. ఇది ఉచ్చకోటికి చెందిన ఉచ్చాటనము చేయు ప్రయోగము. మొదట మంత్రము వ్రాసి పిదప సాధ్యవ్యక్తి పేరు వ్రాయవలెను. చివర మరల మంత్రము వ్రాయవలెను. దీనికి ‘యోగ’ సంప్రదాయమని పేరు. శత్రువు కులమునంతను సంహరించుటకై ఈ ప్రయోగము చేయవలెను. మొదట మంత్రమువ్రాసి, మధ్యసాధ్య నామము వ్రాసి, అంతమునందు మరల మంత్రము వ్రాసి, మరల సాధ్యనామమును వ్రాసి, మరల మంత్రము వ్రాయవలెను. ఇది రోధక సంప్రదాయము. దీని ప్రయోగము స్తంభనాదులందు చేయవలెను. మంత్రమునకు పైన, క్రింద, కుడి-ఎడమ ప్రక్కల, మధ్య సాధ్యనామము వ్రాయగా ఇది ‘సంపుటము’. దీనిని వశ్యా కర్షణ కర్మమున ప్రయోగించవలెను. మంత్రాక్షరము ఒకటి వ్రాసి, పిదప సాధ్యనామాక్షరము వ్రాసి, మరల రెండవ మంత్రాక్షరము వ్రాసి, పిదప నామాక్షరము రెండవది వ్రాసి-ఈ విధముగా మంత్రాక్షరములు, నామాక్షరము ఒకదాని తరువాత ఒకటి వ్రాసినచో దీనికి గ్రథన సంప్రదాయమని పేరు. దీనిని ఆకర్షణ-వశీకరణములందు చేయవలెను. మొదట మంత్రాక్షరములు రెండు వ్రాసి, సాధ్య నామాక్షరము ఒకటి వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయుచు పూర్తి చేయగా విదర్భమని పేరు. దీనిని వశీకరణ ఆకర్షణములకు ఉపయోగింతురు. ఆకర్షణాది మంత్రానుష్ఠానము వసంతము నందు చేయవలెను. తాప జ్వర నివారణ, వశీకరణ, ఆకర్షణ కర్మలందు ‘స్వాహా’ ప్రయోగము శుభకరము. శాంతి-వృద్ధి కర్మలందు ‘నమః’ ప్రయోగము చేయవలెను. పౌష్టిక కర్మ వశీకరణములందు ‘వషట్’ను ప్రయోగించవలెను. లాభాదులందును, మంత్ర దీక్షాదులందును వషట్కారమే సిద్ధిదాయకము. మంత్రదీక్ష నిచ్చు ఆచార్యుని యమునిగా భావించి-ప్రభో! నీవు యముడవు, యమధర్మరాజువు, కాలరూపుడవు, ధర్మరాజువు. నేను సమర్పించు ఈ శత్రువును శీఘ్రముగా సంహరింపుము’ అని ప్రార్థించవలెను. అపుడు శత్రు సంహారకుడగు ఆచార్యుడు ప్రసన్న చిత్తముతో ఈ విధముగ ప్రత్యుత్తరము ఇవ్వవలెను- సాధకా! నీవు సఫలుడవు అగుదువు గాక. నేను ప్రయత్న పూర్వకముగ శత్రువును చంపెదను’ శ్వేత కమలముపై యమధర్మరాజును పూజించి, హోమము చేయుటచే ఈ ప్రయోగము సఫలమగును. తనను భైరవునిగా భావించుచు తనలో కులేశ్వరి కూడ ఉన్నట్లు భావన చేయవలెను. ఇట్లు చేయుటచే సాధనకు రాత్రియందు తన వృత్తాంతము, శత్రువునకు సంబంధించిన వృత్తాంతము తెలియును. ‘దుర్గే దుర్గే రక్షిణి’ అను మంత్రముతో దుర్గా పూజ చేయుటచే సాధకుడు శత్రునాశన సమర్థుడగును. ‘హ స క్ష మ ల వ ర యు మ్’ అను భైరవీ మంత్రమును జపించుటచే సాధకుడు శత్రుసంహారము చేయగల్గును. (188)