అగ్ని మహా పురాణము

Table of Contents

అఖండ ద్వాదశీ వ్రతం.

అగ్ని పలికెను:

ఇపుడు సమస్త వ్రతములకు సంపూర్ణత్వమును సంపాదించు అఖండ ద్వాదశీ వ్రతమును గూర్చి చెప్పెదను, మార్గ శీర్ష శుక్ల ద్వాదశినాడు ఉపవాసముచేసి శ్రీమహా విష్ణువును పూజించవలెను. పంచగవ్య మిశ్ర జలముతో స్నానముచేసి దానితోనే పారణము చేయవలెను. శ్రీమహావిష్ణువు ఎదుట ఈ విధముగా ప్రార్థన చేయవలెను-‘భగవంతుడా! ఏడు జన్మలనుండి నేను చేసిన వ్రతాలలో ఏదైన ఖండమైనచో అది అఖండ ఫలదాయకము అగునట్లు అనుగ్రహించుము. పురుషోత్తమా! నీవు ఈ అఖండ చరాచర విశ్వరూపమున ఉన్నట్లు నా వ్రతము కూడ అఖండమగుగాక’ ఈ విధముగ నాలుగు మాసములు ఈ వ్రతము చేయవలెను. చైత్రమునుండి ఆషాఢము వరకును చేసిన పక్షమున పేలాల పిండి నింపిన పాత్రను దానము చేయవలెను. శ్రావణమునందు ప్రారంభించి కార్తికము నందుకూడ సమాప్తము చేయవచ్చును. ఈ విధముగా అఖండ ద్వాదశీ వ్రతము చేయుటచే ఏడు జన్మలలో ఖండితములై పోయిన(అసంపూర్ణములైన) వ్రతములు సంపూర్ణ ఫలప్రదము లగును. దీనిని చేసినవానికి దీర్ఘాయురారోగ్య, సౌభాగ్య, రాజ్యాది వివిధ భోగములు లభించును. (190)