అగ్ని మహా పురాణము

Table of Contents

అరణ్యకాండ

రాముడు వసిష్ఠునికి, తల్లులకు నమస్కరించి వారిని తిరిగి పంపివేసి చిత్ర కూటము నుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహా మునిని, ఆతని భార్యయైన అనసూయను, శరభంగుని, సుతీక్ష్ణుని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. అగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.

జనస్థానము నందు గోదావరీ తీరమున, పంచవటిలో నివసించెను. భయంకరురాలు అయిన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపముగల రాముని చూచి కామ మోహితురాలై శూర్పణఖ

“నీవు ఎవరవు? ఎక్కడ నుండి వచ్చినావు? నేను నిన్ను కోరుకొనుచున్నాను. నాకు భర్తవు అగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. అని పలికి ఆమె సీతా లక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను, అప్పుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసివేసెను.

రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో “ఖరుడా! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను” అని చెప్పెను.

అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ- త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరస్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.

శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపైబడి, క్రుద్ధురాలై రావణునితో “నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్యయైన సీతను అపహరించి భార్యను చేసి కొనుము. రామ లక్ష్మణుల రక్తము త్రాగిననే నేను జీవించెదను. అట్లు కానిచో జీవింపను” అని పలికెను.

ఆ మాటలు విని రావణుడు “అటులనే చేసెదను” అని పలికి, మారీచునితో “బంగారు చిత్ర వర్ణమైన మృగ రూపము ధరించి, రామ లక్ష్మణులను దూరముగా తీసికొని పోవు వాడవై, సీత ఎదుటకు వెళ్ళుము. నేను ఆమెను హరించెదను. ఇట్లు చేయకున్నచో నీకు మరణము తప్పదు” అని హెచ్చరించెను.

మారీచుడు (అనుకొనెను) “ధనుర్ధారియైన రాముడు సాక్షాత్తు మృత్యు దేవతయే. రావణుని చేతిలో నైనను మరణింపవలసినదే; రాముని చేతిలో నైనను మరణించ వలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు” అని ఈ విధముగ తలచి, మృగ రూపము ధరించి మాటి మాటికిని సీత ఎదుట సంచరించెను.

సీతచే ప్రేరితుడైన రాముడు (కొంతదూరము దానిని వెంబడించి) బాణముచేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు తనకిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను. అంతట రావణుడు జటాయువును చంపి, సీతను హరించెను.

జటాయువుచే చీల్చబడిన శరీరముగల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొనిపోయి, లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను. “ఓ సీతా! నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము.”‘ “ఓ రాక్షస స్త్రీలలారా! ఈమెను సంరక్షింపుడు’ ‘అని ఆదేశించెను. రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి “లక్ష్మణా! అది మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించియుందురు.” అని పలికెను. పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

రాముడు దుఃఖించుచు “సీతా నన్ను విడచి ఎక్కడికి పోతివి” అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

జటాయువు రాముని చూచి “సీతను రావణుడు అపహరించెను” అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడు ఆ జటాయువునకు అంత్యసంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహ రించెను. అతడు శాప విముక్తుడై “సుగ్రీవుని వద్దకు వెళ్లుము” అని రామునితో పలికెను. (7)