“శ్రీకృష్ణదేవా! మరి ఈ నక్షత్ర వ్రతాలు బహుకాల వ్యాపకాలు కదా! ఏ అనివార్యకారణ దృష్ట్యానో అవి భగ్నమైపోతే, వ్రతి తప్పు లేకుండానే ఆగిపోతే, ఏ కర్మల ద్వారా వ్రతులు తరించగలరు? జగద్గురుడవు, సర్వజ్ఞుడవునగు నీవే చెప్పగలవు. ఆదేశించు” అని ప్రజాక్షేమ పరతంత్రుడైన ధర్మజుడడుగగా ఇలా చెప్పాడు మురారి.
“ధర్మజా! ఇది పరమ రహస్యమైన విషయమే అయినా నీకోసం బహిర్గతం చేస్తున్నాను. ఏ వ్రతమైనా అనేక ప్రకారాల ఉపద్రవాల వల్ల ఆగిపోతే దానిని సంపూర్ణం చేసి పూర్ణ ఫలాల నివ్వగల వ్రతములున్నాయి.
ఏ దేవీ; దేవ, దేవతా వ్రత భగ్నం జరిగిందో ఆ దేవీ, దేవ, దేవత యొక్క స్వర్ణ లేదా వెండి ప్రతిమను చేయించి పంచామృతాలతో దానికి స్నానం చేయించి ఒక జలపూర్ణ కలశపై దానిని ప్రతిష్ఠించి గంధ పుష్పాక్షత ధూపదీప వస్త్రభూషణ నైవేద్యాదులతో పూజించాలి. ఇదంతా ఏ రోజైతే వ్రతభగ్నమైందో మరుసటి సంవత్సరంగాని ఆ తరువాతగాని అదే రోజున జరగాలి.
ఓం అముక దేవాయనమః అనే మంత్రం ద్వారా ఆ వ్రతంలో ఉద్దేశించిన దేవ, దేవతకు అర్ఘ్య ప్రదానంగావించి వ్రతాన్ని పూర్తి చేయడం కోసం, వ్రత భంగ దోష నివృత్తి కోసం ఈ విధంగా క్షమా ప్రార్థన చేసి భగవంతుని శరణువేడాలి:
ఉపసన్నస్య దీనస్య ప్రాయశ్చిత్త కృతాంజలేః ।
శరణంచ ప్రసన్నస్య కురుష్వాద్య దయాంప్రభో ॥
పరత్ర భయభీతస్య భగ్నఖండ వ్రతస్య చ ॥
కురుప్రసాదం సంపూర్ణం వ్రతం సంపూర్ణ మస్తుమే ॥
తపచ్ఛిద్రం వ్రతచ్ఛిద్రం యచ్ఛిద్రం భగ్నకే వ్రతే ।
తవప్రసాదాద్దేవేశ సర్వమచ్ఛిద్రమస్తు నః ॥ (ఉత్తరపర్వం 110/13-15)
తరువాత దిక్పాలకులకు అర్ఘ్య ప్రదానం చేసి ముఖ్య దేవతల అంగపూజనలను గావించి ప్రార్ధనలను చేయాలి. బ్రాహ్మణుని వ్రతి ఈ సందర్భంలో పూజించాలి.
ఆయన ఈ విధంగా ఆశీర్వదించాలి:
వాక్యం పూర్ణం మనః పూర్ణం పూర్ణం కాయవ్రతేనతే ॥
సంపూర్ణస్య ప్రసాదేన భవపూర్ణ మనోరథః ।
బ్రాహ్మణాయత్ప్రభాషంతే హ్యనుమోదంతి దేవతాః ।
సర్వదేవమయావిప్రా నైతద్వచనమన్యథా ॥
జలధిః క్షారతాం నీతః
పావకః సర్వభక్షతాం ।
సహస్రనేత్రః శక్రోఽపి
కృతో విప్ర్తెర్మహాత్మభిః ॥
బ్రాహ్మణానాంతు వచనాద్ బ్రహ్మహత్యా ప్రణశ్యతి ।
అశ్వమేధ ఫలం సాగ్రం ప్రాప్యతే నాత్ర సంశయః ॥
వ్యాసవాల్మీకి వచనాద్ బ్రాహ్మణ వచనాచ్చ గర్గ
గౌతమ పరాశరధౌమ్యాంగిరస వసిష్ఠ నారదాది ముని
వచనాత్ సంపూర్ణం భవతు తే వ్రతం ॥ (ఉత్తరపర్వం - 110/23-27)
యజమాని బ్రాహ్మణుని సాదరంగా వీడ్కొలిపి ఈ సామగ్రినంతటిని ఆయన ఇంటికి పంపించెయ్యాలి. తరువాత పంచయజ్ఞ క్రియానంతరం భోంచేయాలి.
ఈ సంపూర్ణ వ్రతాన్ని ఒకమారు భక్తితో చేసినా, వ్రతి ఖండిత వ్రత సంపూర్ణ ఫలాన్ని పొందడమే కాక వ్రతభగ్న పాపము నుండి ముక్తుడవుతాడు. అంతేకాక, ఈ వ్రతాన్నాచరించిన వానికి ధన, రూప, కీర్తి, ఆరోగ్యాదులు ప్రాప్తించి, నూరేళ్ళపాటు భూమిపై సకల సుఖ భోగాలనూ అనుభవించి స్వర్గమును చేరి ఆపై మోక్షాన్ని పొందే మహాభాగ్యం లభిస్తుంది. మహారాజా! ప్రాయశ్చిత్త రూపకమైన ఈ సంపూర్ణ వ్రతాన్ని పరమ ప్రసన్నుడై నన్ననుగ్రహించి గర్గ మహర్షి నాకుపదేశించాడు; నాచేత చేయించాడు కూడ. జన్మాంతర వ్రతభంగాన్ని కూడా ఈ వ్రతం పరిహరిస్తుంది కాబట్టి నీవు కూడా దీన్ని అనుష్టించు.