భవిష్య పురాణము

6 - ధనానికీ స్త్రీ కీ గృహస్థాశ్రమంలో గల శక్తి - ధన సంపాదన నియమాలు సమాన వియ్యం.

“ఋషీశ్వరా! స్త్రీలకుండవలసిన లక్షణాలను మీ ద్వారా విని జ్ఞాతనైనాను. నాపై దయవుంచి వారి సదాచారములను కూడా కృపతో వినిపించాలని కోరుతున్నాను.” ప్రార్థించాడు శతానీకుడు.

చెప్పసాగాడు సుమంతుడు.

 “శతానీక మహారాజా! స్త్రీల సదాచారాలను గూర్చి కూడా బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పియున్నాడు. అదే నీకు చెప్తాను విను. స్నాతకుడైన బ్రహ్మచారి ముందుగా ధన సంపాదన మార్గం చూసుకొని అప్పుడు ఒక సర్వలక్షణ లక్షితయైన స్త్రీని శాస్త్రోక్తంగా పరిణయమాడాలి. ధనం లేకపోతే సంసార జీవితంలో సుఖం వుండదు. అందుచేత న్యాయమార్గంలో ధనం సంపాదించి వివాహం చేసుకోవాలి. మానవులు ఘోర నరకయాతనను సహించగలరేమో గానీ, ఇల్లాలూ తామూ ఆకలితో బాధపడాలనే ఊహను కూడా సహించలేరు. చిరిగిన, చివికిన బట్టలే కట్టుకొని, ఆకలితో అతి దీనంగా మారిన వదనాలతో ఇంటిలో నడయాడుతున్న ఇల్లాలినీ, పిల్లలనూ చూస్తే వజ్ర సమానమైన హృదయం కల గృహస్థుకైనా గుండె ముక్కలు చెక్కలైపోతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితికి కారకుడై, అప్పుడు కూడా పట్టించుకోకుండా ఎవడైనా వుంటే వాడు బతకడం అనవసరం. భూభారం. అయినా, స్త్రీ గ్రహణం చేసి పారవేయు అర్థహీనుడైన పురుషునికి ధర్మ, అర్థ, కామాలనే పురుషార్థాలెలా సిద్ధిస్తాయి? ఇక మోక్షమెట్లు? వానికి స్త్రీ సుఖం లభించకపోగా నూతన యాతన ప్రాపిస్తుంది. గృహిణి లేకుండా గృహస్థాశ్రమమే లేదు. అలాగే ధనం లేకపోయినా లేదు. కాబట్టి ధనహీనుడైన వ్యక్తి వివాహమాడరాదు. వానికి గృహస్థుడయ్యే అధికారం లేదు. త్రివర్గ సాధన - అంటే ధర్మార్థకామసాధన సంతానం వల్లనే సాధ్యం కాబట్టి అదే ముఖ్యం అని కొందరంటుంటారు కాని ఉత్తమ స్త్రీ మరియు ధనం - ఈ రెండే అన్ని పురుషార్థాలకీ ఆధారమనీ, సాధన హేతువులనీ నీతి విశారదుల వక్కణ. ధర్మంలో రెండు రకాలున్నాయి. ఇష్ట ధర్మ మొకటి, పూర్తధర్మ మింకొకటి. యజ్ఞాదులను చేయడం ఇష్ట ధర్మం. వాపీ, కూప, తటాకాదులను నిర్మించి జనులకు అంకితం చెయ్యడం పూర్తధర్మం. ఈ రెంటికీ కూడా డబ్బు కావాలి కదా మరి!

ధనాఢ్యుడికి బంధుత్వాలు నిలబడతాయి. దరిద్రుడు తమవాడని చెప్పుకోవడానికి కూడా, దగ్గరి బంధువులే సిగ్గుపడతారు. విద్య, కులం, శీలం మున్నగు అన్ని ఉత్తమగుణాలూ ధనికునికి ఆయాచితంగా లభిస్తాయి. దరిద్రునికి పుట్టుకతో వచ్చినవి కూడా నిలబడవు. శాస్త్ర, శిల్ప, లలితకళాదులన్నీ ధనికునే చేరి వాని చేత మరిన్ని గొప్ప ధర్మాలను చేయిస్తాయి. దరిద్రుని చేరవు కదా! ధనము లేనివాడు సర్వహీనుడై, ఏ ధర్మాన్నీ చేయలేక అజాగళస్తనం(మేకస్తనం) లాగా మిగిలిపోతాడు. వ్యర్థంగా!

పూర్వజన్మ పుణ్యఫలంగానే ఈ జన్మలో ధనం చేకూరుతుంది. ఆ ధనమే ఈ జన్మలో కూడా మనిషి చేత పుణ్యం చేయిస్తుంది. పుణ్యార్జన, ధనము అన్యోన్యాశ్రితాలు.

                      ప్రాక్ పుణ్యైర్విపులా సంపద్ధర్మ కామాది హేతు జా

భూయోధర్మేణ సాముత్ర తయాతావితి చక్రమః ।     (బ్రహ్మ - 6 - 23))

స్త్రీ రహితుడు, నిర్ధనుడు అగు వానికి త్రివర్గ సాధనాధికారముండదు. కాబట్టి భార్యా గ్రహణానికి పూర్వమే ఉత్తమ రీతిలో న్యాయ విహిత అర్థార్జన చెయ్యాలి. అపుడు తన కుటుంబానికి తగిన ధన, క్రియాదులచే ప్రసిద్ధ, అనిందిత, సుందర, ధర్మసాధన భూతయైన కన్యనే పరిగ్రహించాలి. వివాహమయ్యేదాకా పురుషుడు అర్ధ అనగా సగం శరీరుడే అయి వుంటాడు. ఒకే చక్రంతో రథం నడువలేదు. ఒకే రెక్కతో పక్షి ఎగురలేదు. అలాగే వివాహం ద్వారా భాగస్వామి రానిదే మానవ జీవితమూ కొనసాగలేదు. పెండ్లి చేసుకోని వారు కూడా చాలామంది హాయిగా జీవిస్తునే వున్నారు కదా అనే అనుమానం కొంతమందికి కలగవచ్చు. ధర్మాచరణ వివాహం వినా సాధ్యం కాదు. ధర్మాచరణ లేని జీవితం జీవితం కాదు.

పత్నీపరిగ్రహణం ధర్మ, అర్థాలకు ఉత్సాహాన్నిస్తుంది. పతి పత్నులలో పరస్పరం ప్రీతి పెరుగుతుంది. దానివల్ల ధర్మ సంబంధ, ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరతాయి. అంటే మూడవ పురుషార్థమైన కామం నిర్విఘ్నంగా జయప్రదమవుతుంది.

నీచకుల, సమానకుల, ఉత్తమకుల గతమై వివాహ సంబంధం మూడు రకాలుగా వుంటుంది. మొదటి సంబంధం నిందకు గురికాగలదు. మూడవ రకంలో మనపట్ల వారికి అనాదరముంటుంది. కాబట్టి రెండవ రకమైన సమానకుల వివాహబంధమే ఉత్తమం. ఉత్తమ కుల బంధం ఉత్తమం కాదు. ఇక్కడ కులమంటే వర్ణమే. నీచకుల మంటే మరో వర్ణమని కాదు. ఆ వర్ణంలోనే సంపదాదులు తక్కువైనది. విజాతీయ సంబంధం మంచిది కాదు. కోయిలనీ చిలకనీ ఒకే గూటిలో పెట్టి పిల్లలను పెడతాయను కుంటే ఎలా? స్నేహం పెరిగి, ఆపద వచ్చినపుడు ప్రాణానికి సైతం తెగించి ఒకరినొకరు కాపాడుకునేటంతగా పరస్పర ప్రేమ కలిగిన వారి వివాహబంధమే ఉత్తమ వివాహబంధం. ఇంతటి అతిలోక సహజమైన ప్రేమ సామాన్యంగా అన్నిట్లోనూ సమానుల మధ్యనే వుంటుంది. మిత్రత సమాన వియ్యం వల్ల పవిత్రత కూడా తోడై మరింత పెరిగి ప్రాణరక్షకం కాగలదు. ఇది సమాన వియ్యం వల్లనే సాధ్యం. “