భవిష్య పురాణము

65 - రహస్య సప్తమీవ్రతం

బ్రహ్మదేవుడింకా ఇలా చెప్పసాగాడని శతానీకునికి సుమంతుడు వివ రిస్తున్నాడు.

‘దిండీ! ఇపుడు నీకు రహస్య సప్తమీ వ్రతవిధానాన్నుపదేశిస్తాను, విను. ఈ వ్రతాన్ని ఆచరించేవాని యొక్క ఇటు ఏడుతరాలూ ఉద్ధరింపబడతాయి, రాబోయే ఏడుతరాలతో సహా. ఈ వ్రతనియమాలను పాలించువానికి ధన, పుత్ర, ఆరోగ్య, విద్యా, వినయ, ధర్మాలతో బాటు అప్రాప్యవస్తువులన్నీ ప్రాప్తిస్తాయి. ఈ వ్రతనియమాలు ఈ ప్రకారంగా వుంటాయి.

అందరితో మైత్రీభావాన్ని పెంపొందించుకుంటూ సూర్యుని గూర్చే ఆలోచిస్తూ వుండాలి. వ్రతంరోజు వ్రతి నూనెను ముట్టరాదు, నీలవస్త్రాన్ని కట్టరాదు. స్నానంలో ఉసిరికను తలఁబెట్టరాదు. ఎవరితోనూ కలహమాడరాదు. నీలవస్త్రం ధరించి ఈ రోజు ఏ సత్కర్మ చేసినా అది నిష్ఫలమే కాగలదు. బ్రాహ్మణుడొక వేళ పొరపాటున నీలపువన్నె బట్ట ధరిస్తే స్వయంశుద్ధి కోసం ఉపవాసం చేసి పంచగవ్యాలను నోటిలోకి పంపుకోవాలి. అజ్ఞానం కొద్దీ ఆ రోజు నల్లగోరింట, నీలవృక్షం పుల్లతో పళ్ళుతోముకున్న వాడు రెండు చాంద్రాయణ వ్రతాలు చేస్తే గాని శుద్ధుడు కాడు. నీల వృక్షాలున్న ఉద్యానవనంలోకి ఈ రోజు అనుకోకుండా ప్రవేశించిన వానిని పంచ గవ్యభక్షణ యే శుద్ధి చేయగలదు. నీలం ఒకమారు నేలలో విత్తబడితే ఆ భూమి పన్నెండేళ్ళ పాటు అపవిత్రంగానే వుండిపోతుంది.

రహస్య సప్తమి వ్రతంనాడు నూనెను ముట్టుకున్నవాడికి భార్యావియోగం కలుగు తుంది. ఈ దినం ఎంత దుర్మార్గులనైనా హింసించరాదు. ఈ రోజు పాట పాడడం, నాట్యమాడటం, వీణాదులను వాయించడం, శవమును చూడడం, వ్యర్థంగా నవ్వడం, స్త్రీతో శయనించడం, జూదమాడడం, ఏడవడం, సరదాకైనా అబద్ధ మాడడం, పగటి వేళ నిద్రించడం, జీవిని కష్టపెట్టడం, దంభశోక శఠములు - ఇవన్నీ ఎంత ప్రయత్నమైనా సరే చేసి పరిత్యాగం చెయ్యాలి. వీటిలో ఏ ఒక్కటీ జరగరాదు.

ఈ వ్రతాన్ని చైత్రమాసంలో ప్రారంభించాలి. సూర్యుని పన్నెండు నామాలకు, రూపాలకు క్రమంగా పూజ చెయ్యాలి. ప్రతి సప్తమినాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ప్రతి ఒక్కనికీ, నేతితో నిండిన పాత్రను, ఐదు గురివింద గింజల ఎత్తు బంగారాన్నీ దానం చేసి అలవాటైన దక్షిణను చెల్లించాలి. బ్రాహ్మణులలోనే భోజక వృత్తి వారని వుంటారు. వీలైనంత వఱకు వారినే వినియోగించాలి.

విన్నంత మాత్రానే అన్ని పాపాలూ దగ్థమై పుణ్యలోక ప్రాప్తిని కలిగించే ఈ వ్రతాన్ని చేయగలిగితే ఎంత ఫలముంటుందో చెప్పలేముకదా!’ అంటూ బ్రహ్మ అంతర్ధానం చెందాడు. దిండి కూడా సూర్యవ్రతాలన్నీ చేసి చివరికి ఆయనకు అనుచరుడు కాగలిగాడు” అని ముగించాడు సుమంతుమహర్షి.