భవిష్య పురాణము

127 - 128 - సాంబకృత సూర్యారాధన సూర్యస్తవరాజ కథనం

“మునీంద్రా! సాంబడేవిధంగా సూర్యారాధన గావించాడు? ఆ భయంకర రోగాన్నుండి అతనికి ఎలా విముక్తి లభించింది?” అని ప్రశ్నించాడు రాజు.

చెప్పసాగాడు సుమంతు మునీంద్రుడు.

“ఈ కథపై శ్రీకృష్ణానుగ్రహం కూడా వుంది మహారాజా! నేను దీన్ని విస్తారంగా వర్ణించి చెబుతాను. ఎందుకంటే దీనిని వింటే సర్వపాపాలూ దూరమౌతాయి.”

నారదుని ద్వారా సూర్యభగవానుని మాహాత్మ్యమును విన్న సాంబుడు తన తండ్రియైన శ్రీకృష్ణదేవుని వద్దకు వెళ్ళి వినయపూర్వకంగా ఇలా ప్రార్థించాడు. ‘భగవాన్! మీకు తెలియనిది లేదు. నేను దుర్వాసశాపము వశాన అత్యంత దారుణ రోగగ్రస్తుడనయ్యాను.

వైద్యులేమీ చేయలేకపోతున్నారు. ఔషధాలేవీ నారోగాన్ని శాంతపఱచ లేకపోతున్నాయి. తండ్రిగా మీరు నాకు ఆజ్ఞ నిచ్చి ఆశీర్వదిస్తే నేను వనాలలోకి పోయి తపస్సు, ఆరాధనల ద్వారా రోగవిముక్తుడనై వస్తాను.

శ్రీకృష్ణుడతని నాశీర్వదించి పంపించగా సాంబడు సింధూత్తర భాగంలో చంద్రభాగనదీ తటంలో నేడు జగత్ప్రసిద్ధమైన మిత్రవనమను పేరు గల సూర్యక్షేత్రానికి పోయి తపస్సు చేయసాగాడు. ఉపవాసంతో సూర్యారాధన తత్పరుడై ఎంత తీవ్రంగా1 తపించాడంటే (తపస్సు చేశాడంటే) ఒకదశలో అతని శరీరంలో ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆతడు ప్రతిదినమూ ఈ గుహ్యస్తోత్రం ద్వారా దివ్య, అవ్యయ, ప్రకాశమాన, ఆదిత్యమండల స్థితుడైన భాస్కర భగవానుని ఇలా స్తుతించాడు.

ఆదిరేషహి భూతానామాదిత్య ఇతి సంజ్ఞితః

త్రైలోక్య చక్షురేవాత్ర పరమాత్మా ప్రజాపతిః

ఏషవై మండలేహ్యస్మిన్ పురుషోదీప్యతే మహాన్

ఏ ష విష్ణు రచింత్యాత్మా బ్రహ్మా చైష పితామహః

రుద్రో మహేంద్రో వరుణ ఆకాశం పృథివీ జలం

వాయుః శశాంకః పర్జన్యో ధనాధ్యక్షో విభావసుః

య ఏష మండలే హ్యస్మిన్ పురుషో దీప్యతే మహన్

ఏకః సాక్షాన్మహా దేవో వృత్రమండ నిభః సదా

కాలోహ్యేష మహాబాహు ర్నిబోధోత్పత్తి లక్షణః

య ఏష మండలేహ్యస్మిస్తేజోభిః పూరయన్ మహీం

భ్రామ్యతే హ్యవ్యవచ్ఛిన్నో వాతైర్యోఽమృత లక్షణంః

నాతః పరతరం కించిత్ తేజసా విద్యతే క్వచిత్

పుష్ణాతి సర్వభూతాని ఏష ఏవ సుధామృతైః

అంతస్థాన్ మ్లేచ్ఛ జాతీయాం స్తిర్యగ్యోని గతానపి

కారుణ్యాత్ సర్వభూతాని పాసిత్వం విభావసో

శ్విత్ర కుష్ఠ్యంధబధిరాన్ పంగూంశ్చాపి తథా విభో

1. (తపించాడంటే = తపస్సు చేశాడంటే)

ప్రపన్న వత్సలో దేవ కురుతే నీరుజో భవాన్

చక్రమండలమగ్నాంశ్చ నిర్ధనాల్పాయుషస్తథా

ప్రత్యక్షదర్శీ త్వం దేవ సముద్ధరసి లీలయా

కామే శక్తిః స్తవైః స్తోతు మార్తోఽహం రోగపీడితః

స్తూయ సేత్వం సదా దేవైర్బ్రహ్మవిష్ణు శివాది భిః

మహేంద్ర సిద్ధ గంధర్వైరప్సరోభిః సుగుహ్యకైః

స్తుతిభిః కిం పవిత్రైర్వా తవ దేవ సమీరితైః

యస్యతే ఋగ్యజుఃసామ్నాం త్రితయం మండల స్థితం

ధ్యానినాంత్వం పరంధ్యానం మోక్షద్వారంచ మోక్షిణాం

అనంత తేజసాక్షోభ్యోహ్య చింత్యావ్యక్త, నిష్కలః

యదయం వ్యాహృతః కించిత్ స్తోత్రేఽస్మిన్ జగతః పతిః

ఆర్తం భక్తించ విజ్ఞాయ తత్సర్వం జ్ఞాతు మర్హసి (బ్రాహ్మపర్వం 127/10-23)

 సూర్యభగవానుడు ప్రత్యక్షమై “హే జాంబవతీ పుత్రా! నేను నీ తీవ్ర తపస్సుకీ, స్తుతికీ ప్రసన్నుడనైనాను. నీకేం కావాలో కోరుకో” అన్నాడు.

‘నీ చరణాలపై నా భక్తి ధృఢమై శాశ్వతంగా వెలుగొందాలి. ఇదే నా కోరిక’ అన్నాడు సాంబడు.

‘అట్లే అగునుగాక. నన్ను సంతుష్టపఱచావు. మరో వరం కోరుకో’.

‘నారోగాన్ని పోగొట్టి నాశరీరాన్ని శుద్ధమూ నిర్మలము చెయ్యండి మహాప్రభో.’

‘అట్లే అగును గాక’ సూర్యభగవానుడిలా అంటుండగానే ఆ సాంబుని రోగం అంతర్ధానమై మంచి కాంతి, పుష్టి, రూపసంపన్నంగా అతని శరీరం తయారైంది. సాంబడు సూర్యుని పాదాలపై పడి అలాగే వుండిపోయాడు. అప్పుడు సూర్యుడే మళ్లా ఇలా అనుగ్రహించాడు.

“సాంబా! బాగా ప్రసన్నుడనైన నేను నీకు ఇంకా వరాలను అనుగ్రహిస్తున్నాను. నేటి నుండి నా ఈ స్థానము నీపేరిట ప్రసిద్ధిపొందగలదు. లోకంలో నీ సత్కీర్తి అక్షయంగా నిలుస్తుంది. ఈ చంద్రభాగానదీ తీరాన నన్ను స్థాపించు. అని చెప్పి సూర్యభగవాను డంతర్ధానము చెందాడు.

శతానీక మహారాజా! ఈ సాంబకృత సూర్యస్తుతిని భక్తిపూర్వకంగా త్రికాలాలలో పఠించినా, వారం రోజుల్లో నూట ఇరవై ఒక్కమార్లు చదివినా, రాజ్యం కోరిన వానికి రాజ్యము, ధనము కోరిన వానికి ధనము, దివ్యమంగళ ఆరోగ్య కాంతియుక్తమైన శరీరం కోరిన వానికి అది, లభిస్తాయి.

నిజానికి సాంబడు సూర్య సహస్రనామజపం కూడా చేశాడు. సూర్యుడతనికి కలలో కనబడి ‘వత్సా! సహస్రనామాలతో నన్ను స్తుతించడం అందరికీ సాధ్యం కాదు. నీకు నేను నా అతిశయ, గోపనీయ, పవిత్రములైన ఇరువది యొక్క నామ సంగ్రహానుపదేశిస్తాను. గ్రహించు.

వై కర్తనో వివస్వాంశ్చ మార్తండో భాస్కరో రవిః

లోక ప్రకాశకః శ్రీమాఁల్లోక చక్షుర్గ్ర హేశ్వరః

లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా

తపన స్తాపన శ్చైవ శుచిః సప్తాశ్వ వాహనః

గభస్తి హస్తో బ్రహ్మాచ సర్వ దేవ నమస్కృతః (బ్రాహ్మ 128, 5 - 7)

సాంబా! ఈ నామాలంటే నాకు చాలా యిష్టము. ఇది స్తవరాజమనే పేరుతో ప్రసిద్ధిపొందుతుంది. ఇది శరీరాన్ని రోగముక్తం గావిస్తుంది. ధనవృద్ధి కరము మరియు యశస్కరం. ఈ స్తవరాజాన్ని రోజూ ప్రణతులై, నాఉదయాస్తమయ సమయాల్లో పఠించేవారికి సర్వపాపాలూ నశిస్తాయి. మానసిక, శారీరక, వాచక దుష్కృత్య ఫలాలన్నీ వినష్టమైపోతాయి. ఇదే నాకు జపము, హవనము, సంధ్యోపాసనము. బలి, మంత్రము, అర్ఘ్య మంత్రం, ధూప మంత్రాదులూ ఇదే. సూర్యుదేవులిలా ఉపదేశించిన వెంటనే మేల్కొని ఆయన అనుగ్రహం వల్ల నామజపం స్మరణకూ స్ఫురణకూ రాగా చదివి చదివి సాంబడు చరితార్థుడైనాడు.