భవిష్య పురాణము

215 - మరిచ, నింబ, ఫల సప్తమీ వ్రతాలు

            శతానీకుని కోరికపై మరి మూడు సప్తమీ వ్రతాలను గూర్చి చెప్పసాగాడు సుమంతుడు. “మహారాజా! మరిచసప్తమి అంటే మరిచ భక్షణ వుండే వ్రతం. మరిచ అనగా మిరియాలు. చైత్రశుద్ధ షష్ఠినాడుపవాసముండి సౌరధర్మవిధ్యనుసారము (విధ్యనుసారం అంటే విధి+అనుసారము)భక్తిపూర్వకంగా భాస్కరుని పూజనాచరించాలి. ‘ఓం వం ఫట్’ అను ఈ మహాబలము గల మంత్రము సాక్షాత్తూ సూర్యస్వరూపమే. దీనిని విడువకుండా వేలమార్లు స్మరణం జపం చేస్తువుంటే ఒక్క యేడాదిలోనే సూర్యదర్శనం లభిస్తుంది; వ్యాధులన్నీ నశిస్తాయి. దేహాంతమందు సూర్యలోకప్రాప్తి వుంటుంది. ప్రతి ఆత్మశుద్ధి కోసం మరిచ సప్తమినాడు సౌరమంత్రాలతో ముద్రలతో హృదయ, అంగన్యాసాలను గావించి ప్రాణాయామాదులను చేయాలి. సూర్యునికి అర్ఘ్యాన్నీ, వివిధరకాల పుష్పాలనూ సమర్పించాలి. స్నానం చేయించి నైవేద్యం పెట్టాలి. మనస్సుని పూర్తిగా అదుపులోనుంచుకొని సూర్యమంత్రాలను జపించాలి. ఆ పై మరల ముద్రలలోకి రావాలి. వ్యోమముద్ర ప్రదక్షిణం, హవనం, హృదయముద్ర ఆ పై ఏపూజకు తగినట్టు ఆ ముద్ర చొప్పున్న ఈ క్రింది ముద్రలను చూపించాలి కింకిణి, వ్యోమ, అస్ర, పద్మిని, అర్కిణి, జ్వాలిని, తేజని, గభస్తిని, శంఖిని, సూర్యవక్త్ర, సహస్రకిరణ, ఉదయ, మధ్యమ, అస్తమని, మాలిని, తర్జని, కుంభముద్ర. మహారాజా! బ్రహ్మాదులు ఈ ముద్రలతో సూర్యపూజ చేశాకనే అంతటి వారయ్యారు. తరువాత బ్రాహ్మణులకి తృప్తికరంగా భోజనాలు పెట్టాలి. సప్తమినాడు సూర్య మంత్రాలను స్మరిస్తూ మౌనంగా భోంచేయాలి.

ఆ భోజనానికి ముందే నాలుగు మిరియపు గింజలను చేతిలో వేసుకుని వాటిని

ఓం ఖఖోల్కాయస్వాహా

ప్రీయతాం ప్రియసంగదోభవ స్వాహా

            అనే మంత్రంతో ప్రార్థించి అన్నంలో కలుపుకొని తినాలి. ఈ వ్రతం చేసిన వారికి ప్రియవ్యక్తి సమాగమం వెంటనే జరుగుతుంది. ఒక ఏడాది పాటు ప్రతి సప్తమినాడూ ఈ వ్రతాన్ని చేసిన వారికి పుత్రాది వియోగముండదు. దేవరాజు ఇంద్రుడు, మహాబలశాలి నలమహారాజు ఈ వ్రతఫలితంగానే మరల భార్యలను చేరుకోగలిగారు. శ్రీరాముడు కూడా ఇదే వ్రతాన్ని చేసి సీతాదేవిని తిరిగిపొందాడు.

         నింబసప్తమి నాడు వేపాకులను సేవించాలి. ఇది సర్వవ్యాధి నివారిణియైన వ్రతం. వైశాఖ శుద్ధసప్తమిని నింబసప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజు శారంగధనువు, శంఖ, చక్ర, గదాదులను ధరించిన సూర్యదేవుని ఈ మంత్రాలతో పూజించాలి.

ఓంఖఖోల్కాయనమః!

ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభాగాయ ధీమహి

తన్నః సూర్య ప్రచోదయాత్

            ముందుగా పూజాద్రవ్యాలన్నిటినీ పై మంత్ర పూత జలాల సంప్రోక్షణతో పవిత్రీకరించి సిద్ధం చేసుకోవాలి. మంత్ర విన్యాసంతో హృదయాదులను శుద్ధి చేసుకోవాలి. సమ్మార్జనీ ముద్రతో దిశలన్నిటినీ ప్రతిబోధించాలి. భూమిని కూడా బాగా శోధించి వుంచాలి. ఈ కర్మకే అభీష్టసిద్ధి ప్రాప్తిస్తుంది.

            పవిత్రస్థానంలో కర్ణికాయుక్తమైన ఒక అష్టదళకమలాన్ని తయారుచేసి అందులోకి ఆవాహినీ ముద్ర ద్వారా సూర్యదేవుని ఆవాహనం చేయాలి. అక్కడ మనోహర స్వరూపుడైన ఖఖోల్కస్వామి సూర్యునికి స్నానం చేయించాలి. స్నానము, స్థాపన మంత్ర సహితంగానే సాగాలి. ఆగ్నేయదిశలో సూర్యభగవానుని హృదయాన్ని, ఈశాన్యంలో శిరస్సుని, నైరుతిలో శిఖినీ, తూర్పువైపు రెండు నేత్రాలనీ భావించుకోవాలి. ఆ తరువాత ఈశాన్యంలో సోముని, తూర్పులో మంగళుని, ఆగ్నేయంలో బుధుని, దక్షిణంలో బృహస్పతిని, నైరుతిలో శుక్రుని, పడమటివైపు శనిని, వాయువ్యంలో కేతువుని, ఉత్తరదిక్కున రాహువునీ స్థాపన చేయాలి. ఇక కమలానికి రెండవకక్ష్యలో సూర్యభగవానుని తేజస్సునుండి పుట్టిన రూపాలైన సూర్య, భగ, అర్యమ, మిత్ర, వరుణ, సవితా, ధాత, వివస్వంత, త్వష్ట, పూష, చంద్ర, విష్ణు అనే ద్వాదశా దిత్యరూపాలను స్థాపించాలి. తూర్పువైపు ఇంద్రునీ, దక్షిణంలో యమునీ, పశ్చిమాన వరుణుని, ఉత్తరంలో కుబేరునీ, ఈశ్వరునీ, ఆగ్నేయంలో అగ్నిదేవుని నైఋతి (నైరృతి)లో పితృదేవతలనీ వాయువ్యంలో (చాలా చోట్ల వాయువ్యం అని కనిపిస్తోంది కాని వాయవ్యమే సరైనది) వాయుదేవుని, ఆ పై జయ, విజయ, జయంతి, అపరాజిత, శేష, వాసుకి, రేవతి, వినాయక, మహాశ్వేత, రాజ్ఞీ, సువర్చలాది దేవసమూహాలను సముచిత స్థానాలలో స్థాపించాలి. ప్రతికి దక్షిణ పార్శ్వంలో సిద్ధి, వృద్ధి, స్మృతి, ఉత్పలమాలిని, శ్రీ అనే శక్తుల్ని స్థాపించుకోవాలి. తనకి ఉత్తరం వైపు, సూర్యభగవానునికి దగ్గరగా ప్రజ్ఞావతీ, విభా, హారీతా, బుద్ధి, ఋద్ధి, విసృష్టి, పౌర్ణమాసీ, విభావరీ మున్నగు దేవశక్తుల్ని స్థాపించుకోవాలి.

            అనంతరం మంత్రపూర్వకంగా ధూప, దీప, నైవేద్య, అలంకార, వస్త్ర, పుష్పాది ఉపచారాలతో సూర్యదేవుని ఆయన అనుగాములైన దేవతలనీ ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు వేపచెట్టుకి చేతులు జోడించి నమస్కరించి ఈ మంత్రం చదివి కొన్ని వేపాకులను నోట్లో వేసుకోవాలి.

త్వం నింబకటుకాత్మాసి ఆదిత్యనిలయస్తథా

సర్వరోగ హరః శాంతో భవమేప్రాశనం సదా

            ఆ తరువాత సూర్యదేవుని సమక్షంలో నేలపై కూర్చుని కొన్నిమార్లు సూర్యమంత్రాన్ని జపించి చివరగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. ఈ విధంగా శ్రద్ధగా నింబసప్తమీ వ్రతం చేసిన వారికి ఇహలోకంలో రోగవిముక్తి, పరంలో సూర్యలోకప్రాప్తి కలుగుతాయి.

         ఫలసప్తమీ వ్రతాన్ని భాద్రపదశుక్ల సప్తమినాడు ఉపవాసం చేసి సౌరవిధానంలో స్వామికి పూజ చేసి అష్టమినాడు స్నానం చేసి సూర్యదేవుని దివాకరాంశను పూజించి బ్రాహ్మణులను గౌరవంతో స్వామి ఎదుట కూర్చోబెట్టి, ఖర్జూరం, కొబ్బరికాయలు, మాదీఫలాలు, మామిడిపండ్లు పట్టుకొచ్చి వాటిని కూడా సూర్యదేవుని సమ్ముఖంలో వుంచాలి. అప్పుడు ‘మార్తండః ప్రీయతాం’ అంటూ ఆ ఫలాలను బ్రాహ్మణులకు నివేదించాలి. సర్వేభవంతు సఫలా మమ కామాః సమంతతః అంటూ ప్రతి కూడా స్వయంగా అలాటి ఫలాలనే సూర్యునికి నివేదించి భుజించాలి. ఈ వ్రతం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది.