భవిష్య పురాణము

193 -197 - సప్తమీ వ్రతం - దంతధావన విధి

            అరుణుడు సూర్యభగవానునికి ఇలా విన్నవించాడు. ‘భగవాన్! సూర్యారాధనలో దంతధావనవిధికి ప్రాముఖ్యముందని విన్నాను. ఆవిషయక జ్ఞానాన్ని ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను’.

            ‘ఓయి వినతానందనా! అయన కాలంలో, విషువ కాలంలో, సంక్రాంతులందు, గ్రహణకాలాల్లో సదా నన్ను పూజించాలి. విశేషించి సప్తమినాడు పూజ చేయాలి. సప్తములలో విశేష సప్తమీ తిథులేడు ఉన్నాయి. అవి అర్క సంపుటిక, మరీచి, నింబ, ఫల, అనోదన, విజయ, కామిక సప్తములు, మాఘమాసంలోగాని మార్గశిరంలో గాని శుద్ధసప్తమి నాడు ఉపవాసంతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఆర్హులైన వారైతే అంతవఱకూ ఆగనక్కరలేదు. ఏ శుద్ధసప్తమినాడైనా మొదలుపెట్టవచ్చు. రాత్రి ఘడియలు పూర్తి కావడానికొక సగం జాము ముందు దంతధావనం చేసుకోవాలి. ఒక్కొక్క కోరికతో వ్రతం చేసేవారు ఒక్కొక్క చెట్టు పుల్లను వాడాలి. పుత్ర ప్రాప్తిని కోరువారు మహువ (సోమలతికలాగే తియ్యటి పూలుండే ఒక చెట్టు) పుల్లనూ, బహుదుఃఖనాశనం కోసం భంగారమను మందు చెట్టు పుల్లనూ, రోగవిముక్తిని కోరువారు బృహతీ (దురదగొండి) పుల్లనూ, రేగుపుల్లనూ, ఐశ్వర్యప్రాప్తి కోసమైతే మారేడు పుల్లనూ, ధనంకోసం తాంబూలపు కాచుపుల్లనూ, శత్రునాశనం కోసం కడిమినీ, అర్థప్రాప్తికి అతి ముక్తకాల (నెమ్మి లేదా నల్లతుమికి) పుల్లనూ, గురుస్థానం కోసమైతే ఆట రూపక(అడూస) చెట్టు పుల్లను వాడి పళ్ళు తోముకోవాలి. అలాగే రావి పుల్లతో ఆ పుణ్యకాలంలో దంతధావనం చేసుకుంటే కీర్తీ, కుటుంబంలో గొప్ప ప్రతిష్టా లభిస్తాయి. గన్నేరుతోనైతే అచల పరిజ్ఞానమూ, శిరీష లేదా దిరిసెన పుల్లతోనైతే విస్తృత సంపదా, ప్రియంగు (ప్రేంకణపు) పుల్లతోనైతే పరమ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి.

            ఈక్రింది శ్లోకం ద్వారా వనదేవతను ప్రార్ధించి దంతధావన చెయ్యాలి.

వరంత్వా మభిజానామి కామదంచ వనస్పతే

సిద్థిం ప్రయచ్ఛ మే నిత్యం దంతకాష్ట నమోఽస్తుతే (బ్రాహ్మ 193/13)

            ఈ మంత్రాన్ని మూడు మార్లు జపించాలి.

            రెండవరోజు పవిత్రులై నాకు ప్రణామం చేసి మీకు నచ్చిన నా నామాన్ని జపం చేయాలి. తరువాత అగ్నిలో హవనం చెయ్యాలి. పవిత్రులై అనగా అపరాహ్ణం కాగానే మన్ను, ఆవుపేడ, పూసుకొని ఆ తరువాత నిర్మలజలంతో బాగా స్నానం చేసి, తెల్లటి వస్త్రాలను ధరించాలి.

            యథేష్ట జపానంతరము విధివత్తుగా పూజ చేసి గాయత్రి జపం చేయాలి.

            ఏ సప్తమి నాడైనా ఏవిధంగా నైనా నన్ను పూజించవచ్చు. ఉపవాసం నాడు ప్రతికి తినడానికి గాని నాకు నివేదించడానికి ఏదీ అందుబాటులో లేకపోతే దోసిట్లో నీళ్ళు తీసుకుని నాకిచ్చి. తాను త్రాగి వ్రత సమాప్తిని చేయవచ్చు. దీనిని ఉదక సప్తమీ వ్రత మంటారు.

            ఈ విధంగా అదృష్టవంతుడైన అరుణునికి సూర్యభగవానుడు ఉపదేశించాడు. అని సుమంతుడు శతానీకునికి వివరించాడు.