135 - సూర్యాభిషేకం

నారదుడు సూర్యభగవానుని స్థాపనావిధిని చెప్పసాగాడు. వేదపాఠి, పవిత్రుడు, ఆచార నిష్ఠాపరుడు, శాస్త్ర మర్మజ్ఞుడు, సూర్యభక్తుడునైన భోజకునిగాని ఇతర బ్రాహ్మణునిగాని రావించాలి. అతనిచే ఒకజాన పొడవు, వెడల్పు ఎత్తు వున్న భద్రపీఠిని స్థాపింపజేయాలి. అప్పుడు ప్రాసాదంలోనికి దేవ ప్రతిమను గొనివచ్చి దానిపై ప్రతిష్ఠింపజేయాలి. మార్గంలో ‘భద్రం కర్ణేభిః’ మున్నగు మంగళకర మంత్రాలను ఘోషిస్తుండాలి. వాద్యధ్వనులు ఆగకుండా మ్రోగుతుండాలి. ఆ తరువాత సముద్రాల, తీర్థాల, నదుల, సరోవరముల, పర్వతం నుండి జారే ప్రవాహాల జలాలతో సూర్యభగవానునికి స్నానం చేయించాలి. ఎమండుగురు బ్రాహ్మణులు, ఎనమండుగురు భోజకులు బంగారు కలశాలతో నీటిని పోస్తూ ఈ కార్యాన్ని నెరవేర్చాలి. ఈ స్నాన జలాల్లో సర్వ ఔషధి, పుష్ప, బ్రాహ్మి, సువర్చల, ముస్తా, విష్ణుక్రాంత, రత్న, సువర్ణ, గంధ, సర్వబీజ, శతావరీ, దూర్వా, మదార్, హల్దీ, ప్రియంగు, వసాది అన్ని ఔషధులనూ కలిపివేయాలి. కలశములపై మర్రి, రావి, శిరీష వృక్షాల కోమల పల్లవాలను కుశదర్భలతో బాటు పెట్టాలి. సూర్యభగవానునికి అర్ఘ్యమిచ్చి గాయత్రితో అభిమంత్రితం చేయబడిన పదహారు కలశల నుండి నీటితో స్నానం చేయించాలి. స్వర్ణకలశలు, అవి కుదరకపోతే వెండి, రాగి, మట్టితో చేయబడిన కలశలైనా ఉపయోగించి స్నానం చేయించవచ్చును. ఆ తరువాత గట్టి ఇటుకలచే నిర్మితమైన వేదిపై దర్భలను పఱచి ప్రతిమకు రెండు వస్త్రాలను కట్టి స్థాపించాలి. ఆ రోజు వ్రతం చేయాలి. మూర్తిని స్థాపించాక ఈ మంత్రాలను చదువుతూ అభిషేకాలు చేయాలి.

దేవాస్త్వామభిషించంతు బ్రహ్మవిష్ణుశివాదయః ।

వ్యోమగంగాంబు పూర్ణేన కలశేన సురోత్తమ

ఇలా ఎనిమిది శ్లోకాల్లో బ్రాహ్మ పర్వంలో 135వ అధ్యాయములో 21 నుండి 28 వరకు చెప్పబడిన మంత్రాల అర్ధం ఇది.

దేవశ్రేష్ఠ! బ్రహ్మ, విష్ణు, శివాది దేవగణాలన్నీ ఆకాశగంగతో పరిపూర్ణమైన జలాలతో నిన్ను అభిషేకించాలి గాక! దివస్పతీ! భక్తిలో అసమానులైన మరుద్గణాలు మేఘజలపరిపూర్ణమైన రెండవ కలశతో నిన్నభిషేకించాలి. సురోత్తమా! విద్యాధరులు సరస్వతీనదీజలాలతో నిండిన మూడవ కలశతో నిన్నభిషేకించాలి. దేవ శ్రేష్ఠా! ఇంద్రాది లోకపాలకులు సముద్రజలంతో నిండిన నాలుగవ కలశతో నిన్నభిషేకింతురుగాక. నాగగణాలు కమలపరాగం వేసిన సుగంధజలాలతో నింపిన పంచమ కలశతో నిన్నభిషేకించాలి. హిమవంతుడు, సువర్ణ శిఖరాలున్న మేరువు ఇతర పర్వత రాజేంద్రులతో కలిసి నైరుతసానువులపై ప్రవహించే జలాన్ని ఆరవకలశలో నింపి నిన్ను అభిషేకించాలిగాక. ఆకాశచరులైన సప్తర్షిగణాలు పద్మపరాగం నిండిన సుగంధిత జలాలున్న సప్తమ కలశతో నిన్నభిషేకించాలిగాక. ఎనిమిది ప్రకారాల మంగళాలతో నిండిన అష్టమకలశతో వసుగణాలు నిన్నభిషేకించాలి. ఇంత ఉన్నతాభిషేకాలనందుకొనే దేవ దేవా! నమస్కారములు.

తరువాత ఒక తామ్ర పాత్రలో పంచగవ్యాలుంచి వాటితో కూడా సూర్యాభిషేకం చేయాలి. వైదిక మంత్రాలు చదువుతూనే పంచగవ్యాలు తయారుచేయడం కొత్త రాగిపాత్రలో సంగ్రహించడం, స్వామిని అభిషేకించడం జరగాలి. తరువాత మంత్ర, గంధయుక్తజలంతో స్వామికి స్నానం చేయించి, శుద్ధోదకంతో మరల చేయించి బాగాతుడిచి రక్తవస్త్రాన్ని కట్టి అలంకారాలన్నీ పెట్టి ఇలా ఆవాహనం చేయాలి.

ఏహ్యేహి భగవన్ భానో లోకానుగ్రహకారక ।

యజ్ఞభాగం గృహాణ త్వమగ్నిదేవనమోఽస్తుతే

తరువాత సువర్ణపాత్ర ద్వారా సూర్యదేవునికి ఆర్ఘ్యమివ్వాలి. మరల ముందు మట్టి, పిమ్మట తామ్ర, రజత, సువర్ణ కలశలతో మంత్రాలు చదువుతూ అభిషేకం చేయాలి. అన్ని తీర్థాలనీటినీ అన్ని ఔషధులతో కలిపి శంఖంలో పోస్తూ స్వామి మస్తకం చుట్టూతిప్పాలి. మరల ఆ జలాలతో, పుష్పధూపాలిచ్చాక క్రమంగా జల, క్షీర, ఘృత, శహదా (తేనె)లతో స్వామికి స్నానం చేయించాలి.

ఈవిధంగా సూర్యనారాయణ భగవానులకు స్నానం చేయించిన వారికి అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, వాజపేయ, రాజసూయ, అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. స్నాన సమయంలో భక్తిపూర్వకంగా దర్శించిన వారికి కూడా అదే ఫలం చెప్పబడింది.

ఈ విధిలో వినియోగింపబడు బ్రాహ్మణ లేదా భోజక లక్షణాలివి, వికలాంగుడు కానీ, ఎగుడు దిగుడు అంగాలవాడు గానీ పనికిరాడు. వేదాది శాస్త్రాది విషయజ్ఞాతసుందరుడు, కులీనుడు (కులీనుడనగా కులం వాడని కాదు కనీసం మూడు తరాలుగ ఆ వృత్తిలో నున్నవాడని అర్థం.) ఆర్యావర్తదేశంలో జన్మించినవాడు అయి వుండాలి. గురుభక్తుడు, జితేంద్రియుడు, తత్త్వవేత్త, సూర్యసంబంధి శాస్త్రాలన్నీ తెలిసినవాడు అయివుండాలి.