భవిష్య పురాణము

3-4-5 - యజ్ఞాది కర్మల్లో దక్షిణమాహాత్మ్యం విభిన్న కర్మల్లో పారిశ్రామిక వ్యవస్థ - కలశస్థాపనా వర్ణన

మునులారా! యజ్ఞాది కార్యాలను దక్షిణారహితంగా గాని పరిమాణ విహీనంగా గాని ఎన్నడూ చేయరాదు, శాస్త్రంలో చెప్పబడిన కొలతలను పాటించకపోతే నరకం ప్రాప్తిస్తుంది. విధిజ్ఞులనే - అంటే పద్ధతి తెలిసినవారినే ఆచార్య, హోత, బ్రహ్మ, సహయోగి పదవులలో పెట్టుకోవాలి. విరటము లేదా కౌడీ అంటే గవ్వ. ఇవి ఎనబై అయితే ఒక పణం. పదహారు పణాలొక పురాణ, ఏడు పురాణలొక రాజముద్ర, ఎనిమిది రాజముద్రలొక స్వర్ణముద్ర. ఈ స్వర్ణముద్రలనే యజ్ఞప్రారంభంలో దక్షిణగా ఇవ్వాలి. పెద్ద ఉద్యానాల ప్రతిష్ఠాయజ్ఞంలో రెండు, కూపోత్సర్గంలో అర్ధ, తులసి, ఉసిరికయాగంలో ఒకటి చొప్పున సువర్ణ ముద్రలను దక్షిణగా ఇవ్వడం శాస్త్రవిహితం. లక్షహోమంలో నాలుగు, కోటి - హోమ, దేవప్రతిష్ఠ, ప్రాసాదఉత్సర్గలలో పదునెనిమిది సువర్ణ ముద్రలను దక్షిణగా ఇవ్వడం విధివిధానం తటాక - పుష్కరిణీ యాగాలకు అర్ధ - అర్ధ సువర్ణముద్రలనివ్వాలి. మహాదాన, దీక్షా, వృషోత్సర్గ, గయాశ్రాద్ధాలలో ఎవరి వైభవానికి తగినట్లు వారు దక్షిణలివ్వాలి. మహాభారతశ్రవణానికి ఎనభై, గ్రహయాగ, ప్రతిష్ఠాకర్మ, లక్షహోమ, అయుతహోమ, కోటిహోమ కార్యాలలో వందేసి ర(గురిగింజ) లెత్తు స్వర్ణాన్ని దక్షిణరూపంలో ఇవ్వాలి. ఈవిధంగా శాస్త్రం నిర్దేశించిన పాత్రత గల వ్యక్తికే దక్షిణనివ్వాలి. అపాత్రదానం నిష్ఫల దాయకం. వ్రతాలలో కూడా దక్షిణలివ్వాలి. దక్షిణలివ్వకుండా ఫలితం రాదు.

ఒక యజ్ఞకార్యానికి గాని మరి దేనికి గాని బ్రాహ్మణుని వరణం చెయ్యగానే అంటే ఎంచుకొని నియమించుకోగానే, ఆయనకు రత్నాలు, బంగారం, వెండి మున్నగు వాటిని దక్షిణగా సమర్పించుకోవాలి. వస్త్ర, భూదానాలు కూడా శాస్త్రవిహితమే. విధానానుసారం దక్షిణలిచ్చుకొనే సామర్థ్యం లేనివారు యజ్ఞకార్యసిద్ధికోసం దేవప్రతిమ, పుస్తకం, రత్నం, ఆవు, ధాన్యం, నువ్వులు, రుద్రాక్షలు, పండ్లు మున్నగు వాటినైనా సమర్పించుకోవచ్చును. యజ్ఞపాత్ర విషయానికొస్తే కామ్యహోమాలలో ఏకముష్టిపూర్ణపాత్ర విధానమున్నది. ఎనిమిది పిడికిళ్ళ అన్నమును కుంచికా అంటారు. ఈ ప్రమాణంలోనే పూర్ణపాత్రలను తయారు చేసి ద్వారప్రదేశంలో స్థాపించాలి.

కుండములను, కుండమలులు నిర్మించే పారిశ్రామికవిధి ఈ విధంగా వుంటుంది. నలుచదరపు కుండానికి రౌప్యాది, సర్వతోభద్ర కుండానికైతే రెండు రౌప్యాలు, మహాసింహాసనానికి అయిదు రౌప్యాలు, సహస్రార, మేరుపుష్టకుండాలకు ఒక బైల నాలుగు రౌప్యాలు, మహాగుండా లేదా కుండానికి ద్విగుణిత స్వర్ణపాదాలు, వృత్తకుండానికి ఒక రౌప్యము, పద్మకుండానికొక వృషభము, అర్థచంద్ర కుండానికొక రౌప్యము, యోనికుండ నిర్మాణంలో నొక ధేను - నాలుగు మాశల స్వర్ణము, శైవయాగంలో - ఉద్యాపనలో నొకమాశ స్వర్ణము ఇష్టకాకరణంలో ప్రతిదినము రెండు పణాల చొప్పున పారిశ్రామికమివ్వాలి. ఖండకుండం (అర్ధగోలాకారం) నిర్మాతకు పది వరాటులు, అంతకంటె పెద్దకుండానికి ఒక కాకిణి, ఏడు చేతుల కుండనిర్మాణంలో ఒక పణం, పెద్దకూపనిర్మాణంలో ప్రతిదినం రెండు పణాలు, గృహనిర్మాణములో ప్రతిరోజూ ఒక గురిగింజంత బంగారమూ, రంగులు వేయడానికి ఒక పణమూ ఇవ్వాలి.

బ్రాహ్మణులారా! ఇక కలశ విషయంలో నిశ్చితాభిప్రాయాలకొద్దాం, కలశను సక్రమంగా వినియోగించడం సకల శుభ మంగళప్రదాయకం. యాత్రలలో కూడా దీనివల్ల సిద్ధి ప్రాప్తిస్తుంది. కలశలో ఏడుగాని అయిదుగాని అంగాలుంటాయి. కలశలో కేవలం నీరు పోయగానే సరిపోదు, ఇందులో అక్షతలతో పూలతో దేవతల ఆవాహనం పూజనం కూడా ఒక భాగం. అలా చేయనివాని కలశ నిష్ఫలం. మర్రి, అశ్వద్థ(త్థ), ధవ, బిల్వ వృక్ష పల్లవాలను అంటే చిగురుటాకులను కలశపై నుంచాలి. బంగారం, వెండి, రాగి, మట్టి - దేనితోనైనా కలశను నిర్మించుకోవచ్చును. అభేద్యంగా, నిశ్ఛిద్రంగా, కొత్తగా, సుందరంగా, ఎల్లపుడూ జలపూరితంగా కలశవుండాలి. కలశనిర్మాణంలో కూడా నిర్దిష్టమైన కొలత లుంటాయి. వాటిని పాటించాలి. ఏచోట దేవతావాహన చేస్తామో ఆ చోటనే ఈ కలశనుం చెయ్యాలి. ఇంట్లో వాడుకోకూడదు. అలా చేస్తే కలశ ద్వారా మనకి రావలసిన ఫలాన్ని రాక్షసులపహరిస్తారు. ఒకస్వస్తిక గుర్తును వేసి దానిపైన కలశనుంచి నిర్దిష్ట విధిలో వరుణాది దేవతలను ఆవాహనం చేసి పూజ చేస్తే సకల సత్ఫలితాలూ ఒనగూడుతాయి.