భవిష్య పురాణము

2-3 - గోచర భూమ్యుత్సర్గము లఘూద్యాన ప్రతిష్ఠ

            (ప్రాచీన భారతదేశంలో అన్ని గ్రామాలకూ, నగరాలకూ, అన్ని దిశలలోనూ కొంతమేరకు పశువులు మేసే బయళ్ళు విడువబడుతుండేవి. వీటినే గోచర భూములనేవారు. ఆ బయళ్ళలో ముఖ్యంగా ఆవులు చాలా స్వేచ్ఛగా మేస్తూ, నెమరేస్తూ వుండేవి. జనసామాన్యం కూడా నిర్భయంగా సంచరిస్తుండేవారు. చిన్నపిల్లలు అన్నిరకాల ఆటలూ ఆడుకుంటుండేవారు. అక్కడి చెట్లు వర్షాలకే పెరిగేవి పర్యావరణం సర్వత్రా రక్షింపబడేది. ఇంటిముందూ వెనుకా పూలమొక్కలూ, కూరగాయపాదులూ పెంచబడుతుండేవి. వీటి పోషణకు పోసే నీటివల్ల నేలతల్లి చల్లబడేది. భూకంపాలు లేవు. కరువులేదు. ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలవల్ల కలుగుతున్న కష్టాలేవీ ఆనాడు లేవు. మనం మళ్ళా ఆ స్వర్ణయుగాన్ని కళ్ళచూడాలంటే ఈ పురాణంలోని ఈ అధ్యాయాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి.)

సూతమహాముని ఇంకా ఇలా చెప్పసాగాడు. “గోచర భూమిని ఉత్సర్గం చేయడం (పెంచడం, దానం) లో ముందుగా లక్ష్మీదేవినీ నారాయణుని విధ్యుక్తంగా పూజించాలి. బ్రహ్మ, రుద్ర, కరాలికా, వరాహ, సోమ, సూర్య, మహాదేవులకు క్రమంగా వివిధ ఉపచారాలతో పూజలు చేయాలి. హవన కర్మంలో లక్ష్మీనారాయణులకు మూడేసి ఆహుతులను నేతితో ఇవ్వాలి. క్షేత్ర పాలకులకు తేనెతో నొక్కొక్కలాజాహుతి నివ్వాలి. గోచర భూమిని ఉత్సర్గం చేసే విధానాన్ని అనుసరిస్తూ యూప స్తంభాన్ని స్థాపించి దానినర్చించాలి. అది మూడు హస్తాల పొడవుండి నాగఫణాలతో అలంకరింపబడి యుండాలి. ఒక చేతితో దానిని భూమి మధ్యంలో పాతాలి. విశ్వేషా.. (ఋ. 10/2/6) నాగాధిపతయే నమః అచ్చుతాయనమః, భౌమాయనమః అనే మంత్రాన్నీ నామాల్నీ ఉచ్ఛరిస్తూ యూపానికి లాజను నివేదించాలి.

మయిగృహ్లామ్య ...(యజు. 13/1) అనే మంత్రంతో రుద్రమూర్తి స్వరూపమైన ఆ యూపానికి పంచోపచార యుక్తమైన పూజను చేయాలి. ఆచార్యునికి అన్న, వస్త్ర, దక్షిణలను సమర్పించి హోతకూ ఋత్విజులకూ కూడా తగిన రీతిలో వారు కోరిన దాన దక్షిణలనివ్వాలి. ఆ తరువాత గోచర భూమిలో అక్కడక్కడ రత్నాలను జల్లి ఈ మంత్రం చదువుతూ గోచర భూమి ఉత్సర్గమును కొనసాగించాలి.

శివలోక స్తథాగావః సర్వదేవ సుపూజితాః

గోభ్య ఏషా మయా భూమిః సంప్రదత్తా శుభార్థినా (మధ్యమ - 3/2/12,13)

గోలోకంచే గోవులచే అందరు దేవతల ద్వారా పూజింపబడు శివలోక స్వరూపమేయైన ఈ గోచర భూమిని శుభాకాంక్షినై నేను ఈ భూమిని గోవులకు ప్రదానం చేసినాను. అని పై మంత్ర శ్లోకార్థము.

ఈ ప్రకారంగా సమాహిత చిత్తులై గోవులకోసమై గోచర భూమిని సమర్పించిన వారు అన్ని పాపాల నుండి ముక్తులై దేహాంతమున విష్ణు లోకమును చేరి అక్కడ కూడా పూజలందుకుంటారు. గోచర భూమిలో ఎన్ని గడ్డిపరకలు, గుల్మాలు మొలకెత్తుతాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ మహాదాని స్వర్గంలో వెలుగొందుతాడు. ఈ భూమిని రక్షించడానికి నాలుగువైపులా చెట్లను పెంచాలి. లేదా ఈ గోచర భూమి హద్దులు నిర్దిష్టంగా, నిశ్చితంగా పాటింపబడడం కోసం తూర్పువైపు వృక్షాలను నాటించి, దక్షిణం వైపు సేతువును కట్టించి, పశ్చిమం వైపు ముళ్ళ చెట్లను పెంచి, ఉత్తరంలో నూతులను నిర్మించాలి. అంటే తవ్వించాలి. మొత్తం భూమిని జలధారల ద్వారా పచ్చిక బయలుగా చెయ్యాలి. నగరాలకూ, గ్రామాలకూ గల దక్షిణం వైపు భూములను గోచర భూములకై వదిలేయడం మంచిది. గోచర భూమిని ఎటువంటి పనికైనా ఆక్రమించిన వానిని కుటుంబాల నుండి బహిష్కరించాలి. ఎందుకంటే వాడికి అనేక బ్రహ్మ హత్యలు చేసిన పాతకం చుట్టుకుంటుంది.

గోచర భూమి ఉత్సర్గ సమయంలో కట్టబడిన మండపంలో వాసుదేవునీ, సూర్యునీ పూజించి నువ్వులు, బెల్లం ఎనిమిది - ఎనిమిదిగా ఆహుతులిస్తూ హవనం చెయ్యాలి. దేహిమే.. (యజు. 3/50) అనే మంత్రాన్ని పఠిస్తూ మండపము పై నాలుగు తెల్లని కుండలను స్థాపించాలి. తరువాత సౌర సూక్తాన్ని వైష్ణవ సూక్తాన్ని పఠించాలి. ఎనిమిది మట్టి ఆకులపై ఎనమండుగురు అష్టదిక్పాలకుల చిత్రాలను (ఒక ఆకుపై ఒక పాలకుడు చొప్పున) గాని ప్రతిమలను గాని యేర్పాటు చేసి తూర్పుతో మొదలు పెట్టి వారిని స్థాపించాలి. ఇంద్ర, అగ్ని, యమాది ఈ దేవతలను గోచర భూమి రక్షకై ప్రార్థించాలి. ప్రార్థన తరువాత నాలుగు వర్ణాల జనుల, మృగాల పక్షుల క్షేమానికై వాసుదేవుని ప్రసన్నతకై గోచర భూమి యొక్క ఉత్సర్జనం చేయాలి. గోచర భూమిని తవ్వుతున్నపుడు చిన్నచిన్న జీవజలాలు మరణిస్తే ఆ పాపము తనకు అంటకూడదనీ, ఇక్కడ నడయాడే మానవ, పశు, పక్ష్యాదులకు సర్వసుఖాలు కలిగేలా చూడాలని, తమపై నిరంతరం అనుగ్రహం కలిగియుండాలని భూదాత, నిర్మాత దేవతలను ప్రార్థించాలి. ఆ తరువాత గోచర భూమికి మూడు రెట్లు కొలతతో పవిత్రీకరింపబడిన దారాలతో భూమిని ఏడుమార్లు చుట్టివుంచాలి. దారంతో దాని చుట్టూ తిరుగుతున్నపుడు సుత్రామాణం పృథివీ.. (ఋ. 10/63/10) అనే మంత్రాన్ని పఠించాలి. ఆ తరువాత ఆచార్య దేవులకు దక్షిణలివ్వాలి. మండపంలోని బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దీనులను, అంధులను, కృపణులను సంతృప్తి పఱచాలి. తరువాత మంగళధ్వనుల నడుమ తన గృహంలోకి ప్రవేశించాలి. ఇలాగే చెరువులనూ, నూతులనూ, బావులనూ నిర్మించినపుడు కూడా ప్రతిష్ఠాయాగాన్ని నిర్వహిస్తూ విశేషించి వరుణ దేవునికీ, నాగులకూ పూజలు చెయ్యాలి.

మునులారా! చిన్న, మామూలు తోటలను ప్రతిష్ఠించినపుడు మండలాన్ని నిర్మించనక్కరలేదు. శుభస్థానంలో రెండు హస్తాల స్థండిలంపై కలశను స్థాపించాలి. దానిపై విష్ణుదేవునీ చంద్రుని అర్చించాలి. ఆచార్యు నొక్కని వరిస్తే చాలు. వృక్షాలను పవిత్ర సూత్రంతో కట్టి పుష్పమాలలతో అలంకరించాలి. తరువాత వృక్షాలను జలధారలతో తడపాలి. అయిదుగురు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. వృక్షాలకు కర్ణవేధసంస్కారం చేసి సంకల్ప పూర్వకంగా వాటికి ఉత్సర్జనం చేయాలి. మధ్యప్రదేశంలో యూపస్థాపన, అన్ని దిశలలోనూ, మధ్యలోనూ అరటి మొక్కలను నాటుట, తప్పనిసరి. వేదవిధాన పూర్వకంగా నేతితో హోమం చేయాలి. తరువాత స్విష్టకృత్‌హోమ హవనాన్ని చేసి పూర్ణాహుతినివ్వాలి. వృక్షమూలంలో ధర్మ, పృథ్వి, దిశ, దిక్పాల, యక్ష దేవతలను పూజించి,అర్చించి, ప్రసన్నులను చేసుకొని ఆచార్యులను కూడా సంతుష్టపఱచాలి. దక్షిణగా అవునివ్వాలి. అన్ని పనులనూ శాస్త్రోక్తంగా పరిపూర్ణం చేసి సూర్యదేవునికి అర్ఘ్యమివ్వాలి.