భవిష్య పురాణము

21 - గౌరీ తృతీయా వ్రతము

ఏ స్త్రీ ఐతే అన్ని ప్రకారాల సుఖాలూ కావాలనుకుంటుందో ఆమె తృతీయా వ్రతం చేయాలి. ఆరోజు ఉప్పు తినకూడదు. ఈ వ్రతాన్ని అనుష్టించిన అతివకు గౌరీ దేవి ప్రసన్నురాలై రూప సౌభాగ్య లావణ్యాలను ప్రసాదిస్తుంది. మహారాజా! ఈ వ్రతం గొప్పతనమేమనగా దానిని స్వయంగా గౌరమ్మతల్లే ధర్మరాజుకు ఉపదేశించింది.

“ధర్మరాజా! స్త్రీ పురుషుల శుభం కోసమే నేనీ వ్రతాన్ని ఏర్పాటు చేశాను. దీనిని అన్ని నియమాల పుష్టితో ఆచరించిన నారీమణి నాలాగే పతితో సుఖశాంతులను, కీర్తి ప్రతిష్ఠలనూ పొందుతుంది. కన్య దీనిని చేస్తే ఉత్తముడైన పతి లభిస్తాడు. వ్రతం చేస్తున్నంత కాలం ఉప్పు నోటికి తగలరాదు. సువర్ణగౌరీ ప్రతిమను ఒక చోట ప్రతిష్ఠించి భక్తిపూర్వకంగా ఏకాగ్రచిత్తంతో గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవికి నానాప్రకార నైవేద్యాలూ అర్పించాలి. వ్రతి మాత్రం రాత్రిపూటే, అదీ లవణరహిత భోజనం చేసి ఆ స్థాపింపబడిన గౌరీ ప్రతిమ గల గదిలోనే నిద్రించాలి. రెండవ రోజు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణనివ్వాలి. ఈ వ్రతం చేసే కన్య ఉత్తమ పతిని పొంది, ఈ లోకంలో పెద్దకాలం పాటు సర్వసుఖాలు అనుభవించి పతితోబాటు ఉత్తమగతులు పొందగలదు. జీవితమంతా లవణత్యాగాన్ని పాటించాలి. ఉప్పు వేయబడిన ఏ పదార్థాన్ని ఇక తినకూడదు.

వితంతువు ఈ వ్రతాన్ని చేస్తే ఆమె స్వర్గంలో తన పతిని కలుసుకొని చాలాకాలం పాటు అక్కడ వుండే అర్హతనీ అదృష్టాన్నీ పొందుతుంది. ఇంద్రాణి ఒకప్పుడిదే వ్రతాన్ని చేసి పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచింది. అరుంధతి ఇదే వ్రతం ద్వారా పతితో సహా ఆకాశంలో అత్యుత్తమ స్థానాన్ని చేరుకోగలిగింది. రోహిణి ఈ వ్రతం ద్వారానే చంద్రుని ప్రియతమ పత్ని అయింది.

మహారాజా! మాఘ, భాద్రపద తృతీయల నాడు ఈ వ్రతాన్ని అనుష్టించడం స్త్రీలకు చాలా మంచిది.

వైశాఖ తదియ అందరికీ మంచిది. అంటే ఆ రోజు స్త్రీ పురుషులిద్దరూ కలిసి వ్రతాన్ని మొదలుపెట్టి బెల్లాన్ని, ఉప్పునీ దానం చెయ్యాలి. మాఘమాసంలో చేసేవారు శంకర ప్రీతికై మోదకాలను, జలాన్నీ దానం చెయ్యాలి. వైశాఖ తదియనాడు చందన మిశ్రిత జలాన్ని మోదకాలతో సహా దానమిస్తే, బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. దేవతలు వైశాఖ తదియకే అక్షయ తృతీయ అని పేరు పెట్టారు. ఈరోజు అన్నం, బంగారం, వస్త్రాలు, భోజనాలు దానం చేసిన వారికి అన్ని ఫలాలు అక్షయంగా ప్రాప్తిస్తాయి. ఈ రోజు ఏది దానమిస్తే అది ఆ వ్యక్తి ఇంటిలో అక్షయంగా నిలిచిపోతుంది. ఆ వ్రతం చేసిన వారికి ఆదిత్యలోకం ప్రాప్తిస్తుంది.