భవిష్య పురాణము

29 - 30 - వినాయక పూజామాహాత్మ్యము

“గురుదేవా! మీ ద్వారా నేను వినాయకారాధన విషయమై వినగోరుతున్నాను” అన్నాడు శతానీకుడు

చెప్పసాగాడు సుమంతుడు.

“రాజా! గణేశారాధనకి తిథి, నక్షత్రం, ఉపవాసం ఏమీ అవసరం లేదు. శ్రద్ధగా, భక్తితో ఏరోజు ఆయనను పూజించినా అభీష్టఫలాలందించే భగవానుడాయన. కోరికను బట్టి పూజా వస్తువులు మారుతుంటాయి. గణపతి మూర్తిని శాస్త్ర ప్రకారం తయారు చేసి ఈ గణేశగాయత్రిని జపించాలి.

మహాకర్ణాయ విద్మహే

వక్ర తుండాయ ధీమహి

                            తన్నో దంతిః ప్రచోదయాత్  (బ్రాహ్మ - 30/6)

(పరంపరగా వస్తున్న గణేశగాయత్రిలో ‘మహాకర్ణాయ’కి బదులు ‘ఏకదంతాయ’ అని వుంది).

ఉపవాసం చేయదలుచుకున్నవారు ఏ శుక్ల పక్ష చతుర్థి నాడైనా ఈ పూజను చేయవచ్చును.

ఈ పూజను చేసిన వారికి సకల కార్యాలు సిద్ధించడమే కాకుండా అన్ని అరిష్టాలు దూరమై పోతాయి. శ్రీ గణేశుడెవరిపట్ల సంతుష్టుడవుతాడో వానిపట్ల సర్వ దేవతలు, పితరులు, మానవులు కూడా ప్రసన్నులౌతారు. ఆయన అనుకూలుడైతే విశ్వమంతా మనకి అనుకూలమే.”