భవిష్య పురాణము

72, 73 - జంబూద్వీపంలో సూర్యారాధనకు మూడు ప్రముఖస్థలాలు కృష్ణ పుత్రునికి దుర్వాస శాపము

“మునీంద్రా! కొన్ని ఆరాధనలపై స్థలప్రభావం కూడా వుంటుందంటారు కదా! మరి సూర్యారాధన శీఘ్రంగా ఫలించే స్థానం జంబూ ద్వీపంలో వుందా?” అడిగాడు రాజేంద్రుడు. చెప్పసాగాడు మునీంద్రుడు. “రాజా! ఈ జంబూద్వీపంలో మూడున్నాయి. మొదటిది ఇంద్రవనం. రెండవది ముండీరం. మూడవది కాలిప్రియం. ఈ మూడూ కాక బ్రహ్మ చెప్పిన నాలుగో స్థానమొకటుంది. అది చంద్రభాగానదీ తీరాన వుంది.

దానిని సాంబపురమంటారు. సూర్యభగవానులు సాంబుననుగ్రహించి అతని కోరిక మేరకు, లోక కళ్యాణం కోసమై, తన ద్వాదశరూపాలలో నొకటైన మిత్రరూపంలో నివసించడాని కంగీకరించాడు. అక్కడ ఎవరు పూజ చేసినా ఈయనే స్వయంగా స్వీకరిస్తాడు. సూర్యుని యొక్క పన్నెండవరూపమైన విష్ణువే వాసుదేవ కృష్ణుడై ఇలలో అవతరించాడు. ఆయన పుత్రుడు సాంబని పేరుని, అతని సమస్యను ఇదివరకు కొంత విన్నావు కదా! ఇపుడు మరింత వినిపిస్తాను.

రుద్రుని అవతారభూతుడైన దుర్వాసముని ఒకరోజు ద్వారకలో ప్రవేశించాడు. తెలిసిన వారు వంగి వంగి నమస్కారాలు చేయసాగారు. జాంబవతీ కృష్ణుల పుత్రుడు, మహాబలశాలి, గొప్ప అందగాడునైన సాంబునికి తెలియదు. ఆయన రూపాన్ని, నడకనీ చూసి నవ్వుకున్నాడు. అంతటితో ఆగకుండా దుర్వాసుని లాగే ముఖ కవళికలను పెట్టి, కాస్త వికృతంగా కూడా నటిస్తూ ఆయనలాగే నడుస్తూ వెక్కిరించ సాగాడు.

తన రూపాన్ని యవ్వనాన్ని ఐశ్వర్యాన్నీ చూసుకొని అహంకారంతో ఈ విధంగా ప్రవర్తించిన సాంబుని దుర్వాసుడు శపించిన వైనాన్ని ఇదివరకే విన్నావు కదా. అందుకే దేవతలను గురువులను బ్రాహ్మణులను పూజించాలి లేదా ఊరుకోవాలి. అంతేగాని వెక్కిరించుట, అవమానించుట ప్రమాదకరము. ఈ దుర్వాసమునినే మళ్ళా అవహేళనం చేసి యాదవులు శాపగ్రస్తులై ముసలాన్ని కని సర్వనాశనమై పోయారు కదా!

బ్రహ్మ శివునికి ఈ సందర్భంలోనే ఇలా రెండు శ్లోకాలను ప్రవచించి యున్నాడు.

యో ధర్మశీలోజితమానరోషో, విద్యావినీతో నపరోపతాపీ

స్వదారతుష్టః పరదార వర్జితో, నతస్యలోకే భయమస్తికించిత్ I

స్వతథా శశీ న సలిలం, నచందనంనైవ శీతలచ్ఛాయా

ప్రహ్లాదయతిపురుషం, యథాహితా మధురభాషిణీ వాణీ (బ్రాహ్మ73/47;48.)

ధర్మాత్ముడై, క్రోధాన్ని జయించి, విద్య ఉండీ వినమ్రుడై, ఇతరులను బాధించక, తన స్త్రీలతో సంపూర్ణ తృప్తినొంది, ఇతరస్త్రీ అనే ఆలోచననే పరిత్యజించిన వానికి ఈ లోకంలో ఏ భయమూ లేదు.

చక్కని చల్లని మాటలతో ఇతరులను ఆనందిపజేయగలిగిన వాడు ధన్యుడు. ఎందుకంటే మధురభాషణం కలిగించే ఆనందం చల్లని నీరు, చందమామ, చందనం, చల్లనినీడ అవి అత్యవసరమైన సమయంలో కలిగించే ఆనందం కన్న గొప్పది.

ఆ తరువాత శ్రీ కృష్ణుని అనుగ్రహభాషణాన్ని విని ఆచరించి శాపముక్తుడైన సాంబడు తన పేరనే ఒక నగరి నిర్మించి అందులో సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు.”