భవిష్య పురాణము

74 - శ్రీసూర్య ద్వాదశ మూర్తులవర్ణన

“మునీంద్రా! సాంబునిద్వారా చంద్రభాగ నదీతీరాన నిర్మింపబడిన ఈ పూజాస్థానం ప్రాచీనమేమీ కాకున్నా ఇంత మాహాత్మ్యము నెట్లు సంతరించుకున్నది?” అని అడిగాడు సుమంతుడు. అర్వాచీన విషయాల పట్ల అనాదరణ మానవ సహజం కదా!

“భారతవీరా! అది సనాతన కాలం నుండే సూర్యనారాయణ స్థానం. సాంబుడు దానిని ప్రతిష్ఠించడం బాగా తరువాత జరిగింది.

ఆ స్థలంలో సూర్యభగవానుడు తన మిత్రరూపంలో తపస్సు చేశాడు. అవ్యక్త పరమాత్ముడైన ఆయనే అంతటినీ సృష్టించి మరల తన సృష్టిలో తానే పన్నెండు రూపాలలో అదితి గర్భమున జనించి ఆదిత్యుడైనాడు. ఆ మూర్తుల పేర్లను ఇదివరకే విని యున్నావు కాదా. ఒక్కొక్కమూర్తి ద్వారా ఒక్కొక్క మహాకార్యాన్ని ఆయన నెరవేర్చాడు. ఇంద్రరూపంలో దానవ సంహారం, ధాతగా ప్రజాపతియై సృష్టిరచన, పర్జన్యరూపంలో కిరణాలద్వారా అమృతవర్షం, పుంసామూర్తిగా మంత్రస్థితుడై ప్రజాపోషణ, త్వష్టగా వనస్పతులలో నిలచి ఔషధప్రసాదము, అర్యమరూపంలో జనావాసములలో నిలచి ప్రజాక్షేమరక్షణ, భగమూర్తిగా భూమి క్రింద, పర్వతాలలో నిండి పోషకపదార్థాల సృజన, వివస్వంత రూపంలో అగ్నిలో నుండి అన్నాదుల పచనము, అంశరూపంగా చంద్రుడై అమృతానందమయంగా లోకాన్ని చేయడం, విష్ణురూపంలో అవతారాలెత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, వరుణ రూపంలో సముద్రంలో నివసిస్తూ జలములచే జనములను పోషించుట, పన్నెండవదైన మిత్రరూపంలో చంద్రభాగానదీతీరాన జగత్కళ్యాణానికై జపతపములను చేయుట - ఇవన్నీ భగవంతుడు మనకొఱకై నెరవేర్చుచున్న మహాకార్యములు.

సాంబపురిగా పరిణమించుటకు ముందే ఇక్కడ వాయు భక్షణం మాత్రమే చేసిపెద్దకాలము పాటు తపస్సు చేసిన భగవంతుని రూపము పేర ఇది మిత్రపదమనీ, మిత్రవనమనీ పిలువబడుతున్నది. పిలబడుతుండేది.