భవిష్య పురాణము

40- 45 - ఆచరణ శ్రేష్ఠత

“గురుదేవా! ఎవరు ఏవిధంగా ప్రవర్తించాలి? శ్రేష్ఠత అనేది ఎలా వస్తుంది? అని అడిగాడు రాజు.

“రాజా! అన్ని అంగాలతో సహా వేదాన్ని కంఠోపాఠం పట్టేసినంత మాత్రాన ఒక వ్యక్తి పవిత్రుడని గాని శ్రేష్ఠుడని గాని చెప్పలేమని న్యాయశాస్త్రకారులంటారు. వేదాచారహీనత ఎంతటివాడినైనా హీనుడినే చేస్తుంది. మంచి ఆచరణే శ్రేష్ఠతనిస్తుంది. కేవలం విద్యకాదు. దుష్టుడి వేద విద్య నపుంసకుని చేతిలోని స్త్రీ రత్నం లాంటిదే.

ఉత్తమ సంస్కారం గలవారు కూడా దురాచరణ ద్వారా పతితులై నరకంలో పడతారు. సంస్కారహీనులు కూడా ఉత్తమాచరణ ద్వారా పవిత్రులై స్వర్గలోక ప్రాప్తి నొందగలరు. మనసులో దుష్టత్వం పేరుకుపోయినవాడు బయటికి ఎంత సంస్కారవంతునిగా పుట్టిపెరిగినా, వైదిక ధర్మాలన్నిటిని పాటించినా ఆ వ్యక్తి మలినుడే. క్రూరకర్ముడు, బ్రహ్మహంతకుడు, గురుపత్నిని కామించినవాడు, దొంగ, గోహంతకుడు, తాగుబోతు, పరస్త్రీ సంభోగి, మిథ్యావాది, నాస్తికుడు, వేద నిందకుడు, నిషిద్ధ కర్మాచారి... ఇలాంటి వారు బ్రాహ్మణవర్ణులైనా, అన్ని వైదిక సంస్కారాలచే సంపన్నులైనా వేద వేదాంగపారంగతులైనా వారికి సద్గతులు కలగవు. దయాహీనులు, హింసకులు, అతిశయదాంభికులు, కపటులు, లోభులు, చాటున కొండెములు చెప్పువారు, అతిశయదుష్టులు వేదం చదివి కూడా సమాజాన్ని తప్పుదారి పట్టించేవారు ఆ వేదమునే అమ్ముకునేవారు, మోసం చేసి బతికేవారు అగ్రవర్ణులైనా మానవులుగా అధమాధములు.

గ్రాహ్యమేదో అగ్రాహ్యమేదో గ్రహించినవారు, అన్యాయాన్ని కుమార్గాన్నీ త్యజించినవారు, సత్యవాదులు, సదాచారులు, నియమపాలకులు, జితేంద్రియులు, ఆచార సదాచరణలో స్థిరులు, అందరి హితాన్నే కోరేవారు, వేదవేదాంగాల శాస్త్రాల మర్మమెరిగినవారు, సమాధి స్థితులు, సంగరహితులు, అత్యాసక్తి లేనివారు, వేదం చదవడం చెప్పడం, ఇష్టపడి చేసేవారు, అహంకారం లేనివారు, తపస్వులు, అన్ని శాస్త్రాలనూ సమాజహితం కోసం శ్రద్ధగా చదివేవారు బ్రాహ్మణులనబడతారు. ఇన్ని మంచి లక్షణాలుంటేనే వారిని భూదేవులని, భూసురులని పూజించేవారు.

శమ, దమ, తప, శౌచ, క్షమ, ఋజుత, జ్ఞాన, విజ్ఞాన, ఆస్తిక్యాలు బ్రాహ్మణుల సహజగుణాలు, సహజ కర్మాలు. జ్ఞాన రూపమైన శిఖ, తపోరూపమైన యజ్ఞోపవీతము బ్రాహ్మణలక్షణాలని మనుధర్మశాస్త్రం చెబుతోంది. పాప కర్మలకు జీవితాంతం దూరంగా వుంటూ ఉత్తమాచరణ చేసేవాడు బ్రాహ్మణసమానుడౌతాడు. శీలయుక్తుడైన శూద్రుడు, ఆచార రహితుడైన బ్రాహ్మణుని కంటె నుత్తమ బ్రాహ్మణుడు.