భవిష్య పురాణము

110 - అనంత, అవ్యంగ సప్తమీ విధానాలు

శ్రీనాథా! భాద్రపద శుద్ధ సప్తమినాడు సాధకుడు జితేంద్రియుడై సప్తాశ్వ రథారూఢుడైన సూర్యనారాయణునికి ప్రణామం చేసి పుష్పధూపాది సామగ్రితో ఆయనను పూజించాలి. క్రూరులతో, దురాచారులతోనూ మాట్లాడరాదు. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి రాత్రి మౌనంగా భోంచేయాలి. సర్వకాల సర్వావస్థలలో వ్రతియైనవాడు, ఈ వ్రతాధినేతయైన ఆదిత్యనామస్మరణే చేస్తుండాలి. వరుసగా పన్నెండు మాసాలపాటు ప్రతి సప్తమినాడూ ఈ పూజను చేయాలి. పారణదినమున పురాణ కాలక్షేపం చేయించాలి. సూర్యదేవుడు ప్రసన్నుడై వ్రతికీ, పురాణ శ్రవణం చేసిన వారికీ కూడా అనంత ఫలాలనిస్తాడు కాబట్టి ఇది అనంతసప్తమి.

శ్రావణ శుక్ల సప్తమినే అవ్యంగసప్తమి అంటారు. సప్తాశ్వవాహనుడైన సూర్యుని పుష్పధూపాదులతో పూజించాలి. క్రూరులతో దురాచారులతో సంభాషించరాదు. నియమబద్ధంగా వుండాలి. బ్రాహ్మణునికి దక్షిణనిచ్చి మౌనంగా భోంచేయాలి. ప్రతి సంవత్సరం ఆబ్రాహ్మణునికే అవ్యంగాన్ని చేసి నివేదించాలి. అవ్యంగమనగా సూత్రము. ఈ దారమును ఆ బ్రాహ్మణుని కటి ప్రదేశంలో కట్టి భోజనం పెట్టాలి. అవ్యంగ సమర్పణ సమయంలో వాద్యాలను మ్రోయించాలి. వేదమంత్రోచ్చారణ చేయించాలి. శ్రావణమాసంలో అన్యదేవతలందరికి పవిత్రార్పణ చేసే ఆచారముంది. సూర్యదేవునికి ఇలా అవ్యంగంతో పవిత్రార్పణ చేయాలి. ఇలా పన్నెండు మాసాలపాటు చేసి పారణ దినమందు బ్రాహ్మణులను భోజన దక్షిణలతో సంతృప్తి పఱచినవానికి అఖండ సూర్యలోకప్రాప్తి కలుగుతుంది.