భవిష్య పురాణము

1 - ప్రతిసర్గ పర్వం 4వ ఖండం - కలియుగంలో ఉత్పన్నులైన ఆంధ్రవంశీయరాజులు

“పౌరాణికాగ్రేసరా! అగ్నివంశంలో ఉత్పన్నులైన ప్రమర, చయహాని, పరిహారాది రాజవంశాలను గూర్చిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మాలో రగులుకొంటున్న జిజ్ఞాసను శాంతింపజేయండి. భగవంతుడైన హరి అవతరించి కలియుగంలో కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో మాకు వినిపించండి” అని కోరాడు నైమిషారణ్యంలో సత్ర్తయాగా థ్వర్యుడైన ఆచార్య దేవుడు శౌనకుడు.

ప్రవచింపసాగాడు సూతమహర్షి.

“మునిశ్రేష్ఠా! దక్షిణ దిశలో జగదంబ అనుగ్రహంవల్ల నేర్పడిన అంబావతీ పురరాజులలో గంధర్వసేన, విక్రమాదిత్యుల దాకా ఇదివఱకే చెప్పుకున్నాము కదా! విక్రముడు వంద సంవత్సరాలు రాజ్యం చేసి స్వర్గారోహణం చేయగా అతని పుత్రుడు దేవభక్తుడు పదేళ్ళే రాజ్యం చేయగలిగాడు. అతనిని దుష్టులైన శకులు చంపేశారు. అతని పుత్రుడయిన శాలివాహనుడు మహాపరాక్రమవంతుడు. శకులపై పగ తీర్చుకొని వారి నోడించి దాసోఽహమనిపించి అరవై సంవత్సరాలు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు. ఆ తరువాత శాలిహెూత్రుడు, శాలివర్ధనుడు, శకహంత, సుహెూత్రుడు, హవిర్హోత్రుడు, ఇంద్రపాలుడు వారసులుగా రాజ్యానికి వచ్చారు. ఒక్కొక్కరు యాభయి సంవత్సరాల చొప్పున పరిపాలించారు. ఇంద్రపాలుడు ఇంద్రావతీ (ఇందౌర్) నగరాన్ని నిర్మించాడు. అతని పుత్రుడు మాల్యవంతుడు, అతడు మాల్యవతీ నగరాన్ని నిర్మించాడు. ఇతని రాజ్యకాలంలోనే దారుణమైన కరవు నాలుగు సంవత్సరములపాటు చెలరేగింది. బియ్యపు గింజ కంటికి కనబడడమే గగనమైపోయింది. రాజు కూడా ఆకలిదప్పులను అనుభవింపవలసి వచ్చింది. మాల్యవంతుడు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించాడు. అతి కష్టం మీద ధాన్యపు గింజలను కొన్నిటిని సంపాదించి వాటినే పవిత్రీకరించి దేవునికి నివేదించి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు భగవంతుడు ప్రసన్నుడై ‘రాజా! ఇక నీ కష్టములు అంతమవుతాయి. నీ వంశీయుల రాజ్యాలలో ఇక ఎప్పుడూ కరవు రాదు’ అని చెప్పాడు.

మాల్యవంతుని తరువాత వంశానుగతంగా శంకర భక్తుడు శంభుదత్తుడు, భౌమరాజు, వత్సరాజు, భోజరాజు, రెండవ శంభుదత్తుడు, బిందుపాలుడు ఒక్కొక్కరూ నలుబది యేండ్లకు పైగా రాజ్యం చేశారు. బిందుపాలుడు బిందుపాల రాష్ట్ర నిర్మాత. అతని పుత్ర పౌత్రాదులు వరుసగా రాజపాలుడు, మహీనరుడు, సోమవర్మ, కామవర్మ, భూమిపాలుడు, రంగపాలుడు రాజ్యపాలనం చేశారు. వీరిలో భూమిపాలుడు ఒక అందమైన సరోవరాన్ని త్రవ్వించి, దాని తీరాననొక సుందరనగరాన్ని నిర్మింపజేశాడు.

భూమిపాలుడు రాజు కాగానే అనేక రాజులపై విజయాన్ని సాధించి ఈ పుడమిపై వీరసింహుడను పేరిట విరాజమానుడయ్యాడు. ఆ తరువాత తన పుత్రుడైన రంగపాలుని రాజుగా అభిషేకించి తపస్సు చేసుకోవడానికి వనాలలోకి వెళ్ళిపోయాడు. రంగపాలుడు కూడా ఉత్తమరాజుగానే పేరుపొందాడు. అతని కుమారుడు కల్పసింహునికి చాలాకాలం దాకా సంతానం కలుగలేదు. ఒకమారతడు గంగా తటానికి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ప్రసన్నమనస్కుడై బ్రాహ్మణులకు రకరకాల దానాలు చేశాడు. ఆ ప్రాంతంలో కల్పక్షేత్రమను పుణ్యభూమిని చూసి అక్కడొక సుందర నగరాన్ని నిర్మించాడు. అది ‘కలాప’ నామంతో ప్రసిద్ధి చెందింది. అక్కడ రాజ్యం చేస్తున్న కాలంలో ఆతనికి గంగమ్మ కృపవల్ల గంగాసింహుడను పుత్రుడు కలిగాడు. ఈ గంగాసింహుడు పెరిగి పెద్దవాడై తొంభై సంవత్సరాలు రాజ్యపాలన చేసి కురుక్షేత్ర యుద్ధంలో మరణించి వీరస్వర్గాన్నలకరించాడు. అతనికి సంతానం లేదు.

మునులారా! ఈవిధంగా పవిత్ర ప్రమర వంశం సమాప్తమై పోయింది. గంగాసింహుని బంధు గణంలోని క్షత్రియులు చెల్లాచెదరై స్త్రీల ద్వారా వర్ణ సంకరానికి పాల్పడి వైశ్యవృత్తిలో కొందరు స్థిరపడగా కొందరు మ్లేచ్ఛులై పోయారు.”

(స్మిత్ మున్నగు పాశ్చాత్య చరిత్రకారులకు ఆంధ్రరాజుల నుండి హర్షవర్ధనుని దాకా గల ఆంధ్ర చరిత్ర సూత్రం దొరకక అది ఆ ప్రాంతపు అంధకారయుగంగా తేల్చివేశారు కాని శాలివాహనుని నుండి గంగాసింహుని దాకా గడచిన నాలుగు వందల సంవత్సరాల చరిత్రను విస్మరించారు. దీనిని పరిగణించి ఇది ఆంధ్రుల చరిత్రయే అన్న కోణంలో పరిశోధిస్తే చరిత్రకారులకు మంచిది.) - సంపాదకులు