171-172 - సౌరధర్మంలో సదాచరణ

            మహారాజా! ఇపుడు సౌరధర్మానికి సంబంధించిన సదాచారాలను సంక్షిప్తంగా వర్ణిస్తాను. విను. సూర్యోపాసకులు ఆకలి దప్పికలతో అలమటించే వారిని దీనులను దుఃఖితులను, అలసినవారిని, మలిన వస్త్రులను, రోగులను తమ శక్తికి తగ్గకుండా, శక్తివంచన లేకుండా ఆదుకోవాలి. దీనివల్ల వారి కోరికలన్నీ తీరుతాయి. పతిత, నీచ, చండాల, పక్షి జాతిభేదం, ప్రాణి భేదం లేకుండా తమకున్నదానిలోనే అన్ని ప్రాణులకూ ఆహారం పెట్టాలి. తమకున్న వస్తువులలోనే కొన్నిటిని దానంచెయ్యాలి. ఈ కరుణాపూరిత చర్య ఎన్నో అక్షయ ఫలాలనీయగలదు. అన్ని ప్రాణులపైనా దయజూపాలి. మధురమైన మాట ఇహపరలోకములలో సుఖాన్నిస్తుంది. మాట అమృత ప్రవాహం వలె, చందనస్పర్శ వలె ఉండాలి. ధర్మయుక్తంగా కూడా వుండాలి. ఇది స్వర్గానికి అచలమైన సోపానం. దీనితో పోలిస్తే దాన, పూజన, అధ్యాపనాదులన్నీ వెలవెలబోతాయి. అతిథి ఇంటి గుమ్మంలో కనబడగానే ఎదురేగి సాదర స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేయాలి. యాత్రలకు బయలు దేరే వారిని తనంతటతానే పోయి పలుకరించి మీమార్గం మంగళ మయమగుగాక! మీరు సర్వధర్మ కార్యాలనూ సుఖంగా సాధించుకొని వత్తురుగాక! అంటూ శుభాకాంక్షను తెలియజేయాలి. అన్ని సమయాలలోనూ ఆశీర్వాదాత్మక వచనాలను పలకాలి. ప్రత్యేక సమయాల్లో నమస్కారపూర్వకంగానో స్వస్తి సమన్వితంగానో మాట్లాడాలి. ఈ రకమైన ఆచరణను అనుష్ఠించిన వ్యక్తి పాపాలన్నీ నశించిపోగా సూర్యలోకంలో ప్రతిష్ఠితుడౌతాడు. సూర్యభగవానునిపై ఎంతభక్తిని కలిగివుంటామో అంతే భక్తిని సూర్యభక్తులపై కూడా కలిగివుండాలి. పగ తీర్చుకోవాలనే ఆలోచనే రానీయరాదు. అన్ని పుణ్యతీర్థాలలో మునగడం కంటే క్షమయే ఎక్కువ పుణ్యానికి సమీపమార్గం, జ్ఞాన, యోగ, తప, యజ్ఞ, దానాది సత్ర్కియలవచ్చే ఫలమంతా ఒక్కసారి క్రోధంతో ప్రవర్తిస్తే నాశనమైపోతుంది. కోపము చీకటి కూపము. కాబట్టి దాన్ని దరిజేరనీయరాదు. అప్రియవాణి మర్మాలను, ఎముకలను, హృదయాన్ని చివరికి ప్రాణాన్నే మండించిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కటువుగా మాట్లాడరాదు. క్రోధికీ, అప్రియ వచస్కుడికీ సూర్యనారాయణుని కరుణ ప్రాప్తించలేదనుకోవాలి. ఎందుకంటే క్షమ, దానం, తేజస్విత, సత్యం, శమం, అహింస ఇవన్నీ ఒక వ్యక్తిలో సూర్యభగవానుని కరుణ ఉంటేనే ఉంటాయి.

            నరోత్తమా! ఈ సౌరధర్మం పాపనాశకం, సూర్యప్రియకరం, పరమ పవిత్రం. మన యాత్రలో దారిలో ఎక్కడైనా సూర్యార్చన, సూర్యపూజన జరుగుతుంటే అక్కడ సూర్యుడు స్వయంగా కొలువున్నాడని భావించాలి. సూర్యమందిరం కనిపిస్తే ఆగి ఆయనకు నమస్కరించి ముందుకు సాగాలి. దేవ - పర్వాల్లో, ఉత్సవదినాల్లో శ్రాద్ధ, పుణ్యకర్మాలలో సూర్యదేవుని పూజించాలి. దేవగణాలు, పితృగణాలు అంతా సూర్యునాశ్రయించే వుంటారు కాబట్టి సూర్యుని పూజిస్తే వారు కూడా ప్రసన్నులౌతారు. జ్ఞానం సూర్యోపాసన వల్లనే వస్తుంది. దాని ద్వారా యోగం, వైరాగ్యం లభిస్తాయి. సూర్యయోగం సాధకుని సర్వజ్ఞుని గావిస్తుంది. పరిపూర్ణునిగావిస్తుంది. తన ఆత్మలోకి తానే తొంగిచూసుకునే ఆత్మశక్తినిస్తుంది. సూర్యలోక ప్రాప్తినిస్తుంది.

            బ్రహ్మచర్యం, తపం, మౌనం, క్షమ, అల్పాహారం ఈ అయిదూ తపస్వుల విశిష్ట గుణాలు. భాగ్యం బాగుండి సమకూడినది గాని న్యాయమార్గంలో సంపాదించినది గాని అయిన ధనాన్ని గుణవంతులైన వ్యక్తులకివ్వడాన్నే దానమంటారు. వేలకొలది సస్యరాశులకు పుట్టినిల్లె, జలయుక్తమై వున్న నేలని దానం చేస్తేనే అది భూదానమవుతుంది. ఏ దోషమూలేని, కులీన, అలంకృత కన్యను నిర్ధనుడైనా, విద్వాంసుడైన ద్విజునకివ్వడాన్నే కన్యాదానమంటారు. మధ్యమ, ఉత్తమ నవీన వస్త్రాన్నెవరికిచ్చినా వస్త్రదానమవుతుంది.

            ఒక మాసంలో రెండు వందల నలభై గ్రాసముల భక్షణ మాత్రమే చేయుట చాంద్రాయణ వ్రతమనబడుతుంది. శుక్ల పక్షం రోజుకొక గ్రాసాన్ని పెంచుకుంటూ, కృష్ణపక్షం లో తగ్గించుకొంటూ పోవాలి. అన్ని శాస్త్రాలూ తెలిసినవారు, తపఃపరాయణులు, ఋషులు లేదా దేవతలు వీరిచేత సేవించబడిన జల - స్థానములను తీర్థాలంటారు. సూర్యసంబంధి స్థానాలను పుణ్యక్షేత్రాలంటారు. ఇక్కడ మరణించిన వ్యక్తి సూర్యసాయుజ్యాన్ని పొందుతాడు. తీర్థాలలో గావించు దానాలు, ఉద్యానాది నిర్మాణాలు, దేవాలయ, ధర్మశాలాది నిర్మాణాలు అక్షయ ఫలితాలనిస్తాయి. క్షమ, నిస్పృహ, దయ, సత్యము, దానము, శీలము, తపము, అధ్యయనము ఈ ఎనిమిది మహాంగాలనూ కలిగియుండే వ్యక్తులు శ్రేష్ఠులైన (పాత్రత గల) పాత్రులవుతారు. అంటే వీరికి ఎంతైనా ఇవ్వాలి. ఏమైనా ఇవ్వాలి. సూర్యుని పట్ల భక్తి, ఇతరుల పట్ల క్షమ, సత్యం, పది ఇంద్రియాల వినిగ్రహం, అన్ని ప్రాణుల పట్ల మైత్రీభావం కలిగియుండుటయే సౌరధర్మము.

            భవిష్యపురాణమును వ్రాయించినవారు వందకోటియుగాలపాటు సూర్యలోకంలో ప్రతిష్ఠులై వుంటారు.”