భవిష్య పురాణము

93 - సూర్యదేవుని పూజలో వివిధ ఉపచారాలు, నివేదనలు - ఫలాలు

దిండికి బ్రహ్మోపదేశమింకను కొనసాగుతునే వున్నది. ‘సూర్యనారాయణుని నిమిత్తమే అన్ని ధర్మకార్యాలూ చేసేవారి కుటుంబంలో రోగిగాని దరిద్రులుగాని జన్మించరు. సూర్యదేవుని మందిరాన్ని భక్తిగా పేడతో అలికినవానికి ఆ క్షణంలోనే అన్ని పాపాలూ నశిస్తాయి. తెల్లని, ఎర్రని లేదా పచ్చని మట్టితో మందిరాన్ని లేపనము చేయువారికి అన్ని మనోవాంఛితఫలాలూ నెరవేరతాయి. ఉపవాసముండి రకరకాల సువాసనలు గల పూలతో సూర్యపూజ చేయువారికీ అంతే. నెయ్యి, నువ్వులనూనెలతో సూర్యలోకనివాసము, అదే స్వామి ప్రీత్యర్థం కూడళ్ళలో తీర్థాలలో, దేవమందిరాలలో వెలిగించేవారికి ఓజస్విరూపమూ ప్రాప్తిస్తాయి. చందన, అగురు, కర్పూర, కుంకుమ, కస్తూరిలను కలిపి ముద్ద చేసి దానితో స్వామి శరీరానికి అభ్యంగనము చేసిన వారికి కోటి సంవత్సరాల పాటు స్వర్గవిహార ప్రాప్తి, ఆపై విఖ్యాత చక్రవర్తి జన్మము, చిరకాల కీర్తి కలుగుతాయి. చందనంతో జలంతో పుష్పాలతో స్వామికి అర్ఘ్యమిచ్చిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. వారితో బాటు, పత్నీ సమేతంగా స్వర్లోకప్రాప్తి కూడా కలుగుతుంది. స్వర్ణయుక్త జలాలతోగాని, ఎర్రనీటితోగాని సూర్యునికి అర్ఘ్యమిస్తే కోట్ల సంవత్సరాల పాటు స్వర్గంలో పూజలందే భాగ్యం కలుగుతుంది. ధూపము సూర్యదేవునికి, గుగ్గుల, ఘృతమిశ్రితమైన దానిని, ఇవ్వగానే అన్ని పాపాలనుండి విముక్తి కలుగుతుంది.

పూర్వాహ్నిలో (జీవిత పర్యంతం) శ్రద్ధగా సూర్యదేవపూజనను చేసిన వారికి కోటి కపిల గోవులను దానమిచ్చిన పుణ్యం వస్తుంది. జితేంద్రియులై మధ్యాహ్నకాల పూజ చేసిన వారికి సూర్యకరుణవలన భూమినీ ఆవులను వందనీ దానం చేసిన పుణ్యం వస్తుంది. సాయం సంధ్యలో, పవిత్రుడై శ్వేతవస్త్రాలనూ పాగానూ ధరించి భాస్కర భగవానుల పూజనొనరించిన వారికి సహస్రగోదానఫలము ప్రాప్తిస్తుంది. అర్ధరాత్రి పూజకు జాతి స్మరతా, ధార్మిక పురుషసంతానం, ప్రదోషవేళ పూజకు స్వర్గలోకంలో అక్షయకాలం ఆనందప్రాప్తి, ప్రభాతకాలపు పూజకు దేవలోకప్రాప్తి ఫలాలుగా చెప్పబడ్డాయి.

రెండు అయనాల సంక్రాతుల యందు సూర్యపూజ చేసినవాడు బ్రహ్మలోకగతుడై అక్కడ దేవతల చేత పూజింబడతాడు. గ్రహణాలలో గాని రోజూ నిద్రలేచిన వెంటనే గాని సూర్యనమస్కారం చేసిన వారంటే సూర్యునికిష్టం. వారికి ఏకష్టాన్నీ కలుగనివ్వడు. కోరినవన్నీ ఇస్తాడు. పనివత్తిడిలో పడి దేనికీ సమయం కేటాచించలేనివారు ఏదో ఒక రోజే సూర్యపూజనం శ్రద్ధాభక్తులతో చేయగలిగినా మంచి మంచి ఫలాలు చెప్పబడ్డాయి.

ఉదయకాలంలో ఏదో ఒక్కరోజు నేతితో సూర్యనారాయణునికి స్నానం చేయిస్తే ఒక లక్షగోవులను దానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఆవుపాలతో స్నానంచేయిస్తే పుండరీక యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. చెఱకురసంతో స్నానం చేయిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం అబ్బుతుంది.

(సూర్యపూజాఫలాలూ, రథసేవనాఫలాలూ ఇదివఱకు శతానీకుడు వినియున్నాడు. అదనంగా వున్నవే ఇక్కడ చెప్పబడుతున్నాయి)

రథయాత్రలోగాని మామూలు దానాల్లోగాని సూర్యమందిరానికెదురుగా స్వామిలీలలను రూపకంగా చేసి చూపిన వానికి సర్వాభీష్టవరదాయని రాజసూయయజ్ఞం చేసిన ఫలం దక్కుతుంది. గణనాయకా! సూర్యదేవుని పూజించి ఆయన మందిరోప యోగానికి మహాభారతమును దానమిచ్చిన వానికి అన్ని పాపాలూ నశించి విష్ణులోకంలో నివసించి పూజలందుకొనే భాగ్యమబ్బుతుంది. అదే రామాయణమైతే వాజపేయ - యజ్ఞఫలం, సూర్యలోకప్రాప్తి; భవిష్యపురాణాన్నయితే, ఇంకా ఎక్కువగా, రాజసూయ అశ్వమేధాల ఫలం, సూర్యలోకనివాసం, ఆపై శతకల్పాంతమూ బ్రహ్మలోకప్రాప్తి. మరల భూమిపై పుట్టినపుడు మహారాజజన్మ ప్రాప్తిస్తాయి. సూర్యమందిరంలో భక్తులకు చలికాలంలో వెచ్చగా వుండడానికి కంబళ్ళు మొదలగువాటిని దానం చేసినవానికి అశ్వమేధయజ్ఞఫలం దక్కుతుంది. సూర్య మందిరంలో నిత్యమూ పవిత్రగ్రంథాలు, పురాణేతిహాసాలూ, ఇత్యాదులను ప్రవచించే వానికి వేలకొలదీ అశ్వమేధయజ్ఞాలు చేసిన దాని కంటెనెక్కువ ఫలం దక్కుతుంది. సూర్యదేవునికి ఆఖ్యానాలపై మక్కువ.