భవిష్య పురాణము

112 - త్రిప్రాప్తి సప్తమీ వ్రతం

హే గరుడధ్వజా! భక్తి పూర్వకశుద్ధ హృదయంతో జలార్పణ ద్వారా శ్రీ సూర్య నారాయణుని పూజించినా దుర్లభఫలాలు లభించగలవు. రాగ ద్వేషరహితమైన హృదయం, అసత్యాదులచేత దూషితంకాని వాణి, హింసావర్జితమైన కర్మ - ఇవి భాస్కరభగవానుల ఆరాధనకు మూడు ముఖ్యమైన ప్రక్రియలు, ప్రకారాలు. రాగద్వేషాది దోషాలతో చీకటై పోయిన హృదయంలోకి సూర్యరశ్మి ఎలా ప్రవేశిస్తుంది? అటువంటివారు ఎంత పూజ చేసినా సూర్యుడే వారిని సంసారమగ్నులను చేసి వుంచుతాడు.

గాఢమైన అంధకారాన్ని చంద్రకళ సంపూర్ణంగా నశింపచేయలేదు కదా! అలాగే హింసాదులచే దూషితములైన కర్మల ద్వారా సూర్యపూజ చేసినా వచ్చే ఫలం ఆ చంద్రకళ యంతటిదే. కాబట్టి సాధకుని సత్త్వస్వభావము, సత్యవాక్కు అహింసలే సూర్యభగవాను నెక్కువగా ప్రసన్నుని చేయగలవు.’

‘బ్రహ్మదేవా! మంచివారికి శ్రేష్ఠ వర్ణంలో జన్మ, ఆరోగ్య, ధనముల అభివృద్ధి కలిగించే వ్రతమేదైనా వుందా?’

‘ఉంది వాసుదేవా! అదే త్రిప్రాప్తి సప్తమీ వ్రతం. మాఘకృష్ణ సప్తమినాడే హస్త నక్షత్రం కూడా యోగించిన రోజు ఏ వర్ణం వాడయినా జగత్‌స్రష్టయైన సూర్యభగవానునికి సుగంధ, ధూప, నైవేద్య, ఉపహారాది పూజా సామగ్రితో పూజచేయాలి. గృహస్థు పుష్పాల ద్వారా దానాదుల ద్వారా ఏడాదిపాటు ఈ పూజను ఈ విధంగా సంపన్నం చేయాలి. సజ్జలు, నువ్వులు, వరిధాన్యము, యవలు, బంగారము, అన్నము, జలము, పటిక బెల్లపు పానకము, పాదరక్షలు, గొడుగు, బెల్లపు పిండివంటలు క్రమముగా ప్రతి మాసంలోనూ మునులకు, బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ వ్రతంలో ఆత్మశుద్ధికోసం సూర్యనారాయణ పూజానంతరం ప్రతిమాసం క్రమంగా కూరముక్క, గోమూత్రము, నీరు, నెయ్యి, దర్భ, పెరుగు, ధాన్యము, నువ్వులు, యవలు, సూర్యకిరణాలతో వెచ్చనైన నీరు, కమలతొన, పాలు నోట్లో వేసుకోవాలి. ఈ విధులతో ఈ సప్తమి వ్రతాన్ని సంపన్నం చేసినవానికి ధనధాన్యాలు, దుఃఖరాహిత్యము శ్రేష్ఠవర్ణజన్మము, జితేంద్రియత్వము, ఆరోగ్యము, బుద్ధి కుశలత, సుఖ జీవనము ప్రాప్తిస్తాయి.