173 -174 - సౌర ధర్మ మహిమ - బ్రహ్మ కృత సూర్యస్తుతి

            “మహాత్మా! సౌరధర్మాన్ని గురించి మరింత విస్తారంగా వినాలనిపిస్తోంది” అన్నాడు శతానీకుడు. వినిపించసాగాడు సుమంతుడు.

            “మహారాజా! నీవు ధన్యుడవు. సౌరధర్మంపై అందరికంటే ఎక్కువ అవగాహన ఇకపై నీకే వుంటుంది. ఈ విషయమై అరుణ, గరుడుల సంవాదమొకటి జరిగింది, విను.

            అరుణుడు గరుత్మంతుని కొకప్పుడీవిధంగా బోధించాడు. “ఓ ఖగశ్రేష్ఠా! ఈ సౌరధర్మం అజ్ఞానసాగరంలో మునిగి, ఇక తేలలేకున్న అన్ని ప్రాణులనూ ఉద్ధరించి జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికే ఏర్పడింది. భక్తిభావం పెల్లుబకగా సూర్యభగవానుని స్మరణ, కీర్తన, భజనలను చేయువారు పరమపదమును పొందుతారు. పక్షిరాజా! ఈ లోకంలో జన్మించి కూడా దేవేశుడైన సూర్యభగవానుని ఏదోవిధంగా ఉపాసించనివాడు సాంసారిక క్లేశాల్లో (సాంసారిక క్లేశాలనగా సంసారంలో దుఃఖాలు కావు. ప్రపంచంలోని బాధలు) మునిగి, మునిగే వుంటాడు. మరి తేలడు. మానవజన్మము కడు దుర్లభమే, కాని మానవజీవనము దుష్కరము. సూర్య పూజనము చేసిన మానవుని జన్మమే సఫలం, జీవనం సుఖతరం.

            మహాభోగాలనూ సుఖాలనూ కోరుకొనేవారు, రాజాసనాన్ని వాంఛించువారు, స్వర్గసౌభాగ్యాలన్నీ కావాలనుకొనేవారు, అతులకాంతి, త్యాగం, యశస్సు, శ్రీ, సౌందర్యం అభిలషించేవారు సూర్యోపాసన చేస్తే కృతార్థులౌతారు.

            పరమ శ్రద్ధాభావంతో సూర్యారాధన చేయువాడు ముందుగా సకల పాపముక్తుడౌతాడు. వివిధాకారాలలో కనిపించి పీడించే డాకినీ, పిశాచ, రాక్షసగణాలు గాని ఇతర పీడా కారకాలు గాని వాని దరికి చేరలేవు. మామూలు ప్రభావాత్మక జీవాలు కూడా వానికి కీడు చేయలేవు. సూర్యోపాసన చేసేవానికి శత్రుగణాలు మిగలవు. వానికి సంగ్రామ రంగంలో దిగ్విజయం ప్రాప్తిస్తుంది. మహావీరా! అతన్ని ఏ రోగాలూ అంటవు. ఆపదలూ స్పృశించవు. అన్ని మనోరథాలూ సిద్ధిస్తాయి. సూర్యోపాసకుని ధనం, ఆయువు, యశం, విద్యా, సకల కళ్యాణ, మంగళప్రదాలైన వస్తువులూ నిరంతరం వృద్ధిచెందుతునే వుంటాయి.

            బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా సూర్యారాధనను సవినయంగా, దిగ్విజయంగా, సంపూర్ణంగా చేయడం ద్వారానే ఆ స్థాయిని చేరుకోగలిగారు. ఈరోజు వారిని జగన్నాథులుగా గుర్తించి పూజిస్తున్నాము. ఇంద్రుని ఇంద్రత్వము సూర్య పూజాఫలమే. దేవగణాలన్నీ ఆయన ఆరాధన ద్వారానే దేవగణాలయినాయి. ఈ సమస్త విశ్వమూ సూర్యదేవునిలోనే నిత్యప్రతిష్ఠితమై వుంది. అంధకారనాశకుడైన సూర్యుని పూజించని మనుష్యుడు ధర్మార్థ కామ మోక్షాలకు అధికారి కాలేడు. ఓ పక్షీంద్రా! ఆపదగ్రస్తుడైన వానికి ఆధారము సూర్యారాధన. ఆ ఆధారం సాయంతో అతడు ఆపదనుండి విముక్తుడు కాగలడు. సూర్యోపాసకులే ఈ విశ్వాన్ని కాపాడగలరు. వారు అన్ని ద్వంద్వాలనూ సహించగలరు. వీరులు, నీతి - విధి - యుక్త చిత్తులు, పరోపకార పరాయణులు మరియు గురు సేవానురక్తులై వుంటారు. వారు అతిశయరహితులు, బుద్ధిమంతులు, అస్పర్థులు, నిస్పృహులు, శాంతులు, స్వాత్మానందులు, భక్తులు, నిత్యస్వాగతవాదులునై వుంటారు. సూర్యభక్త్యభిలాషులు శూరులు, అల్పభాషీయులు, శాస్త్ర మర్మజ్ఞులు, ప్రసన్న మనస్కులు, శౌచాచార సంపన్నులు, దాక్షిణ్యయుక్తులునై వుంటారు.

            సూర్యభక్తులు దంభ, మాత్సర్య, తృష్ణ, లోభాలను పరిత్యజిస్తారు. శరులు, కుత్సితులు కారు. నీటి బొట్లు తామరాకుని తడి చేయలేనట్లు విషయవాంఛలు సూర్యభక్తుని వశ పఱచుకోలేవు. ఇంద్రియాలు, అవయవాలూ పనిచేస్తున్నంత కాలం వారు సూర్యారాధన, పూజ చేస్తూనే వుంటారు. సూర్యపూజతో సమానమైన ధర్మకార్యం ఈ విశ్వంలో లేనేలేదు. ఏ మానవుడు భక్తిపూర్వకంగా శాంతుడును, అజుడును, ప్రభువును, దేవదేవేశుడునైన సూర్యభగవానుని పూజిస్తాడో, అతడు ఇహలోకంలో సర్వసుఖాలనూ పరలోకంలో పరమపదాన్నీ పొందుతాడు. మొట్టమొదట బ్రహ్మదేవుడు సూర్యభగవానుని పూజించి అంజలించి ఇలా స్తుతించాడు:

భగవంతం భగకరం శాంతచిత్తమనుత్తమం

*(అనుత్తమం అంటే తనకన్నా ఉత్తమమైనది ఇకలేనిదని అర్థం.

            ‘ప్రణతోఽస్మి’లోని ఈ ‘ఽ’ అనే గుర్తుని అవగ్రాహమంటారు. దీని అర్థం ‘అ’. ప్రణతః+అస్మి=‘ప్రణతోఽస్మి’ )

దేవమార్గప్రణేతారం ప్రణతోఽస్మి దివాకరం

శాశ్వతం శోభనం శుద్ధం చిత్రభానుం దివస్పతిం

దేవదేవేశ మీశేశం ప్రణతోస్మి రవిం సదా

         సర్వదుఃఖహరం దేవం సర్వదుఃఖహరం రవిం

వరాననం వరాంగంచ వరస్థానం వరప్రదం

వరేణ్యం వరదం నిత్యం ప్రణతోస్మి విభావసుం

అర్కమర్యమణం చేంద్రం విష్ణుమీశం దివాకరం

దేవేశ్వరం దేవరతం ప్రణతోస్మి విభావసుం (బ్రాహ్మ174/36-40)

అంటూ స్తుతించిన బ్రహ్మ ‘య ఇదం శ్రుణాయాన్నిత్యం’, అని కూడా చెబుతూ దాని ఫలాన్ని కూడా ‘సూర్యపురం వ్రజేత్’ అనిచెప్పి ముగించాడు. అనగా ఈ స్తోత్రాన్ని చదివినావారు విన్నవారు, అదీ ప్రతిరోజు చేస్తే, పరమ కీర్తినీ సూర్యలోకప్రాప్తినీ పొందగలరు.