భవిష్య పురాణము

169 -170 - సూర్యగృహ రథ దాన మాహాత్మ్యం

            మహారాజా! ఎవరైనా సరే తన శక్తి కొలదీ మట్టి, కర్ర, రాయి, కాల్చిన ఇటుక దేనితోనైనా సరే మఠాన్ని గాని ఇంటిని గాని కట్టి పూజలకూ వ్రతాలకూ కావలసిన ఉప కరణాలనేర్పాటుచేసి సూర్యభగవానులకు సమర్పిస్తే ఆయన వారి సర్వకామనలనూ ప్రాప్తింజేస్తాడు, నెరవేరుస్తాడు. మాఘమాసంలో అప్రమత్తులై ఏకభుక్తంతో జీవిస్తూ, నెల తిరిగేసరికి ఒక రథాన్ని నిర్మించే వ్రతాన్ని చేపట్టిన వారు ఈ విధంగా దాన్ని కొనసాగించాలి. ఆ రథం విచిత్ర వస్త్రాలతో, నాలుగు తెల్ల గుర్రాలతో, తెల్ల ధ్వజంతో, పతాక, గొడుగు, చామర, దర్పణాలతో శోభించేలా అలంకరింపబడాలి. దానిపై రెండున్నర శేర్ల బియ్యపుపొడితో సూర్యప్రతిమను నిర్మించి దాని ప్రక్కనే సంజ్ఞాదేవి ప్రతిమను జోడించి రథి కూర్చునేచోట ప్రతిష్ఠించాలి. శంఖ, భేరీ నాదాలతో రాత్రి బయలుదేరి రాజమార్గంలో రథాన్ని త్రిప్పి మెల్లగా సూర్యమందిరానికి తీసుకొనిరావాలి. అక్కడ జాగరణ వుండి పూజలుచేస్తూ రాత్రి మందిరాన్ని దీపాలతో, అద్దాలతో అలంకరిస్తూ గడపాలి. తెల్లారగానే తేనె, పాలు, నెయ్యిలతో ప్రతిమకు స్నానం చేయించాలి. దీనులకు, అంధులకు, అనాథలకు యథాశక్తి దక్షిణలిచ్చి, భోజనాలు పెట్టాలి. రథాన్ని సంవాహనయుక్తంగా సూర్యదేవుని మందిరంలో ఆయనకే సమర్పించి తన బంధువులతో కలిసి భోజనం చేయాలి.

            సూర్యవ్రతాల్లో ఈ రథవ్రత, రథయాత్రలు ప్రశస్తమైనవి. వీటివల్ల అన్ని కోరికలూ తీరగా ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. అంతేకాక అన్ని వ్రతాల పుణ్యమూ, అన్ని యజ్ఞాల సిద్ధీ ఈ రథవ్రతం చేసిన వానికి లభిస్తాయి. ఈ సందర్భంలో సూర్యభగవానుని కోసం దూడగల ఒక ఆవుని దానం చేసిన వానికి సప్తద్వీప సహితంగా భూమిని దానం చేస్తే వచ్చేఫలం అబ్బుతుంది.