భవిష్య పురాణము

10-11 - ప్రాసాద ఉద్యానాదుల నిర్మాణంలో భూపరీక్షణ

            మునీశ్వరులారా! దేవమందిర, తటాకాదులను నిర్మింపబోయేవారు ముందుగా శాస్త్రప్రమాణాలకు సర్వవిధాలా సరిపోయే భూమిని సంపాదించాలి. సంపాదించిన భూమిని కూలంకషంగా సంశోధించి పది లేదా అయిదు జానల ప్రమాణంలో ప్రతిచోట ఎద్దుల చేత దున్నించాలి. దేవుని పెట్టేచోట తెల్లయెద్దుల చేతనూ, వాపీకూప తటాకాలకై నిర్ణయింపబడిన చోట నల్లటెద్దుల చేతనూ దున్నించాలి. గ్రహయాగాలకోసం వుంచే భూమిని దున్నించనక్కరలేదు. స్వచ్ఛంగా చేస్తే చాలు. దున్నించే కార్యక్రమాన్ని మూడు దినాలపాటు చేయించాలి. దానిలో అయిదు రకాల ధాన్యాలను నాటాలి. దేవ ఉద్యాన పక్షంలో ఏడురకాల ధాన్యాలను నాటాలి. మూడురాత్రులు దాటగానే మొలకలెత్తే భూమి ఉత్తమమైనదనీ, అయిదైతే మధ్యమమనీ, ఏడైతే కనిష్ఠమనీ గ్రహించి కనిష్ఠభూమిని పరిత్యజించాలి. భూమికి కూడా రంగులుంటాయి. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు రంగులు అదేక్రమంలో బ్రాహ్మణాది వర్ణాలకు వాడాలి. ప్రాసాదాది నిర్మాణాలకు ముందు తప్పనిసరిగా భూమిని పరీక్షించాలి. దీని పద్ధతులలో నొకటి కాష్ఠగత పరీక్ష. ఒక జానెడు పొడవున్న బిల్వకాష్ఠమును పన్నెండంగుళాల గోతిలో పాతి, దానిపై నున్న భూమి ఉపరితలానికి నాలుగు దిక్కులలో నాలుగు కర్రలను పాతాలి. వాటికి నూనెలో బాగా ముంచిన ఉన్నిగుడ్డలను చుట్టి దీపాలను వలె అగ్నిచే ప్రజ్వలింపజేయాలి. తూర్పు, పడమరలవైపు కర్రలు ఎక్కువ సేపు వెలిగితే అది శుభంకరమైన భూమిగా స్థాపించుకోవచ్చు. దక్షిణోత్తరములవైపు ఎక్కువగా వెలిగితే అశుభకరమైన భూమి అనుకోవాలి. ఏ దిక్కులోని కర్రా వెలగకగాని, వెలిగిన మరుక్షణంలోగాని ఆరిపోతుంటేగాని - ఆ జాగా విపత్కరమని ఆపదలను తెస్తుందని పెద్దలు చెప్పారు. అపుడు వాస్తుపూజనూ, నేలను త్రవ్వే పరికర పూజ (ఖనిత్రపూజ)నూ కూడా చేయాలి. భూమిపై నేయి, తేనె, స్వర్ణమిశ్రితమైన జలాన్ని పూయాలి. ఈశాన్యం వైపు నిలబడి మరల భూమిని తవ్వుతూ:

ఆబ్రహ్మన్ బ్రహ్మణో బ్రహ్మవర్చసీ

జాయతామా రాష్ట్రేరాజన్‌యః శూర

ఇషవ్యోఽతివ్యాధీ మహారథో జాయతాం

దోగ్‌ధ్రీ ధేనుర్వోఢానం వానశుః సప్తి

పురంథిర్యోషా జిష్ణూరథేష్ఠాః సభేయో

యువాస్య యజమానస్య వీరోజాయతాం

నికామేఽనికామేనః పర్జన్యో వర్షతు

ఫలవత్యో న ఓషధయః పచ్యంతాం

యోగక్షేమోనః కల్పతాం (యజుం 22/22)

మంత్రానుచ్చరించాలి. వాస్తు పూజను చేయకుండానే ప్రాసాద, తటాకాది నిర్మాణాలను గావిస్తే యమధర్మరాజు ఈ కార్యం ద్వారా వచ్చే పుణ్యంలో ఒక సగాన్ని తగ్గించేస్తాడు. కాబట్టి వాస్తుదేవతను పూజించాలి. వాస్తువిద్యయొక్క ముఖ్యప్రవర్తకులు, జ్ఞానులు విశ్వకర్మ,

మయుడు.

            నదీతీరాన, శ్మశానంలోనూ, ఇంటికి దక్షిణంవైపూ తులసిమొక్కని పెంచకూడదు. (మిగతా విశేషాలను ‘వృక్షోరక్షతి రక్షితః’ అనే అధ్యాయములో చూడవచ్చు)

            విప్రశ్రేష్ఠులారా! తాంత్రిక పద్ధతి అనుసారము అన్ని ప్రతిష్ఠాకార్యాలనూ శుద్ధదినాల్లోనే చేయాలి. వృక్షాలుండే ఉద్యానవనంలో తప్పనిసరిగా నూతిని నిర్మించాలి. తులసీవనంలో ఏ యాగమూ చేయరాదు. తటాకాల్లో, పెద్దతోటల్లో, దేవస్థానాల్లో సేతువును నిర్మించరాదు. దేవస్థానంలో తటాక నిర్మాణం తప్పనిసరి. శివలింగ ప్రతిష్ఠతో అన్యదేవతా ప్రతిష్ఠలను కలిపి చేయరాదు. శివలింగాన్ని శైవాగమ ప్రకారమే పెట్టుకోవాలి. దానికి వ్యతిరేకంగా చేయడం ఆయుక్షీణం.