భవిష్య పురాణము

187 - శ్రద్ధా, ఖఖోల్కమంత్ర గోమహిమలు

            ‘భగవన్! ఆదిత్యదేవా! మనిషి ఎట్టి పుణ్య సంపాదన ద్వారా స్వర్గానికి వెళ్ళవచ్చును? కర్మ, తపో, స్వాధ్యాయ, ధ్యాన, జ్ఞాన నామక పంచయజ్ఞాలలో సర్వోత్తమమైనదేది? ధర్మ, అధర్మ ప్రకారములెన్ని? నరకం నుండి తిరిగి భువికి వచ్చువారికెటువంటి లక్షణాలు, ప్రాప్తాలు వుంటాయి? ధర్మాధర్మాలతో, గర్భాగమనరూప సుఖ దుఃఖాలతో నిండిన భవసాగరం నుండి ముక్తి ఎట్లు లభిస్తుంది? తమ కంటె సర్వజ్ఞులు లేరు కావున కృపతో నన్ను అజ్ఞాన విముక్తుణ్ణి చేయండి’ అని ప్రార్ధించిన అరుణునికి సూర్యుడిలా చెప్పసాగాడు.

            ‘అరుణా! స్వర్గ, అపవర్గ (మోక్ష)ములను ప్రాప్తింపజేసేదీ, నరకరూప సముద్రాన్ని దాటించేదీ, పాపహారీ, పుణ్యప్రదమూ ధర్మమే! ఈ ధర్మానికి ఆది, మధ్య, అంతాలలోనూ మిక్కిలి ఆవశ్యకమైనది శ్రద్ధ. శ్రద్ధనిష్ఠుడే ధర్మ ప్రతిష్ఠితుడౌతాడు. కాబట్టి ధర్మము శ్రద్ధా మూలకము. వేదమంత్రాలకి అర్థాలు మిక్కిలి గూఢతమాలు. వాటిలో ప్రధాన పురుషుడు పరబ్రహ్మ. పరమేశ్వరుడు - ఆయనే అధిష్ఠితుడు. శ్రద్ధ ద్వారానే వేదపురుషుని ఆశ్రయించగలరు సాధకులు. ఈ బాహ్యచక్షువుల కాయన దర్శనం కాదు. శ్రద్ధారహితులైన దేవతలు కూడా విపరీతంగా కష్టాలు పడిపోయి ఇతోధికంగా ద్రవ్యాలను తగలబెట్టినా కూడా ఈ ధర్మము యొక్క సూక్ష్మరూపుడైన పరమాత్మను దర్శించలేకపోయారు. వేదమయుడైన పరమాత్మకు కావలసినది శ్రద్ధ. అదే పరమ సూక్ష్మ ధర్మం. అదే యజ్ఞం, అదే తపస్సు, అదే హవనం, అదే స్వర్గం, ఆ శ్రద్ధయే మోక్షం. ఈ సంపూర్ణ జగమే శ్రద్ధామయము.

శ్రద్ధాపూర్వః సదాధర్మః శ్రద్ధామధ్యాంత సంస్థితః

శ్రద్ధా నిష్ఠ ప్రతిష్ఠశ్చ ధర్మః శ్రద్ధా ప్రకీర్తితా

శ్రుతి మంత్రరసాః సూక్ష్మాః ప్రధాన పురుషేశ్వరః

శ్రద్ధామాత్రేణ గృహ్యంతే నపరేణచ చక్షుషా

సర్వస్వ జీవితం వాపి దద్యాద శ్రద్ధయాచయః

నప్నుయాత్ సఫలం కించిత్ తస్మాచ్ఛ్రద్ధా పరోభవేత్ (బ్రాహ్మ 187/1,2,13)

            హే ఖగశ్రేష్ఠా! ఇపుడు నా మండల విషయం విను. నా కల్యాణమయమైన మండలం ఖఖోల్కనామంతో ప్రసిద్ధి చెందింది. ఇది ముగ్గురు మహాదేవుల మూడు మహద్గుణాలకూ అతీతము - సర్వజ్ఞము. ఇది సర్వశక్తిమంతము. ‘ఓం’ అనే ఏకాక్షరంలో ఈ మండలం అవస్థితమై వుంది. సంసారసాగరంలాగే ఇదీ అనాది. ఆ సాగరాన్ని దాటుకుంటూపోయే శక్తి దీనికుంది. సర్వ సంసార జనిత దుఃఖాలకూ దుఃఖరోగాలకూ దివ్యమైన విరుగుడు, ఔషధము ఈ మంత్రము. అర్ధం కోరుకొనే వానికి అర్థాన్నీ, మోక్షం కావలసినవాడికి మోక్షాన్నీ ఇచ్చే మంత్రం ఇది. ఖఖోల్కనామకమైన ఈ మంత్రం నిత్యం మనన చేసుకోవడానికీ యోగ్యమై వున్నది. ఓం నమః ఖఖోల్కాయ అనే ఈ మంత్రం హృదయంలో గలవాడే అన్నీ చదివినవాడు. అన్నీ విన్నవాడు, అన్నీ అనుష్ఠించినవాడు అనుకోవాలి.

            మనీషులు ఈ ఖఖోల్కాన్నే మార్తండ నామమన్నారు. మార్తండుని శ్రద్ధతో ఆరాధిస్తే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏ శ్రద్ధా లేనివారు అధోగతి పాలవుతారు. సూర్య సంబంధమైన వచనాలను బోధించి, సాధింపజేసే గురువును కూడా సూర్యుని పూజించినట్లే పూజించాలి. ఆ గురువే భవసాగరంలో మునిగిపోతున్న మనిషిని ఉద్ధరించ గలుగుతున్నాడు. అజ్ఞాన రూపమగు అగ్నిలో మనసూ, బతుకూ మండిపోతున్న మనిషికి సౌరధర్మ రూపమగు శీతల జలాన్ని కురిపించి శాంతిని ప్రసాదించే గురువుతో సమానుడెవరు? జ్ఞానామృతంతో శిష్యులను ఆప్లావితం (తడుపుట) చేసే గురువు నిస్సందేహంగా నిఖిల పూజార్హుడు. ఈ విషయాలు సకల కల్యాణ కారకాలు, ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకులు ఎక్కువగా రాగ, ద్వేష, అక్షమ, క్రోధ, కామ, తృష్ణాదులను గుండెలనిండా నింపుకొని వాటిని అనుసరించిపోతూ బతికే మనుష్యులు గుసగుసలుగా చెప్పే విషయాలను వినడం వైపు మాత్రమే చెవి యొగ్గుతుంటారు. అటే మొగ్గు చూపిస్తుంటారు. అవి ప్రమాద కారకాలు. మనసును పాడుచేసి నరకంవైపు దారి చూపిస్తాయి. అరుణా! నేను చెప్పునవెంత సుభాషితాలలో ఆ వ్యక్తుల వాక్కులు అంతకు కొన్ని రెట్లు దుర్భాషితాలు. కాబట్టి మనం ఎవరిని వినాలో, ఏది వినాలో బాగా ఆలోచించుకోవాలి. అసలే ఈ ప్రపంచం అవిద్యాత్మకం. అందులోని క్లేశాన్ని మరింతగా పెంచే ఈ అందమైన, సుసంస్కృతమైన, మృదువైన గుసగుసలు (వీటినే ఈ రోజు ‘గాసిప్’ అంటున్నాం) విని మాత్రమేమి లాభము, అతి ఘోరనష్టము తప్ప? ఏ వాక్యాలను వింటే రాగద్వేషాలు నశించి, పుణ్యం ప్రాప్తిస్తుంది అని వేదవాఙ్మయం వచిస్తోందో ఆ వాక్యాలు కటువుగా వున్నా ఉత్సుకతను రగిలించేవి కాకున్నా, అవే సర్వశుభదాయకాలు, సర్వశోభాజనకాలు. స్మృతులు, మహాభారతం, వేదం, మహాశాస్త్రాలు, ధర్మసాధకాలు, ధర్మబోధకాలు. మన మహాశాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేయాలంటే వెయ్యి సంవత్సరాలు చాలవు. కాబట్టి సామాన్య మానవులు అక్షరతన్మాత్రయను పేరిట పరమాత్మ జ్ఞానాన్ని పొంది పరలోక గమనాసక్తితో ముక్తిమార్గాన్ని తెలుసుకొని ఆ దారివెంట వెళ్ళాలి. పారలౌకిక పుణ్యభారాన్ని వహించని శరీరం ఎందుకు? సౌరజ్ఞాన మాహాత్మ్యాన్ని అధ్యయనం చేసి తరించనివాడు శక్తి సంపన్నుడు, సమర్థుడు, పండితుడు అయినా కూడా మూర్ఖుడే. కాబట్టి ఎవడైతే సౌరజ్ఞాన సద్భావ మహిమలో తత్పరుడై వుంటాడో వాడే సమర్థుడు, పండితుడు, తపస్వి, (ఇంద్రుని కూడా జయించినవాడు) జితేంద్రుడు. ఒక గురువున్నాడనుకో. ఆయన శిష్యుడొక రాజనుకో. ఆ రాజు అన్యాయపూర్వక మనస్కుడై ఏదో పెద్ద అన్యాయా చరణనే ఉద్దేశించి, సౌరజ్ఞానమును దానికి సాధనంగా పొందాలనుకొని, ఈ గురువుకే సమస్త భూమండలాన్ని ధన, కనక, వస్తు, వాహనాలనీ ఇస్తానని ఆశపెట్టినా గురువు వానికి చెప్పరాదు. ఎట్టి పరిస్థితిలోనూ దుష్టునికి షడక్షర మంత్రోపదేశమును ఈయరాదు, చేయరాదు. సూర్యధర్మాన్ని న్యాయప్రవర్తనుడై వినమ్రభావంతో వినేవాడు, చెప్పేవాడు ఉత్తమగతులను పొందుతారు. అన్యాయం చేసేవాడు మాత్రం ఏంచేసినా నరకానికే పోతాడు.

            అరుణా! నా షడక్షర మంత్రాన్ని జపిస్తూ విధాన పురస్సరంగా ఆవుపాల ద్వారా నన్ను పూజించేవాడు మనుష్యులలో సర్వశ్రేష్ఠుడు. దేవాసురులు క్షీరసాగర మథనం చేసినపుడు అన్ని లోకాలకీ మాతృ స్వరూపాలనదగిన అయిదు గోవులుద్భవించాయి. అవి నంద, సుభద్ర, సురభి, సుమన, శోభనావతి. ఇవి తేజంలో సూర్యసమానులు. ఇవి సంపూర్ణ ప్రపంచానికి ఉపకారం చేయడానికీ, దేవతలకు తృప్తిని కలిగించడానికీ, నాకు స్నానం చేయించడానికీ జన్మించాయి. ఇవి నన్నే ఆధారంగా తీసుకొని నిలచివున్నాయి. వాటి అంగాలన్నీ పవిత్రాలే. అవి అనే కాదు వాటి నుండే వచ్చిన మొత్తం గోజాతి అంతా ఆరు రసాలను కలిగి వుంటుంది. ఆవుపేడ, మూత్రము, గోరోచనం, పాలు, పెరుగు, నెయ్యి - ఈ ఆరూ పవిత్రాలే, సర్వసిద్ధిదాయకాలే. నాకు పరమ ప్రియమైన బిల్వవృక్షం ఆవుపేడ నుండే పుట్టింది. కమలహస్తయైన లక్ష్మీదేవి ఆ వృక్షంపై విరాజిల్లుతున్నది. అందుకే దానిని శ్రీవృక్షమంటారు. గోమయం నుండే పంకం, దాని నుండే పద్మం జనిస్తున్నాయి. గోరోచనం పరమ మంగళమయం, పవిత్రం, అన్ని కోరికలను తీర్చేదిగా పేరు గాంచింది. అందరు దేవతలకూ ఆహార స్వరూపమూ, భాస్కరునకు పరమ ప్రీతిపాత్రమునైన గుగ్గిలం గోమూత్రం నుండి ఉత్పన్నమైంది. జగత్తులోని అన్ని బీజాలూ పాలనుండి పుట్టినవే. మంగళమును కలిగించేవెన్నో పెరుగునుండి వచ్చాయి. ఇక నేతి నుండి దేవతలకు ప్రియమైన అమృతముత్పన్నమైనది. కాబట్టి నాకు నెయ్యి, పాలు, పెరుగులతో స్నానం చేయించాలి. తరువాత వేడినీరు, కషాయాలతో స్నపనం చేయించాలి. ఆపై శీతలజలంతో స్నానం చేయించి గోరోచనాన్ని పూసి, బిల్వపత్రాలతో, కమలాలతో పూజ చేయాలి. పంచదార కలిపిన గుగ్గిలంతో అర్ఘ్యమివ్వాలి. పాలు, నెయ్యి, జావ, తేనె, పంచదార కలిపిన వివిధ భక్ష్య పదార్థాలను నైవేద్యం పెట్టాలి. చివరగా సూర్యభగవానునికి ప్రదక్షిణ గావించి క్షమా - యాచన చేయాలి.

            ఈ విధంగా నన్ను పూజించువాడు ఈ లోకంలో అన్ని కోరికలూ తీరిపోగా, తనతోపాటు తన కుటుంబంలోని ఇరువది యొక్క తరాలవారికి స్వర్గప్రాప్తిని కలిగించగలడు. అక్కడ వారిని ప్రతిష్ఠించి తాను స్వయంగా జ్యోతిష్మనామక అత్యుత్తమ లోకాన్ని చేరుకోగలడు. ఏ గోవుల యొక్క ద్రవ్యాలను సూర్యభగవానుని పూజలో అంటే నా పూజలో వాడతారో - ఆ గోవులు కూడా నా లోకాన్నే చేరుకుంటాయి. సుపాత్రునికి - అంటే ఉత్తమార్హత గలిగిన వానికి దేశకాలానుగుణంగా ఇచ్చే చిన్నదానమైనా పెద్ద ఫలితాన్నిస్తుంది. జ్ఞానరూపి జలంలో స్నానంచేసి, శీలరూపి భస్మంతో తమను తాము శుద్ధి చేసుకొనేవారు సుపాత్రులు. జపం, ఇంద్రియనిగ్రహం, సంయమనం మనుష్యుని సంసారసాగరాన్ని దాటించే సాధనాలు.