భవిష్య పురాణము

69 - స్వప్నాలు - ఫలాలు (పరిమితం)

‘యాజ్ఞవల్క్యా! సూర్యపూజనము, ఉపవాసము పూర్తిచేసి సప్తమినాటి రాత్రి సూర్యునే తలచుకుంటూ నిద్రించే వ్యక్తికి (భారతదేశంలోనూ విదేశాల్లోనూ కూడా కలల మీద పెద్ద చర్చే జరిగింది. మేటినీ తదితరులు ‘ఎ డిక్షనరీ ఆఫ్ డ్రీమ్స్’ వంటి ఉద్గ్రంధాలే ప్రకటించారు. మన బృహస్పతి చెప్పిన స్వప్నాధ్యాయ గ్రంథం కడు ప్రసిద్ధం. రామాయణంలో త్రిజటస్వప్నం విశేష ప్రశస్తి గాంచినది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులోని పారా పారాసైకాలజీ శాఖలో దీనిపై పరిశోధనలు జరిగాయి.) కొన్ని కలలు వస్తాయి. వాటి ఫలితాలను వర్ణిస్తాను, విను.

సూర్యోదయము, ఇంద్రధ్వజము, చందమామ కనిపిస్తే మంచివన్నీ వృద్ధి చెందుతాయి. మాల ధరించిన వ్యక్తి, ఆవు లేదా మురళీనాద ధ్వని, తెల్లకమలం, చామరం, దర్పణం, బంగారం, కత్తి, పుత్రప్రాప్తి, రక్తము కలలో కనిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రజాపతి కనిపిస్తే పుత్రపాప్తి కలుగుతుంది. ప్రశస్తమైన వృక్షంపై నెక్కి కూర్చున్నట్టు, ఎద్దు, గోవు లేదా సింహిణి పాలను నోటిలోనికే పిండుతున్నట్లు, కలవస్తే అతిత్వరలో ఐశ్వర్యప్రాప్తి కలదని అర్ధము. బంగారు లేదా వెండి పత్రం పై ఖీర్‌ని పోసుకుని తాగుతున్నట్లు కలవస్తే బలము కలుగుతుంది. కమలపత్రమైనా అంతే. జూదంలోనో, వాదంలోనో యుద్ధంలోనో గెలిచినట్లు కలవస్తే గొప్ప సుఖం కలుగుతుంది. అగ్నిని త్రాగున్నట్టుగా కలవస్తే జఠరాగ్ని పెరిగి ఆరోగ్యం పెరుగుతుంది. తన అంగాలు ప్రజ్వలితాలై కనిపిస్తే తలనొప్పి కూడా వస్తే సంపద దొరుకుతుంది. తెల్లబట్టలు కట్టుకొని, తెల్లపూలమాల వేసుకొని ప్రశస్తమైన పక్షిని దర్శిస్తున్నట్టు కలవస్తే చాలా మంచిది. దేవతలు, బ్రాహ్మణులు, ఆచార్యులు, గురువులు, వృద్ధులు, తపస్వులు కలలో ఏది చెప్తున్నట్టు కనిపిస్తారో అదే జరుగుతుంది. తన శిరస్సు తెగినట్టు, పడినట్టు, పాదాలకు సంకెళ్ళు పడ్డట్టు కలొస్తే రాజ్యప్రాప్తి కలగబోతున్నదని అర్థము. గుర్రం, ఎద్దు, తెల్లకమలం, శ్రేష్ఠమైన ఏనుగు వీటిపై భయపడకుండా ఎక్కి కూర్చునట్లు కలవస్తే మహాగొప్ప ఐశ్వర్యప్రాప్తి కలగబోతున్నదని సూచన. కలలో రోదన ఇలలో హర్షానికి సంకేతం. గ్రహాలనూ, నక్షత్రాలనూ ముద్దచేసి పట్టుకున్నట్టు, భూమిని పట్టి గిరగిరాతిప్పుతున్నట్టు, పర్వతాలను పెకలించి విసిరేస్తున్నట్లు కలవస్తే త్వరలో రాజ్యలాభం కలుగుతుంది. పొట్టలోంచి పేగులుతీసి చెట్టుకి పెట్టి లాగుతున్నట్టు పర్వత, నదీ, సముద్రాలను దాటుతున్నట్టు కలవస్తే అత్యధిక ఐశ్వర్యం పడుతుంది. కలగంటూండగా, కలగంటున్నట్టు తెలియడం, నచ్చిన మాటలు వినబడడం, నచ్చిన వస్తువులు కనబడడం, అందమైన స్త్రీ ఒడిలో కూర్చోని వుండగా ఇతరస్త్రీలు ఆశీర్వదిస్తున్నట్లు కనబడడం, మన శరీరాన్ని కీటకాలు తింటున్నట్లు కనబడడం - ఇవన్నీ రాజ్యలాభం, ఐశ్వర్యప్రాప్తి కలిగించే కలలే. రోగికి వీటిలో ఏ ఒక్కటి కలలో తగిలినా రోగ విముక్తుడవుతాడు. ఈ కలను మరునాడు ప్రొద్దున్న స్నానాదికములు ముగించుకొని రాజునకుగాని బ్రాహ్మణునికిగాని భోజకునికి గాని చెప్పాలి.