భవిష్య పురాణము

64 - సూర్యవ్రతానుష్ఠానం - ఫలసప్తమీవ్రతఫలం

‘బ్రహ్మదేవా ఉపవాస క్రియ, సూర్యారాధన పద్ధతులను నాపై దయ వుంచి వివరించండి’ అని ప్రార్థించాడు దిండి. చెప్పసాగాడు బ్రహ్మ.

‘దిండీ! సూర్యభగవానుడల్పసంతోషి, పుష్పాదులతో పూజించినా ప్రసన్నుడై ఉత్తమ ఫలాలనిస్తాడు. ఇక ఉపవాసమనగా పాపాలు చెయ్యకుండా జీవిస్తూ, సద్గుణాలను అలవరచుకుంటూ పోవడమే. అన్ని భోగాల పరిత్యాగమే ఉపవాస మనబడుతుంది. ఒకరాత్రి, రెండు రాత్రులు లేదా శాశ్వతంగా నక్తవ్రతం చేసేవాడు. అదే ఉపవాసవ్రతం నిష్కాముడై కొనసాగిస్తూ, వచనంతో మనస్సులో కర్మ చేత సూర్యనారాయణారాధనలోనే తత్పరుడై ఉంటే వాడికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఉపవాసముంటే సూర్యలోకప్రాప్తి కలుగుతుంది. ఉపవాసమంటే సూర్యదేవునికి ప్రీతి. పుష్ప, ధూప, దీప, చందన, నైవేద్యాదులతో సహా పూజచేస్తూ ఉపవాసముంటే సూర్యుడు ప్రసన్నుడౌతాడు. పూలు దొరకకపోతే లేతఆకు, దూర్వాంకురం, నీటిచుక్క ఏదైనా సరే భక్తితో ఇస్తే ఆయనను చేరుతుంది. సూర్యనారాయణ మందిరాన్ని నిత్యమూ చీపురుతో శుభ్రం చేసేవాడు తాను ఎన్ని ధూళికణాలను దూరం చేశాడో అన్ని సంవత్సరాలు సూర్యకాంతి సహితుడై స్వర్గంలో వుంటాడు. మందిరంలోని ఏ చిన్న భాగాన్ని శుభ్రపఱచినా పాపవిముక్తి కలుగుతుంది. ఇలాటి ఎన్నో క్రియలకెన్నో ఫలితాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా సూర్యమందిరంలో పురాణం చెప్పేవాడు శ్రేష్ఠబుద్ధి ప్రాప్తంకాగా జాతస్మరుడు - అనగా అన్ని జన్మల విశేషాలూ తెలుసుకోగలవాడౌతాడు. మానవులలో చాలా మంది సూర్యరాధన చేసి గంధర్వులు, విద్యాధరులు, దేవతలుగా మారినారు. ఇంద్రుడు సూర్యారాధన ద్వారానే ఆపదవిని పొందగలిగాడు. స్త్రీలు కూడా సూర్యారాధన చేసి ఉత్తమ గతులు పొందగలరు.

దిండీ! కామ్య ఉపవాసాన్ని గూర్చి చెప్తాను విను. ఇదే ఫలసప్తమీ వ్రతం. దీనివల్ల పాపాలు నశించి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. భాద్రపద శుద్ధచవితినాడు అయాచితపత్రంచేసి పంచమినాట ఒక పూట భోంచేసి, షష్ఠినాడు క్రోధాన్నీ, ఇంద్రియాలనూ జయించడం కోసం సంపూర్ణ ఉపవాసం చెయ్యాలి. భక్తిగా సామగ్రినంతటినీ సంపాదించి పెట్టి స్వామిని పూజించాలి. రాత్రి ఆయన ప్రతిమ వద్దనే నేలపై శయనించాలి. సప్తమినాడు స్వామినే ధ్యానిస్తూ ప్రాతర్వేళనే మేల్కొని స్నానంచేసి పూజ చేయాలి. పిమ్మట ఖర్జూరం, కొబ్బరికాయ, నూమిడి, మాదీఫలాది నైవేద్యాలను స్వామికి భోగంగా సమర్పించి బ్రాహ్మణులకివ్వాలి. తను కూడా ప్రసాదరూపంలో దానిని భుజించాలి. పండ్లు దొరక్కపోతే బియ్యంగాని, గోధుమలు గాని బాగా పిండిచేసి నేతిలో వండి బెల్లం బాగా కలిపి దానితోనే సూర్యునికి భోగం చేయవచ్చు. తరువాత హోమం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఇలా ఒక యేది పాటు సప్తమీ వ్రతాన్ని చేసినాక ఉద్యాపన చెయ్యాలి. గోమూత్రం, గోమయం, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, కుశజలం, తెల్లనిమట్టి, నువ్వులు, ఆవాలతో అభ్యంగనము, గరిక, ఆవుకొమ్ము, మల్లెపూలరసం కలిపిన నీటితో స్నానం చెయ్యాలి. ఆ పదార్థాలనే కాస్త తినాలి. ఇది అన్ని పాపాలనూ హరిస్తూంది. అన్ని రకాల పండ్లు, సస్యసంపన్నభూమి, ధాన్యయుక్త భవనం, దూడతోడి ఆవు, పగడం పొదిగిన రాగిగిన్నె, తెల్లటి వస్త్రాలు - ఇవన్నీ బ్రాహ్మణులకు దానం చేయాలి. బంగారం, రత్నాలు, వస్త్రాలు - ఆచార్యదేవునికికివ్వాలి. బ్రాహ్మణ భోజనాలతో వ్రత సమాప్తి చేయాలి. ఇదే ఫలసప్తమి విధానమనబడుతుంది.

ఈ అతిశయ పుణ్యమయమైన సప్తమి సకల పాపాలనూ నాశనం చేయగలదు. ఆ రోజు ఉపవాసంచేసే మనుజుడు సూర్యలోకాన్ని చేరగలడు. అక్కడ దేవ, గంధర్వ, అప్సరలచే పూజలందుకొనగలడు. ఈ వ్రతాన్ని చేసినవానికి దరిద్రమంటదు. పాపం మిగలదు. దుఃఖాలుండవు. ఈవ్రత ఫలితంగా బ్రాహ్మణులు ముక్తి పొందుతారు. క్షత్రియులు ఇంద్రలోకంలోనూ, వైశ్యులు కుబేరలోకంలోనూ వాస ప్రాప్తి నందుతారు. శూద్రులు ద్విజులౌతారు పుత్రహీనులకు పుత్రులు, దరిద్రురాలికి సౌభాగ్యాలూ అబ్బుతాయి. ఈ వ్రతమొక చింతామణి. ఈ వ్రతాన్ని గూర్చి విన్నా చదివినా అన్ని కోరికలూ తీరుతాయి.”