భవిష్య పురాణము

138 - ధ్వజారోపణ విధానం - ఫలం

నారదుడింకా ఇలా చెప్పసాగాడు. ‘సాంబా! ఇపుడు ధ్వజాన్నెలా నిలబెట్టాలి? అనే విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవులే ప్రవచించియున్నారు. ప్రాచీనకాలంలో దేవదానవ యుద్ధాలు జరిగినపుడు దేవతలు తమ రథంపై ఏయే గుర్తులను ధరించారో అవే వారి వారి ధ్వజాలైనాయి. వాటి లక్షణాలు ఈ ప్రకారంగా వుంటాయి. ధ్వజం యొక్క దండం తిన్నగా వంకలు లేకుండా ప్రాసాదము యొక్క వ్యాసమంత ఎత్తుండాలి. లేదా నాలుగు, ఎనిమిది, పది, పదహారు లేదా ఇరవై జానల ఎత్తుండాలి. ఇరవై దాటకూడదు. సమపర్వాలలో విభజింపబడాలి.

ధ్వజంపై దేవతలను సూచించే చిహ్నాలుండాలి. విష్ణుధ్వజంపై గరుడం, శివ ధ్వజంపై వృషభం, బ్రహ్మధ్వజంపై పద్మం, సూర్యధ్వజంపై వ్యోమం, సోమునికైతే నరుడు, బలరామునికి హలం, కామదేవునికి మకరం, ఇంద్రునికేనుగు, దుర్గకు సింహం, ఉమాదేవికి గోధ, రైవతకునికి గుర్రము, వాయుదేవునికి లేడి, అగ్నికి మేషం, గణపతికి ఎలుక, బ్రహ్మర్షులకి కుశదర్భలు పతాకలుగా స్ధిరపడిపోయాయి. ఏ దేవునికైనా అతని వాహనాన్ని ధ్వజంపై గాని రథంపై గాని పతాకపై చిత్రించడం సంప్రదాయం.

విష్ణు ధ్వజదండం బంగారందై వుండాలి, పతాక పసుపుపచ్చని రంగులో వుండాలి. శివునికి వెండిదండం, తెల్ల పతాక; బ్రహ్మకి రాగి దండం, పద్మవర్ణపతాక; సూర్యనారాయణునికి సువర్ణదండం, పంచవర్ణపతాక; ఇంద్రునికి సువర్ణదండం అనేకవర్ణ పతాక; యమునికి ఇనుపదండం నల్లరంగుపతాక; కుబేరునికి మణిమయధ్వజం, ఎర్రరంగులో పతాక; బలదేవునికి వెండిదండం, తెల్లజెండా; కామదేవునికి స్వర్ణ, రజత, తామ్ర, మిశ్రితదండం, చిత్రవర్ణ పతాక; గణపతికి తామ్ర లేక గజదంత దండం, తెల్ల పతాక; చాముండునికి ఇనుప దండం, నీలవర్ణ పతాక; గౌరీదేవికి రాగిదండము, అతిశయరక్తవర్ణ పతాక; అగ్నిదేవునికి సువర్ణ ధ్వజదండము, అనేకవర్ణపతాక; వాయువుకి ఇనుపదండము, నల్లని పతాక; భగవతికి సర్వధాతుమయమైన ధ్వజదండము, మువ్వన్నె పతాక వుండాలి.

ఈ విధంగా ధ్వజాన్ని ముందుగా నిర్మించి తెప్పించాలి. వేదిని నిర్మించి, కలశను స్థాపించి సర్వౌషధీజలాలతో ధ్వజానికి స్నానం చేయించాలి. వేదీమధ్యంలో దానిని నిలబెట్టి సర్వోపచారాలతో పూజించి పుష్పమాలతో అలంకరించి, దిక్పాలకులకు బలులిచ్చి ఒక రాత్రంతా ధ్వజాన్ని అలాగే అధివసింపజేయాలి. మరునాడు మంచి ముహూర్తంలో స్వస్తివాచనాదులను, మంగళకృత్యాలను చేస్తూ ధ్వజాన్ని మందిరంపైకి ఎక్కించాలి. ఆ సమయంలో అనేక మంగళవాద్య ధ్వనులూ బ్రాహ్మణుల వేదమంత్ర ధ్వనులూ పోటాపోటీగా సాగాలి.

ఏహ్యేహి భగవన్ దేవ దేవ వాహన వైఖగ

శ్రీకరః శ్రీనివాసశ్చ జయజైత్రో పశోభిత

వ్యోమ రూప మహారూప ధర్మాత్మం స్త్వం చవై గతేః

సాన్నిధ్యం కురు దండేఽస్మిన్ సాక్షి చద్రువతాం వ్రజ

కురువిద్ధిం సదా కర్తుః ప్రాసాదాస్యార్క వల్లభ

ఓం ఏహ్యేహి భగవన్నీశ్వర వినిర్మిత

ఉపరిచర వాయు మార్గానుసారించ్ర్చీ నివాస

రిపుధ్వంస యక్షనిలయ సర్వదేవ ప్రియంకురు

సాన్నిధ్యం శాంతిం స్వస్త్యయనం చమే

భయం సర్వ విఘ్నా వ్యప సరంతు (బ్రాహ్మ 138 /73-76)

సర్వ శ్రేష్ఠ భోగాలూ సూర్యలోకప్రాప్తీ ఈపుణ్యకార్యానికి ఫలంగా చెప్పబడ్డాయి.                 ‘               అధ్యాయము -138 - మగుల వర్ణన    

(తెలుగులో ‘మగ’ అంటే పురుషుడు సంస్కృతంలో ‘మగ’ అంటే సూర్య పురోహితుడు. మగ ఏకవచనం, మగులు బహువచనం.)

 ‘దేవర్షీ! మీదయ వల్ల నాకు సూర్యభగవానుని ప్రత్యక్ష దర్శనం ప్రాప్తించింది. ఉత్తమ రూపం కూడా దొరికింది. సూర్య మందిర నిర్మాణ పుణ్యమూ లభించింది. కాని స్వామీ ఈ మూర్తిని పదికాలాల పాటు పూజించెదవరు? మందిరాన్ని సంరక్షించేదెవరు?

‘సాంబా! ఈ పనిని వంశపారంపర్యంగా చేయడానికి బ్రాహ్మణులు సిద్ధపడరు. ముందుకురారు. ‘దేవలక వృత్తి’ (అంటే దేవుని ధనంతో పొట్టపోసుకోవడం)కి ఎవరూ ముందుకి రారు. కాబట్టి నువ్వు తిన్నగా సూర్యభగవానునే ఈ విషయమై ప్రార్థించు. లేదా నీ తండ్రి మాతామహులైన ఉగ్రసేన మహారాజు గారి పురోహితులనడిగి చూడు.’

సాంబడడగగానే పురోహితాగ్రణి గౌరముఖుడనే ఆయన ఇలా విన్నవించాడు. ‘రాజకుమారా! నేను బ్రాహ్మణుడను, నీవు రాజువు. కాని మీరు చెప్పిన దానికంగీకరిస్తే నేను నా బ్రాహ్మణ్యాన్నే కోల్పోవలసి వుంటుంది. దానాన్ని గ్రహించడం బ్రాహ్మణ ధర్మాలలోనొకటే! కాదనను. దేవ ప్రతిగ్రహద్రవ్యాన్ని మీరు ‘మగ’ అనే వృత్తి వారికివ్వండి. వాళ్ళకే సూర్యదేవుని పూజకై అన్ని అధికారాలూ వుంటాయి.’

సాంబడు మగ పరిచయాన్ని కోరిన మీదట గౌరముఖుడిలా వివరించాడు.

‘మగ సంజ్ఞికుడు అగ్ని స్వరూపుడైన సూర్యదేవునికీ నిక్షుభాదేవికీ జనించినవాడు. నిక్షుభ పూర్వజన్మలో గొప్ప సౌందర్యవతి. ఆమె ఋగ్జిహ్వుడనే మహర్షికి పుత్రికగా జనించింది. ఒకమారామె ద్వారా అగ్నికి అపచారం జరిగింది. అప్పటికి అగ్ని స్వరూపుడైవున్న సూర్యభగవానునికి కోపం వచ్చింది. ఆ కోపాగ్నిలో కాలిపోయిన నిక్షుభ మరుజన్మలో ఆయననే చేపట్టింది. వారికి పుట్టినవాడే ‘మగ’ అనువాడు. అతని వంశము వారందరూ మగాఖ్యులు, సూర్యదేవునికి పరమభక్తులు. అవ్యంగాన్ని మాత్రమే ధరిస్తారు. సూర్య పూజకు ఆయన చేతనే నియుక్తులైన అదృష్టవంతులు వారు. వారు శాకద్వీపంలో వుంటారు. నీవు రాజకుమారునిగా కాకుండా ఒక సూర్యభక్తునిగా వారిని ఆహ్వానిస్తే వస్తారు.’

అనంతరం సాంబడు ద్వారక చేరుకొని తన తండ్రియైన శ్రీకృష్ణభగవానునికి మొత్తం విషయాన్నంతటినీ విన్నవించాడు. ఆయన మేరకు గరుడు నధిరోహించి శాకద్వీపం చేరాడు. అక్కడ తేజస్వులు, మహాత్ములు, సూర్యారాధనా సంలగ్నులునైన మగలను దర్శించాడు. వారికి ప్రదక్షిణం చేసి ప్రణామపూర్వకంగా ఇలా విన్నవించాడు.

‘మహాత్ములారా! మీరు ధన్యులు. సర్వకాలసర్వావస్థలయందూ సూర్యారాధనలోనే మగ్నులై వుండే మీ దర్శనం మాకు సకల కళ్యాణకారకము. నేను శ్రీకృష్ణభగవానుల పుత్రుడను. నన్ను సాంబడంటారు. నేను చంద్రభాగానదీతటంపై శ్రీ సూర్యదేవుల మూర్తిని స్థాపించాను. విధి విధానంగా సూర్యమందిరంలో ఆరాధనలు చేయడంలో చేయించడంలో మీరే అధికారులు కాబట్టి మిమ్మల్ని సగౌరవంగా జంబూద్వీపానికాహ్వానించడానికి వచ్చాను. మీరు దయచేసి సూర్యపూజలు చేయాలి.’

‘సాంబా! సూర్యదేవులు మాకీ విషయాన్ని ముందే ఆజ్ఞాపించారు’. అంటూ వారు బయలుదేరగా పరమానందభరితుడైన సాంబడు వారిని గరుడవాహనంపై మిత్రవనంలోకి గొని వచ్చాడు. మగులను తన ఆలయంలో చూసి సూర్యదేవుడు ప్రసన్నుడై సాంబనికి దర్శనమిచ్చి ‘ఇక నీవు చింతించనవసరంలేదు. ఈ మగులు నా విధివత్ ఆరాధన సంగతి చూసుకుంటారు.’ అని చెప్పాడు.

సంతోషంగా ద్వారకకు మరలాడు సాంబడు.