భవిష్య పురాణము

82 - ద్వాదశ రవి వారవర్ణన నందాదిత్యవ్రత విధి

బ్రహ్మ, దిండి సంవాదాన్ని నారదుడు సాంబనికి వివరిస్తున్నాడు. బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ‘దిండీ! ఆదిత్యవారము నాడు శ్రాద్ధకర్మ చేసేవానికి ఏడుజన్మలదాకా ఏరోగమూ రాదు. నక్తవ్రతం చేసి ఆదిత్య హృదయాన్ని పఠించిన వారు రోగవిముక్తులై దేహాంతమున సూర్యలోకప్రాప్తినందుతారు.

గాయత్రికి మరోపేరైన మహాశ్వేత మంత్రాన్ని షడక్షర మంత్రం ‘ఓం ఖభోల్కాయ స్వాహా’తో కలిపి ఆదిత్యవారమునాడు చదివినవారికి సూర్యలోకనివాసం నిశ్చయం. సూర్యవారాలని ఓ పన్నెండిటికి పేర్లున్నాయి. నంద, భద్ర, సౌమ్య, కామద, పుత్రద, జయ, జయంత, విజయ, ఆదిత్యాభిముఖ, హృదయ, రోగహా, మహాశ్వేతాప్రియలను ఈ పన్నెండింటిలో మాఘశుక్లషష్ఠిని నందవారమంటారు. ఈ రోజు నక్తవ్రతం చేసి సూర్యనారాయణప్రతిమకు నేతితో స్నానం చేయించి శ్వేతచందన, అగస్త్యపుష్ప గుగ్గులధూపాదులతో పూజించి అపూపాది మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు ఈ మధురపదార్థాలతో భోజనం పెట్టి తానుకూడా మౌనంగా భోంచెయ్యాలి. తరువాత గోధుమపిండి లేదా యవలపిండిలో నెయ్యి, పంచదార వేసి అపూపమిఠాయిని తయారుచేసి సూర్య నారాయణునికి నివేదించి ఈ క్రింది మంత్రాలను చదువుతూ బ్రాహ్మణునకు దానిని సమర్పించాలి.

ఆదిత్యతేజసోత్పన్నం రాజ్ఞీ కరవినిర్మితం

శ్రేయసేమమ విప్రత్వం ప్రతీక్షాపూపముత్తమం

పూజకునకిస్తూ ఈ మంత్రం చదవాలి.

కామదం సుఖదం ధర్మ్యం ధనదం పుత్రదంతథా

సదాస్తు తేప్రతీచ్ఛామి మండకం భాస్కరప్రియం (బ్రాహ్మ - 82/18,19)

పై రెండు మంత్రాలూ గ్రహణ, సమర్పణలకుద్దేశింపబడినవి. నందవారపు ఈ విధానం కళ్యాణకారి. సూర్యలోక ప్రాప్తిదము.

ఈ పూజ చేసినవాని వంశము అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే వుంటుంది. దరిద్రంగాని, రోగంగాని ఆ వంశాన్ని అంటవు. సూర్యలోక నివాసానంతరము ఆ వ్యక్తి భూమిపై జనించినపుడు మహారాజవుతాడు. ఈ పూజావిధానాన్ని విన్నా, చదివినా సర్వ శ్రేయస్సులతో పాటు దివ్య, అచల లక్ష్మీప్రాప్తి కలుగుతుంది.