భవిష్య పురాణము

113 - 114 - సూర్యమందిర నిర్మాణము కింకరులకు యమరాజు మందలింపు - ఘృత క్షీరాభిషేక ఫలాలు

హే పుండరీకాక్ష! మట్టి, చెక్క లేదా రాయితో సూర్యదేవుని మందిరాన్ని కట్టించిన వాడు ప్రతిరోజూ ఒక యజ్ఞాన్ని చేసిన సంయుక్తఫలాన్ని పొందుతాడు. తనకు ముందలి వంద తరాల వారిని తన వెనుకటి వంద తరాలవారిని సూర్యలోక ప్రాప్తులను చేయగలడు. అసలు సూర్య మందిర నిర్మాణాన్ని ప్రారంభించగానే ఆవ్యక్తి గత యేడు జన్మలుగా చేసిన చిన్నా పెద్దా పాపాలన్నీ కాలి దగ్ధమైపోతాయి. మందిరంలో సూర్యమూర్తిని స్థాపించిన వెంటనే ఆ వ్యక్తియొక్క దోషాలన్నీ హరింపబడతాయి. అతని కుటుంబమంతా ఉద్ధరింపబడుతుంది.

యమధర్మరాజు నరుల ప్రాణాలు తీయడానికి కింకరులను పంపేటప్పుడు ఇలా స్పష్టమైన ఆదేశాలిస్తాడు.

‘నా ఈ ఆదేశాలను యథోచితంగా పాలిస్తూ మీరు పనిచేయాలి. మీ ఆజ్ఞల నుల్లంఘించడం ఏ ప్రాణికీ సాధ్యం కాదు. విశ్వానికి మూలభూతుడైన సూర్యభగవానుని ఉపాసన చేసేవారి వద్దకు మీరు పోరాదు. ఎందుకంటే వారికి నరకంలో స్థానంలేదు. ఎవరైతే సూర్యభక్తులలో, ఎవరి హృదయమైతే నిరంతరము సూర్య భగవానునిపైనే సంలగ్నమై వుంటుందో, ఎల్లపుడూ ఎవరైతే సూర్యపూజని గూర్చే ఆలోచిస్తూ సర్వకాల, సర్వావస్థలందూ సూర్యనామ జపకీర్తనలనే చేస్తుంటారో వారికి మీరు బాగా దూరంగా వుండండి. భాస్కర భగవానుద్దేశించి నిత్య నైమిత్తిక యజ్ఞాలు చేసేవారిని మీరు కన్నెత్తియైన చూడవద్దు. సూర్యమందిర నిర్మాణం చేయించిన వానిని, వాని బంధువులను దరిచేరకండి.’

మహాత్ముడైన యమధర్మరాజు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఒకమారు యమకింకరులు సత్రాజిత్తు వద్దకు పోయారు. అతని తేజస్సును తట్టుకోలేక పిట్టలలాగా రాలి భూమిపై పడి మూర్ఛపోయారు. యముడు వారిని రక్షించి మందలించాడు. (ఈ సత్రాజిత్తు సూర్యోపాసన చేసి శమంతకమణిని పొందిన మహా సూర్యభక్తుడు కాడు. సత్యభామ తండ్రికాడు. శ్రీకృష్ణుని మామగారు కాడు)

(సూర్యమందిరంలో ఏ సేవ చేసిన వారికి ఏ ఫలం లభిస్తుందో బ్రహ్మ విష్ణువునకు చెప్పాడు. శతానీకుడా వివరాలను ఇంతకుముందే వినియున్నాడు.)