భవిష్య పురాణము

164 - సూర్య షష్ఠీ వ్రత మహిమ

            సుమంతుముని ఇంకా ఇలా చెప్పసాగాడు.

            “మహారాజా! ఇపుడు మీరు సూర్యభగవానుని కత్యంత ప్రీతిపాత్రమైన సూర్యషష్ఠీ వ్రతాన్ని గూర్చి వినబోతున్నారు. ఈ వ్రతాన్ని చేయబూనిన ప్రతి ముందుగా జితేంద్రియుడై, క్రోధరహితుడై, ఆయాచిత వ్రతపాలన చేస్తూ సూర్యపూజా తత్పరుడై వుండాలి. అల్ప, సాత్త్విక భోజనం చేస్తుండాలి. స్నానాలూ అగ్నికార్యాలూ విధిగా చేస్తూ నేలపై శయని స్తుండాలి. మధ్యాహ్నం దేవతలూ, పూర్వాహ్నంలో ఋషులూ, అపరాహ్నంలో పితరులూ, సంధ్యలో గుహ్యకులూ మన భోజనానికి అధికారులై ప్రసాదిస్తూ వుంటారు. కాబట్టి ఈ కాలాలన్నిటినీ అతిక్రమించి, సూర్యవ్రతి, రాత్రివేళల్లోనే భోజనం చెయ్యాలని నియమ ముంది. మార్గశిర కృష్ణ షష్ఠి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ రోజు అంశుమాన్ అనే సూర్య నామరూపాలకు పూజ చేయాలి. రాత్రి గో మూత్రాన్ని నోట్లో వేసుకొని నిరాహారంగా వుండిపోవాలి. ఇలా చేసే వ్యక్తికి ‘అతిరాత్ర’ యజ్ఞము చేసిన ఫలం దక్కుతుంది. ఇలాగే పుష్యమాసంలో సూర్యదేవుని సహస్రాంశు నామరూపాలను పూజించి రాత్రి కొంచెం నేతిని నోటిలో వేసుకోవాలి. దీనివల్ల ‘వాజపేయ’ యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. ఇలాగే మాఘమాసంలో సూర్యుని ‘దివాకర’ నామరూపాలను పూజించి రాత్రి ఆవుపాలను ప్రాశ్న జేస్తే మహాయజ్ఞఫలం లభిస్తుంది. ఫాల్గుణమాసంలో సూర్యదేవుని ‘మార్తండ’ నామరూపాలను పూజించి ఆవుపాలను మాత్రమే తీసుకుంటే దేహాంతమందు అనంతకాల పర్యంతం సూర్యలోకవాస ప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో సూర్యదేవుని ‘వివస్వాన్’ నామరూపాలను పూజించి హవిష్య భోజనం చేసేవానికి సూర్యలోకంలో అప్సరసలతో ఆనందంగా విహరించే అదృష్టం పడుతుంది. వైశాఖ మాసంలో ‘చండకిరణ’ నామ రూపాలతో సూర్యదేవుని పూజ చేసి పాలు మాత్రమే స్వీకరించి వుండిపోతే పదివేల సంవత్సరాలపాటు సూర్యలోకంలో నివసించే అవకాశం వస్తుంది. జ్యేష్ఠమాసంలో భాస్కర భగవానుని ‘దివస్పతి’ నామరూపాలను పూజించి గోశృంగ జలాన్ని మాత్రమే స్వీకరించాలి. దీనికి చెప్పబడిన ఫలం కోటిగోదాన పుణ్యం. ఆషాఢంలో ‘అర్క’ నాముడైన సూర్యదేవుని పూజించి కాస్త గోమయాన్ని ప్రాశ్న చేసి శయనిస్తే సూర్యలోకప్రాప్తి వుంటుంది. శ్రావణమాసంలో ‘అర్యమ’ నామరూపాలతో సూర్యదేవుని పూజించి పాలుమాత్రమే స్వీకరిస్తే పదివేల సంవత్సరాలదాకా సూర్యలోకంలో నివసించే భాగ్యం కలుగుతుంది. భాద్రపదంలో ‘భాస్కర’ నామరూపాదులతో సూర్యపూజ చేసి పంచగవ్యప్రాశ్నంచేసి వుండిపోవాలి. దీనికి ఫలం సర్వయజ్ఞకర్తృత్వ పుణ్యం. ఆశ్వయుజమాసంలో ‘భగ’ నామ విధానాలతో భాస్కర దేవుని పూజించి రాత్రి గోమూత్రాన్ని మాత్రమే నోటిలో వేసుకోవాలి. ఈ ప్రతికి ‘అశ్వమేధ’ యజ్ఞఫలం సిద్ధిస్తుంది. కార్తిక మాసంలో ‘శక్ర’ నామకుడైన సూర్యదేవుని పూజించి దూర్వాంకుర భోజనాన్ని స్వీకరిస్తే రాజసూయయాగాన్ని చేసిన ఫలందక్కుతుంది.

            ఈవిధంగా ప్రతి కృష్ణపక్ష షష్ఠి నాడూ ఈ వ్రతాన్ని అనుష్ఠించి సంవత్సరాంతమున సూర్యభక్తి పరాయణులైన బ్రాహ్మణులకు తేనెతో, పాయసంతో మంచిభోజనం పెట్టి యథాశక్తి సువర్ణదానం, వస్త్రదానం చేయాలి. సూర్యభగవానునికి కపిలగోవుని దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఒక యేడాది పాటు నిరంతరాయంగా విధిపూర్వకంగా నిర్వర్తించిన వారు సర్వపాప విముక్తులై ఈప్సితార్థ సిద్ధులై జీవించి దేహాంతమున శాశ్వతముగా సూర్యలోకంలో ఆనందితులై వుండిపోతారు. మహారాజా! ఈ కృష్ణ షష్ఠీ వ్రతాన్ని స్వయంగా సూర్యదేవులే అరుణునికి ఉపదేశించారు.