భవిష్య పురాణము

124 - 126 - సూర్యాయుధాలు - వ్యోమలక్షణం

సుమంతు మహాముని ఇలా చెప్పసాగాడు. “ఓ శతానీక మహారాజా! ఇప్పుడిక సూర్యభగవానుని ముఖ్యాయుధమైన వ్యోమ లక్షణాలను వర్ణిస్తాను సావధానంగా విను”.

సూర్యుని ఆయుధమైన వ్యోమము సర్వదేవమయము. అది బంగారంతో తయారైనది. దానికి నాలుగు కొమ్మలుంటాయి. ఆ వ్యోమంలో(వార, శర్వ, త్ర్యంబక, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, అపరాజిత, ఈశ్వర, అహిర్బుధ్ని, భువ. వసువులు - ధ్రువ, ధర, సోమ, అనిల, అనల, అప్, ప్రత్యూష, ప్రభాస.

విశ్వేదేవులు - క్రతు, దక్ష, వసు, సత్య, కాల, కామ, ధృతి, కురు, శంకుమాత్ర, వామన, ఆదిత్య అశ్వినుల నామము లిది వరకే చెప్పబడినవి.)  పదకొండుగురు రుద్రులు, పన్నెండుగు రాదిత్యులు, పదిమంది విశ్వేదేవులు, ఇద్దరు అశ్వనీకుమారులూ తమ కళలతో సహా స్థితులై వుంటారు. ఎనమండుగురు వసువులు కూడా వుంటారు. ఇంకా సాధ్య, మరుత్, తుషితాది దేవతలు కూడా వుంటారు. వీరిలో ధర్ముడు బ్రహ్మపుత్రుడు. విశ్వేదేవులు, వసువులు, సాధ్యులు, ధర్మపుత్రులు, ఆదిత్య మరుత్తులు కశ్యప పుత్రులు.

స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తాపస, రైవత, చాక్షుష, అనే ఆరుగురు మనువుల కాలం గడిచిపోయింది. ప్రస్తుతం వైవస్వతమన్వంతరం నడుస్తోంది. అర్క సావర్ణి,

బ్రహ్మసావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మసావర్ణి, దక్షసావర్ణి, రౌచ్య, భౌత్య, మువుల కాలమింకా ముందుంది. మన్వంతరానికొక ఇంద్రుడుంటాడు. విష్ణుభుక్, విద్యుతి, విభు, ప్రభు, శిభి, మనోజవ అనే ఆరుగురింద్రుల కాలం కరిగిపోయింది. ఓజస్వీంద్రుని కాలం గడుస్తోంది. ఇంకా బలి, అద్భుతి, త్రిదివ, సుసాత్త్విక, కీర్తి, శతధామా, దివస్పతి అను ఇంద్రుల పరిపాలనా కాలమింకా రావలసివుంది.

కశ్యప, అత్రి, వసిష్ఠ, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, జమదగ్ని నామధేయులు సప్తర్షులు. ప్రవహ, ఆవహ, ఉద్వహ, సంవహ, వివహ, నివహ, పరివహ - ఈ ఏడుగురు మరుత్తులు. ఒక్కొక్కరికీ ఆరుగురు సహచరులు కాగా మొత్తం 49 మంది మరుద్గణ సభ్యులు ఒకే సమయంలో ఆకాశంలో సంచరిస్తుంటారు. అగ్నులు మూడు - సూర్యాగ్ని పేరు శుచి, వైద్యుతాగ్ని పేరు పావక, అరుణి మంథనంలో ఉత్పన్నమైన అగ్ని పవమాన, ఈ మూడగ్నులూ కొడుకులతో మనుమలతో కలిపి 49 మంది. బ్రహ్మపుత్రులైన సంవత్సరాదులు అయిదుగురు. వారు సంవత్సర, పరివత్సర, ఇద్వత్సర, అనవత్సర, వత్సరులు. సౌమ్య, బర్హిషద, అగ్నిష్వాత్తులను వారు పితరులు. జగత్తుయొక్క భావ అభావాలను సూచించే నవగ్రహాలు - సూర్య, చంద్ర, భౌమ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు. వీరిలో మొదటి రెండూ మండలగ్రహాలు. చివరి రెండూ ఛాయా గ్రహాలు. నక్షత్రాధిపతి చంద్రుడైతే గ్రహరాజు సూర్యుడు.

సూర్యుడు కశ్యపుని పుత్రుడు. సోముడు ధర్మునికీ, బుధుడు సోమునికీ, గురు శుక్రులు, భృగు ప్రజాపతికీ, శని సూర్యునికీ, రాహువు సింహికకీ, కేతువు బ్రహ్మకీ పుత్రులు.

పృథ్వినే భూలోకమంటారు. దీనికి స్వామి అగ్ని. భువర్లోకం వాయు అధీనం. స్వర్లోకాధిపతి సూర్యుడు. మరుద్గణాలు భువర్లోకంలో వుంటారు. రుద్రుడు, అశ్వనీ కుమారులు, ఆదిత్యుడు వసుగణాలు, దేవగణాలు స్వర్లోకనివాసులు. నాలుగవదైన మహర్లోకంలో ప్రజాపతులు, కల్పవాసులు ఉంటారు. జనలోకంలో భూమిని దానమిచ్చిన పుణ్యాత్ములు, తపోలోకంలో ఋభు, సనత్కుమారుడు, వైరాజాది ఋషులు వుంటారు. ఏడవదైన సత్యలోకంలో జననమరణాలనుండి ముక్తిని పొందిన మహాపురుషులుంటారు. ఇతిహాస పురాణవక్తలు శ్రోతలు ఆ లోకాన్ని చేరుకుంటారు. దీనిని బ్రహ్మలోకమని కూడా వ్యవహరిస్తారు. ఈ లోకంలో ఎటువంటి విఘ్నాలూ, బాధలూ వుండవు.

వ్యోమపూజ చేస్తే అక్కడున్న అంటే పై లోకాల్లో వున్నవారంతా సంతోషిస్తారు. ఆకాశ, ఖ, దిక్, వ్యోమ, అంతరిక్ష, నభ, అంబర, పుష్కర, గగన, మేరు, విపుల, బిల, ఆపోఛిద్ర, శూన్య, తమస, రోదసీ - ఇవన్నీ వ్యోమానికున్న నామాలే.

లవణ, క్షీర, దధి, ఘృత, మధు, ఇక్షు, సుస్వాద (జల) అనే ఏడూ సప్తసముద్రాలు. హిమాలయం, హేమకూటం, నిషధం, నీలం, శ్వాతం, శృంగవాన్ అనే ఆరూ వర్షపర్వతాలు. వీటి మధ్యలోనే మహారాజిత నామక పర్వతముంది. మహేంద్రి, ఆగ్నేయ, యామ్య, నైఋతి, వారుణి, వాయవి, సౌమ్య, ఈశాని అనే దేవనగరులు పైనున్నాయి.

భూమి దిగువన వున్న సప్తలోకాలు ఇవి : తల, సుతల, పాతాళ, తలాతల, అతల, వితల, రసాతలాలు. కాంచన మేరుపర్వతం భూమండల మధ్యంలో వ్యాపించియున్న అద్భుత మహానగం. నాలుగు రమణీయ శృంగాలతో సిద్ధగంధర్వ సుసేవితమై అలరారు దీని యెత్తు నాలుగువేల యోజనాలు. ప్రథమ శృంగంపేరు సౌమనస్సు. అది సువర్ణమయం, జ్యోతిష్కనామకమైన రెండవ శృంగం పద్మరాగమణిమయం. మూడవశృంగం చిత్రనామకం, సర్వధాతుమయం. నాలుగవదైన చంద్రౌజస్కశృంగం వెండిమయం. సౌమనసశృంగానికే గాంగేయ మను పేరుంది. అక్కడే సూర్యుడుదయిస్తాడు. కాబట్టి దానికి ఉదయాచలమనే పేరు కూడ వచ్చింది. ఇదే పర్వతానికి చెందిన జ్యోతిష్క శృంగం వెనుక దక్షిణాయనంలోనూ, ఇతర రెండు శృంగాలపై మేష - తులా సంక్రమాణ వేళల్లోనూ సూర్యుడుదయిస్తాడు. ఈ పర్వతము యొక్క ఈశాన్యకోణంలో ఈశ్వరుడు, ఆగ్నేయ కోణంలో ఇంద్రుడు, నైఋతిలో అద్రి, వాయువ్యంలో మరుత్తు మరియు మధ్యలో సాక్షాత్తు బ్రహ్మ, నక్షత్రాలూ, గ్రహాలూ వుంటాయి. పూర్వాగ్నేయ శృంగంపై శాండిల్య మహర్షి, నైఋతివైపు మహాబలశాలి విరూపాక్షుడు, వరుణుడు, మహాతేజస్వి, మహాబలీ, వీరమిత్రుడు నివసిస్తారు. దీనినే మేరు, వ్యోమ, ధర్మ పర్వతమని పిలుస్తారు. ఈ వ్యోమ స్వరూప మేరువు వేదమయ నామంతోనూ ప్రసిద్ధి చెందింది. నాలుగు శృంగాలూ నాలుగు వేదాలయొక్క స్వరూపాలు.”