96-101 - జయ, జయంతి, అపరాజిత, నంద, భద్ర సప్తమీ వ్రతాల వర్ణన

దిండి జయ సప్తమీతో మొదలుపెట్టి ఇతర సప్తమీ వ్రతాల వర్ణన కై బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఇలా చెప్పసాగాడు.

‘గణనాయకా! హస్త నక్షత్రయుక్తమైన శుక్లసప్తమిని ‘జయా’ లేదా ‘జయ’ సప్తమి అంటారు. ఆరోజు చేయబడిన దాన, హవన, జప, తర్పణ దేవపూజన, సూర్యదేవతా రాధనలకు సామాన్యం కంటే వందరెట్లు ఫలం లభిస్తుంది. ఇది పాపనాశిని, శ్రేష్ఠయశ దాయని, పుత్రప్రాప్తిదం, అభీష్టఇచ్ఛాఫలదము, లక్ష్మీప్రాప్తికరం. రెండు చేతులలోనూ కమలపుష్పాలున్న సూర్యభగవానుని ప్రతిమను చేయించి దానికొక సంవత్సరం పాటు పూజలు చేయాలి.

ఈ వ్రతంలో మూడు పారణలు చెయ్యాలి. ప్రథమ పారణ నాలుగు మాసాలు చెయ్యాలి. కరవీర పుష్పాలు, రక్తచందనం, గుగ్గుల ధూపం, గోధుమ పిండితో చేసిన లడ్లు నైవేద్యం - ఇత్యాదిగా పూజ ఈ పద్ధతిలోనే దేవాధిపతి (ప్రతి చోటా మార్తాండ శబ్దమే కనబడుతుంది. ఈ పుస్తకంలో మాత్రం( మార్తాండ్) అనే వుంది.) మార్తాండ భగవానునికి గావించి బ్రాహ్మణులను కూడా పూజించాలి. సప్తమినాడుపవసించి, అష్టమి నాట పారణము చేయాలి. ఈ పారణంలో పచ్చఆవాలు కలిపిన నీటితో స్నానం, కించిత్ గోమయప్రాశ్నం, మధార (జిల్లేడు) దంతధావనం భాగాలు. ఈ క్రియలన్నీ భానుర్శే ప్రీయతాం - సూర్యుడు నాకు ప్రసన్నుడగుగాక అనే వాక్యాన్నుచ్చరిస్తూనే చెయ్యాలి. ఇది తొలి పారణవిధి.

రెండవ పారణలో మాలతీపుష్ప, శ్రీఖండచందన, విజయ ధూపాలతో పూజ చేసి పాయసం నైవేద్యం పెట్టాలి. బ్రాహ్మణులకి భోజనం పెట్టి అలాటి భోజనాన్నే వ్రతీ తినాలి. ‘రవిర్శే ప్రీయతాం’ అనే వాక్యాన్నుచ్చరిస్తూ పంచగవ్యాలను కొద్దిగా తిని చండ్ర పుల్లతో పళ్ళుతోముకోవాలి.

మూడవ పారణలో అగస్తిపుష్పాలు, శ్రీఖండ, కుసుమ, సిమ్లాక ధూపాలు వినియోగించి పూజ చేయాలి. వికర్తనోమే ప్రీయతాం అని ప్రార్థిస్తూ కుశోదకాన్ని తాగాలి. తరువాత రేగుపుల్లతో పళ్ళుతోముకోవాలి. ఏడాది చివర్లో సూర్యభగవానునికి గంధ, పుష్ప, నైవేద్యాది ఉపచారాలతో విధ్యుక్తంగా పూజ చేసి ఆ ప్రతిమ దగ్గరే కూర్చోని పరమ పవిత్రమైన పురాణాన్ని శ్రవణం చేయించాలి.

జయంతీ సప్తమి. మాఘశుక్ల సప్తమినాడు వస్తుంది. ఇది పుణ్యదాయిని, పాపవినాశిని, కల్యాణకారిణి. ఈ వ్రతంలో నాలుగు పారణలుంటాయని పండితుల నిర్ణయం. పంచమినాడు ఏక భుక్తం, షష్ఠినాట నక్తవ్రతం, సప్తమినాడుపవాసం చేసి అష్టమినాడు పారణ చేయాలి. మాఘ, పాల్గుణ, చైత్రమాసాల్లో జయంతీ సప్తమి పూజను చేసేవారు సూర్యభగవానుని సుందర వకుళ పుష్పాలతో, కుంకుమలేపనంతో మోదక నైవేద్యంతో, నేతి ధూపంతో అర్చించాలి. పంచగవ్య ప్రాశ్నతో పవిత్రీకరింపబడాలి. బ్రాహ్మణులకు మోదకాలను తినిపించాలి. శాలి అను పేరుగల అన్నాన్ని కూడా వడ్డించాలి.

వైశాఖ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో శతదళ కమలాలు, శ్వేతచందనం, గుగ్గులధూపం, బెల్లపు మిఠాయిలు నైవేద్యం - సూర్యపూజనోపచారాలు. గోమయాన్ని నోట్లో వేసుకొని, ప్రతి పవిత్రుడై బ్రాహ్మణులకు బెల్లపు పిండివంటలతో భోజనం పెట్టాలి. శ్రావణ భాద్రపద ఆశ్వియుజ మాసాలలో మూడవ పారణం పడుతుంది. రక్తచందనం, మాలతీపుష్పాలు, విజయనామక ధూపం పూజాద్రవ్యాలు. నేతితో చేయబడిన అపూపాలు నైవేద్యం. బ్రాహ్మణులకి భోజనం అవే నేతిఅపూపాలతో పెట్టాలి. కుశోదకాన్ని పానం చేసి భోజనం చెయ్యాలి.

కార్తిక మార్గశిర పుష్యమాసాలలో నాలుగవ పారణం చేయాలి. ఎర్రపూలు. రక్తచందనం, అమృత నామకధూపం, పాయసనైవేద్యం, ఆవు మజ్జిగ ప్రాశనం ఈ పూజలోని ప్రత్యేకాంశాలు. ఈ జయంతి సప్తమిలో నాలుగుపారణల్లో క్రమంగా...

చిత్రభానుః ప్రీయతాం, భానుఃప్రీయతాం

ఆదిత్యఃప్రీయతాం, భాస్కరః ప్రీయతాం

అనే వాక్యాలను పదే పదే పలకాలి. అన్ని కోరికలు తీరడం, ఆత్మవిశుద్ధమై దేహంతంలో సూర్యలోకాన్ని చేరడం ఈ సప్తమీ వ్రతానికి చెప్పబడిన ఫలాలు.

అపరాజిత సప్తమి ని గూర్చి చెప్తాను విను. భాద్రపదశుక్ల సప్తమిని ఈ పేరుతో పిలుస్తారు. మహాపాతక నాశకమైన ఈవ్రతాన్ని చతుర్థినాటి ఏకభుక్తంతో మొదలు పెట్టాలి. పంచమినాడు నక్తవ్రతం, షష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమినాడు పారణంచేయాలి. దీనికి నాలుగు పారణలున్నాయని విద్వాంసులు ప్రకటించారు. సూర్యదేవుని పూజను కరవీరపుష్పాలు, రక్తచందనం, గుగ్గుల ధూపం, బెల్లపు అపూపలతో చెయ్యాలి. భాద్రపదాది మూడు మాసాల్లో తెల్లపూలు, తెల్లచందనం, నేతిధూపం, పాయస నైవేద్యాలతో పూజ చేయాలి. మార్గశిరాది మూడు మాసాలలో అగస్త్యపుష్పాలు, కుంకుమలేపనం, సిహ్లకధూపం, శాలిబియ్యపు టన్నం నైవేద్యంతో సూర్యభగవానుని పూజగావించాలి. ఫాల్గునాది మూడుమాసాల్లో రక్తకమలాలు, అగరు, చందన, అనంతనామకధూపం, పంచదార లేదా మిశ్రితఖండంతో తయారుచేసిన అపూపలతో సూర్యదేవుని పూజచేయాలి. జ్యేష్ఠాది మూడుమాసాలలో కూడా ఇలాగే కానివ్వాలి. నాలుగు పారణల్లో క్రమంగా...

సుధాంశుః ప్రీయతాం, అర్యమః ప్రీయతాం,

సవితాప్రీయతాం, త్రిపురాంతకః ప్రీయతాం -

అనే వాక్యాలనుచ్చరించాలి. క్రమంగా గోమూత్ర పంచగవ్య, ఘృత, ఉష్ణక్షీరాలను నోట్లో వేసుకోవాలి.

ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ సప్తమీవ్రతాన్నాచరించినవాడు ఎన్నడూ ఏ యుద్ధంలోనూ ఓడడు. శత్రుంజయుడై ధర్మార్థకామాలఫలాలను నిస్సందేహంగా పొందుతాడు. దేహాంతంలో సూర్యలోకం చేరుకుంటాడు. ఆ తరువాత శ్వేతాశ్వాలతో స్వర్ణ ధ్వజపతాకలతో శోభిల్లు రథంపై వరుణ భగవానుని చేరుకొని ఆయన ప్రియవ్యక్తిగా వెలుగుతాడు.

శుక్లపక్ష సప్తమీ తిథినాడే సూర్యసంక్రమణం కూడా కలిసి వస్తే దానిని మహా జయ సప్తమి అంటారు. ఈ రోజు చేయబడే స్నాన, దాన, జప, హోమ, పితృ, దేవ పూజనాదులు సామాన్య దినాల్లో కంటే కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయని, ఎందుకంటే ఈ సప్తమి తన కత్యంత ప్రియమైనదని స్వయంగా సూర్యభగవానులే నాతో (అంటే బ్రహ్మతో) చెప్పారు.

మార్గశిరశుక్ల సప్తమిని నందా సప్తమీ అంటారు. పంచమినాడేకభుక్తం, షష్ఠినాట నక్తవ్రతం, సప్తమినాడుపవాసం చెయ్యాలి. మూడుపారణలు ఈ వ్రతానికుంటాయి. మాలతీ పుష్పాలు, మంచిగంధం, చందనం, కర్పుర అగరు మిశ్రిత ధూపాలతో సూర్యపూజనం కావించి చక్కెర, పెరుగు కలిపిన అన్నాన్ని స్వామికి నైవేద్యం పెట్టి దానిని బ్రాహ్మణ భోజనాలలో వినియోగించాలి. ప్రతి కూడా అదే భోజనము చెయ్యాలి. భాస్కరునికి ప్రథమ పారణంలో ప్రత్యేకమైన పక్షక ధూపాన్ని, రెండవపారణలో ప్రబోధ ధూపాన్ని, శక్తికొలది, ఆఘ్రాణింపజేయాలి. (బ్రాహ్మ - 100/6,7) (8,9). రెండవపారణలో చక్కెరతో చేసిన పువా మిఠాయిని స్వామికి నివేదించి బ్రాహ్మణుల భోజనాలలో దానిని వేసి, వేపాకు నమిలి నోరు శుద్ధి చేసుకొని ప్రతి కూడా భోజనం చేయాలి.

మూడవ పారణలో నీల లేదా శ్వేతకమలాలు, గుగ్గులధూపము, పాయసనైవేద్యాలను పూజలో వినియోగించి చందన ప్రాశ్నచేసి భోజనం చెయ్యాలి. ప్రతి పారణలోనూ క్రమంగా విష్ణుః ప్రీయతాం, భగః ప్రీయతాం, ధాతా ప్రీయతాం అనే వాక్యాలను మనసా, వాచా పలుకుతుండాలి ఈ లోకంలో అనంతకాలం ఆనందంగా జీవించడం, ఆ పై సూర్యలోక ప్రాప్తి ఈ వ్రతానికి ఫలితాలుగా చెప్పబడ్డాయి.

హస్తనక్షత్రయుక్తమైన శుక్ల సప్తమి భద్రా - సప్తమి గా పేర్కొనబడుతున్నది. ఆ రోజు సూర్య భగవానునికి ముందు నేతితో ఆపై పాలతో, పిమ్మట చెఱకురసంతో స్నానం చేయించాలి. అపుడు చందనం పూసి గుగ్గుల ధూపాన్ని వేయాలి. చవితినాడు ఏకభుక్తం, పంచమినాడు నక్తవ్రతంలను విధిగా పాటించాలి. షష్ఠినాడు అయాచితం సప్తమినాడుప వాసం శ్రేష్ఠం. సప్తమివ్రతం చేస్తూన్నంతకాలం దుష్టులకు దూరంగా వుండాలి అంటే మిగతా సమయాల్లో దగ్గరై పొమ్మనికాదు. కొందరితో సాహచర్యం తప్పక పోవచ్చు. అయినా, అయినవారినికూడా ఈ సప్తమీ వ్రతదినాల్లో దూరంగా వుంచాలని అర్థం. పగలు నిద్రించరాదు. అన్ని నియమాలనూ పాటిస్తూ భద్రాసప్తమి వ్రతాన్ని నెరవేర్చినవారిని ‘ఋభు’” అను పేరు గల దేవత సమస్త కల్యాణ కారకమైన వస్తువులనూ ఇస్తూ కాపాడుతూ వుంటాడు. శాలి అను బియ్యపుపిండితో వృషభాన్ని తయారుచేసి సూర్యునికి సమర్పించిన వారికి సత్పుత్ర సంతానం కలుగుతుంది. జీవితమంతా ఆనందంగా గడుస్తుంది.

ఈ సప్తమీ కల్పాన్ని ప్రారంభం నుండి శ్రద్ధగా విన్నవారికి అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం దేహాంతంలో పరమపదమోక్షం ప్రాప్తిస్తాయి.