భవిష్య పురాణము

5-7 - అశ్వత్థ, పుష్కరిణి, జలాశయ ప్రతిష్ఠావిధి

బ్రాహ్మణులారా! అశ్వత్థవృక్షాన్ని ప్రతిష్ఠించాలంటే ముందు దాని మూలానికి దగ్గరగా రెండు హస్తాల పొడవు, వెడల్పులతో నొక వేదిని నిర్మించి చందనాదులు కలిపిన నీటిని జల్లాలి. దానిపై కమలాన్ని రచియించి అర్ఘ్యప్రదానం చేయాలి. మొదటిరోజు రాత్రి తద్విష్ణోః.. (యజు. 6/15) అనే మంత్రం ద్వారా కలశస్థాపన చేసి గంధ, చందన, దూర్వాక్షతలను సమర్పించాలి. గంధం పూసిన తెల్లదారాలతో కలశలను చుట్టాలి. మొదటి కలశపై గణేశుని, రెండవ కలశపై బ్రహ్మదేవునీ పూజించాలి. దిశలలో దిక్పాలకులనీ, వృక్షమూలంలో నవగ్రహాలనీ అర్చించి పూజించాలి. వృక్షమూలంలో విష్ణువునీ, మధ్యలో శంకరునీ, పైకి బ్రహ్మనీ పూజించి హవనం చేయాలి. పిష్టకాన్ని బలులనివ్వాలి. ఆచార్యునికి దక్షిణనిచ్చి వృక్షాన్ని జలధారలతో తడపాలి. దానికి ప్రదక్షిణ చేసి, సూర్యభగవానునికి ఆర్ఘ్యమిచ్చి స్వగృహానికి వచ్చెయ్యాలి.

లోతైన, చిన్న చెరువు వంటి వాటిని ప్రతిష్ఠించునపుడు ముందుగా భూతశుద్ధి చేయించి సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయాలి. తరువాత గణేశ, గురుపాదుక, జయ, భద్ర శక్తులను పూజించాలి. మండల మధ్యంలో ఆధార శక్తినీ, అనంత, కూర్మ దేవతలనీ పూజించాలి. చంద్ర, సూర్యాదులను కూడా పూజించాలి. రెండవ పాత్రలో పుష్పాదులతో ఇతర ఉపచారాలతో వరుణ దేవుని పూజించాలి. కమలానికి తూర్పు వైపున్న ఆకులలో ఇంద్రాది దిక్పాలురనూ, వారి ఆయుధాలనూ, మధ్యమందు బ్రహ్మదేవునీ పూజించాలి. భూర్భువః స్వః ఈ తత్త్వాలను కూడా పూజించాలి. మండలానికి ఉత్తర భాగంలో నాగరూపంలో అనంతుని పెట్టుకొని పూజించి అప్పుడు హవనం చేయాలి. ప్రథమాహుతి వరుణదేవునికిచ్చి ఆ తరువాత దిక్పాలక, నారాయణ, శివ, దుర్గా, గణేశ, గ్రహ, బ్రహ్మాదులకు ఇవ్వాలి. స్విష్టకృత్ హవనం గావించి బలులివ్వాలి. ఒక అష్టదళ కమలంపై వరుణదేవుని వెండి ప్రతిమను స్థాపించి, పుష్కరిణీ ప్రతిమను బంగారంతో చేయించి రెండింటికీ పూజలు సలిపినాక వాటిని నీటిలో .... అనగా జలాశయంలో వదలిపెట్టాలి. జలాశయ మధ్యంలో చిన్న నౌకను నిర్మించి వుంచాలి. పూజానంతరం దానిని అలాగే వదలివేయాలి. జలాశయ మధ్యంలోనే ఋత్విజుల చేత హోమం చేయించాలి. శేషనాగుని ప్రతిమను కూడా నీళ్ళలోనే విడిచిపెట్టాలి. అన్ని పనులూ అయినాక బ్రాహ్మణులకు దక్షిణనివ్వాలి. జలాశయంలోకి మకర, మీన, కూర్మాది ప్రాణులను తెచ్చి వదలాలి. అలాగే కమలాలను, నాచువంటి నీటి మొక్కలను కూడా వదలాలి. తరువాత జలాశయానికి ప్రదక్షిణ చేయాలి. పాలను జలాశయాలనికి దానం చేసి, దీనులకు అన్నదానం చేసి స్వగృహంలో ప్రవేశించాలి.

మునులారా! నలిని (కమలాల చెరువు) వాపి (నూయి, బావి) హ్రద (లోతైన జలాశయ) ములను ప్రతిష్ఠించడానికి ముందురోజు వరుణదేవుని సువర్ణ ప్రతిమను తయారుచేయించి ఆపోహిష్ఠా... (యజు. 11/50) అనే మంత్రంతో ఆయనను నీటిలో పెట్టాలి. (జలాధివాసం) తరువాత నూరు కమల పుష్పాలతో ఈ ప్రతిమను కప్పాలి. మండలం లోకి వచ్చాక తూర్పు ముఖంగా కూర్చొని కలశపై గణేశ, వరుణ, శంకర, బ్రహ్మ, విష్ణు, సూర్యదేవులను పూజించాలి. వరుణునికి నేతితో పాయసంతో ఆహుతులివ్వాలి. ఇతర దేవతలకు స్రువతో కొలిచి ఒక్కొక్క ఆహుతినిచ్చి పాయస బలినివ్వాలి. తరువాత జలాశయాన్ని ఉత్సర్జనం (అంటే దానం. అనగా ప్రజలకు అంకితం) చేసి వేయాలి. మధ్యలో యూపాన్ని స్థాపించి, గోదానాలు, దక్షిణలూ ఎప్పటిలాగే ఇచ్చి పూర్ణాహుతి తరువాత సూర్యునికి అర్ఘ్యమిచ్చి తన ఇంటిలోకి తాను అనగా యజమాని ప్రవేశించాలి.