భవిష్య పురాణము

22 - చతుర్థీ వ్రతం - గణేశ సాముద్రిక పరిచయం

            “ఋషిసత్తమా! తృతీయ కల్పవర్ణనను విని చరితార్థుడైనాను. ఇక చవితిని గూర్చి చెప్పి నన్ననుగ్రహించండి” అని కోరాడు శతానీకుడు.

చెప్పసాగాడు సుమంతు ఋషిసత్తముడు.

“మహారాజా! చతుర్థీ తిథి లేదా చవితినాడు ఎల్లప్పుడూ ఆహారం తీసుకోరాదు. బ్రాహ్మణునికి నువ్వులు దానం చేశాక అపుడు ప్రతి తిలలతోడి ఆహారాన్ని భుజించాలి. ఇలా రెండు సంవత్సరాలపాటు చేస్తే వినాయకుడు ప్రసన్నుడై కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడు. ఆ వ్రతి జీవితంలో భాగ్యోదయమౌతుంది. అపార ధనసంపత్తి కైవసమవుతుంది. పరలోకంలో కూడా సుఖాలే ప్రాప్తిస్తాయి. మళ్ళా ఈ లోకంలో ఏడు జన్మలు అన్ని సంపదలూ గల క్షత్రియ జన్మలే ప్రాప్తిస్తాయి.”

“గురుదేవా! గణేశునికి అంత కరుణ ఎందుకు కలుగుతుంది? అసలాయనను విఘ్నేశుడని ఎందుకంటారు?

“రాజా! ఒకరోజు కార్తికేయస్వామి తాను విధించిన లక్షణ శాస్త్రంలో పురుషుల, స్త్రీల లక్షణాలను రచిస్తుండగా వినాయకుడు వచ్చి విఘ్నం కలిగించాడు. దానితో క్రోధం కొద్దీ ఆయన వినాయకుని (ఒక) దంతాన్ని పెరికి వేసి దానితోనే అతనిని చంపబోయాడు. ఈలోగా శంకరుడక్కడకు వచ్చి ఆ మారణకాండను ఆపి ఆక్రోధి క్రోధానికి కారణ మడిగాడు.

“క్షమించండి నాన్నగారూ! నేను పురుషుల లక్షణాలను పూర్తిగా చెప్పాను. ఇక స్త్రీల లక్షణాలను తయారు చేయబోతుంటే వీడు ఆపేశాడు. ఇక ఆ పని అలాగే ఆగిపోయింది.”   “పుత్రా! పురుషలక్షణాలన్నీ నిర్ధారించావు కదా! నాలో ఏ పురుషలక్షణాలున్నాయో చెప్పు” అడిగాడు శివుడు నవ్వుతూ.

“మహాత్మా! మీలో ఎలాంటి లక్షణాలున్నాయంటే కాలక్రమాన ఈ విశ్వం మిమ్మల్ని ‘కపాలి’ అనే పేరుతో పిలుస్తుంది.

శివుడికి కోపం వచ్చి ఆ గ్రంథాన్ని సముద్రంలో విసరివేశాడు. అక్కడినుండి అంతర్ధానం చెంది సముద్రుని ఎదుట సాక్షాత్కరించి, (కొన్ని ప్రతుల్లో సముద్రునే తన వద్దకు పిలిపించుకున్నట్లు వుంది.) కార్తికేయుని గ్రంథాన్ని అలాగే ప్రపంచంలోకి ప్రచారంలోకి తెమ్మనీ, స్త్రీల అలంకారాల్లో లక్షణాలనూ, విలక్షణాలనూ వివరిస్తూ ఒక గ్రంథాన్ని తయారు చెయ్యాలని ఆదేశించాడు. సముద్రుని కోరిక మేరకు ఆ మొత్తం శాస్త్రానికి ‘సాముద్రిక శాస్త్ర’ మనే పేరు స్ధిరపడుతుందని వరమిచ్చి ఆ వైనాన్ని కార్తికేయునికీ చెప్పాడు.

“గణేశుని దంతం అతనికిచ్చెయ్యి నాయనా” అని ఆదేశించాడు శివుడు.

“అలాగే నాన్నగారూ! కాని ఈ దంతాన్ని అతడు సర్వవేళలా ధరించియే వుండవలెను. దానినెక్కడైనా పెట్టి తిరగడానికి పోతే అది అతనిని భస్మం చేస్తుంది” అని దంతాన్నిచ్చేసి వెళ్ళిపోయాడు కార్తికేయుడు.

ఓ రాజా! ఈనాటికి శంకర పుత్రుడైన వినాయక మహాత్ముని ప్రతిమల్లో ఆయన చేయి దంతానికి తగిలివున్నట్టు కనిపిస్తుంది. ఈ కథ పరమరహస్యం. ఒక్క చవితినాడే దీనిని ఎవరికైనా చెప్పవచ్చును. విద్వాంసులైన వారు, తమ వృత్తిని ప్రాణప్రదంగా కాపాడుకొనుచున్న నాలుగు వర్ణాల మనుజులకీ ఈ కథను ఆనాడు చెప్పవచ్చును. ఈ కథను చెప్పడమే ఒక వ్రతం. ఆ వ్రతాన్ని చేసే వారికి ఏ లోకంలోనూ అసాధ్యముండదు. ఏపని చేయాలనుకున్నా విఘ్నముండదు.”