భవిష్య పురాణము

108-109 - సూర్యపదద్వయవ్రతం - మార్తాండ సప్తమి

మహావిష్ణూ! ఇపుడు నేను జగద్ధాత, దేవదేవేశ్వర, సూర్యభగవానుల పదద్వయ మాహాత్మ్యాన్ని వర్ణించబోతున్నాను.

అంశుమాలిగా పేరొందిన సూర్యదేవుడు. జగత్కళ్యాణ కామనతో తన రెండు పాదాలనూ ఒక పాదపీఠంపై పెట్టాడు. ఆయన ఎడమ పాదాన్ని ఉత్తరాయణంగానూ కుడిపాదాన్ని దక్షిణాయనంగానూ తెలుసుకోవాలి. ఇంద్రాదులు ఈ పాదాలకు వందనం చేస్తునేవుంటారు. మనం ఈ దక్షిణ పాదాన్ని అర్చిస్తూ వుంటాము. శంకరదేవులు వామ పాదాన్ని పూజిస్తూంటారు”.

‘గోలోకస్వామిగా కూడా సూర్యభగవానుడవతరించాడు కదా! మరి ఆయన ఆరాధనా విధానమెట్టిది? అడిగాడు అచ్యుతుడు.

“అచ్యుతదేవా! ఉత్తరాయణ ప్రారంభదినాన ముందు ప్రతి స్నానం చేసి ఆ తరువాత స్థిరమనస్కుడై నేతితో పాలతో సూర్యభగవానునికి స్నానం చేయించాలి. సుందర వస్త్రాలతో, పుష్ప, ధూప, అనులేపనాదులతో స్వామిని పూజించి బ్రాహ్మణులను భోజన దక్షిణలతో సంతృప్తిపఱచాలి. సూర్యభక్తి పరాయణునిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తిని, అంటే సూర్యోపాసకుని, రావించి ఆయన పాదాలను సేవించాలి. మరల దక్షిణాయనం వచ్చేదాకా ఈ క్రింది ప్రార్థనను చేస్తుండాలి.

పరమాత్మమయం బ్రహ్మ చిత్రభానుమయం పరం

యమంతే సంస్కరిష్యామి సమే భానుః పరాగతిః

ఈ వ్రతానికి అధిదైవతము చిత్రభానురూపుడైన సూర్యుడు. ఆ చిత్రభానునే ఈ ఆరునెలలూ, ఏం చేస్తున్నా మనసులో ఇలా మననం చేసుకుంటూనే వుండాలి.

దక్షిణాయనం ప్రవేశించాక బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి మార్తండ దేవుని కథలను పురాణంగా చెప్పించి లేఖకులనూ, వాచకులనూ ఘనంగా సన్మానించి మెప్పించాలి. ఈ చిత్రభానుడే గోలోక స్వామి, ఈ వ్రతాన్ని చేసినవానికి పాపాలన్నీ నశిస్తాయి. ఈ ఆరుమాసాలలోనే, ఒకవేళ, వ్రతి మరణిస్తే, అతనికి పూర్ణోపవాసఫలం లభిస్తుంది.

మాఘకృష్ణసప్తమిని సర్వాప్తిసప్తమి అంటారు. ఈ సర్వాప్తి సప్తమీ వ్రతం చేస్తే అన్ని అభీప్సిత కామనలూ నెరవేరుతాయి. ఈ వ్రతకాలంలో క్రూరులతో దురాచారులతో మాట్లాడరాదు. ఏకాగ్రతతో వినమ్రంగా ఉంటూ సూర్యుని పూజించాలి.

మాఘం మొదలు ఆరుమాసాలలో ప్రతిమాస సంక్రాంతి పారణదినంగా పాటింప బడాలి. క్రమంగా మార్తాండ, క, చిత్రభాను, విభావసు, భగ, హంస అను ఈ ఆరు నామాలతో జపం చెయ్యాలి. స్నానానికీ ప్రాశ్నానికీ పంచగవ్యాలే ఈ ఆరుమాసాల పారణలకీ ప్రశస్తాలు; పాపనాశకాలు.

ఉప్పు, నూనెలను ఈ వ్రతకాలంలో పరిత్యజించాలి. రాత్రుళ్ళు జాగరణ చేయాలి. ఈ లోకంలోని అన్ని కోరికలనూ తీర్చే ఈ వ్రతానికి సర్వార్థావాప్తి సప్తమీ వ్రతమని కూడా వ్యవహారముంది.

ఇక సమస్త కళ్యాణకారకమైన మార్తాండ సప్తమిని వర్ణిస్తాను. ఇది పుష్యశుద్ధ సప్తమినాడు చేయబడాలి. దీని సమ్యక్ అనుష్టానం వల్ల అభీష్టఫలాలు సిద్ధిస్తాయి. సూర్యదేవుని ‘మార్తండ’ రూపానికి పూజచేసి నిరంతర మార్తండ జపాలు చెయ్యాలి. విశేష శ్రద్ధాభక్తులతో బ్రాహ్మణుని పూజించాలి.

ఈ విధంగా పవిత్రహృదయంతో అన్ని మాసాలలోనూ సూర్యోపాసన చేసి ప్రతి మాసంలోనూ శక్త్యనుసారం బ్రాహ్మణులకు గోదానం చేస్తుండాలి. నక్షత్రాలన్నీ ఈ మార్తండ వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో చేసి ఆ పూజాఫలంవల్లే ఆకాశంతో రాజిల్లుతున్నాయి.