భవిష్య పురాణము

102-103 - తిథుల నక్షత్రాల దేవతలు - వారి పూజాఫలము

దిండికి జ్ఞానోపదేశాన్ని ఆ విధంగా బ్రహ్మ గావించాడు” అని సుమంతుడు చెప్పగా శతానీకుడిలా ప్రశ్నించాడు.

“తిథులు చాలానే వున్నాయి కదా. సూర్యదేవునికి సప్తమినాడే పూజ చేస్తున్నామెందులకు? ఇతర తిథి నక్షత్రాల విషయమేమిటి?”

“మహారాజా ఒకప్పుడిదే సందేహం విష్ణువుకి వచ్చి బ్రహ్మనడిగితే ఆయన చెప్పినదే నీకు చెప్తున్నాను, విను. విభాజనసమయంలో ప్రతిపదాదిగా అన్ని తిథులనూ అగ్ని మొదలుగా అందరు దేవతలకీ ప్రదానంచేయడం జరిగింది. అప్పుడే సూర్యునికి సప్తమి వచ్చింది. ఏ తిథి ఎవరికీయబడినదో ఆ తిథికి వారు ‘స్వామి’ అనబడ్డారు. అప్పటి నుండి ఏ తిథినాటి స్వామిఎవరో చూసుకొని ఆ దేవతమంత్రాలను చదివి వ్రతాలను చేసినచో ఆ దేవత కరుణించడం జరుగుతోంది.

నిజానికి ఈ తిథులన్నిటిన్నీ ఆయా దేవతలకు ప్రదానం చేసింది సూర్యభగవానుడే. పాడ్యమిని అగ్నికీ, విదియను బ్రహ్మకీ, తదియను కుబేరునికీ, చవితిని గణేశునికీ, పంచమిని నాగరాజుకీ, షష్ఠిని కార్తికేయునికీ, అష్టమిని రుద్రునికీ, నవమిని దుర్గాదేవికీ, దశమిని యమధర్మరాజుకీ, ఏకాదశిని విశ్వేదేవగణాలకీ, ద్వాదశిని విష్ణువుకీ, త్రయోదశిని కామదేవునికీ చతుర్దశిని శంకరునికీ, పూర్ణిమను చంద్రునికీ ప్రదానం చేయడం జరిగింది. (రుద్రతత్త్వానికీ శంకరారాధనకీ తేడా వుంది) పవిత్రమైనదై, పుణ్యశాలినిగా పేరుగాంచిన అమావాస్యను సూర్యదేవుడు పితృదేవతలకిచ్చాడు. ఈ తిథులన్నీ చంద్రునివే. కృష్ణపక్షంలో. చంద్రుని కళల ద్వారా అమృతాన్ని ఆయా దేవతలు పానంచేస్తుంటారు. పదహారవ కళకు క్షయం లేదు. అందులో సూర్యభగవానుడుంటాడు. కాబట్టి ఆయన అన్నింటినీ అందరికీ అక్షయంగా ప్రసాదించగలడు. మిగతా దేవతలే ఉపాసకులకేమి ప్రసాదించగలరో వినండి.

ప్రతిపదా తిథినాడు అగ్నిదేవుని పూజించి అమృతంలాంటి నేతిని హవనం చేస్తే ఆయన అన్నిధాన్యాలనూ, అపరిమితంగా ధనాన్ని ప్రసాదిస్తాడు. ద్వితీయాతిథినాడు బ్రహ్మకి పూజచేసి బ్రాహ్మణబ్రహ్మచారికి భోజనం పెడితే ఆయన ప్రసన్నుడై ప్రతిని అన్ని విద్యలలోనూ పారంగతుని చేస్తాడు. తృతీయ తిథినాడు కుబేరుని పూజించినవారికి నిశ్చయంగా ధనం ప్రాప్తిస్తుంది. పైగా క్రయవిక్రయాది వ్యాపార వ్యవహారాలలో గొప్ప సామర్థ్యం, లాభం కలుగుతాయి. చవితినాడు గణేశుని పూజించాలి. ఆయన మనకి కలుగబోయే అన్ని విఘ్నాలనీ నశింపచేస్తాడు. పంచమినాడు నాగపూజ చేస్తే పాముల భయమెలాగూ వుండదు, అంతేగాక ఉత్తమ స్త్రీ, పుత్రులు, లక్ష్మీకటాక్షం లభిస్తాయి. షష్ఠినాడు కార్తికేయుని పూజించేవారికి. శ్రేష్ఠమేధస్సు, రూపసంపద, దీర్ఘాయువు, యశస్సు లభిస్తాయి. సప్తమినాడు చిత్రభాను నామంతో విరాజిల్లే సూర్యభగవానుని పూజిస్తే అన్నికోరికలూ ప్రయత్నాలూ నెరవేరతాయి, అష్టమినాడు వృషభాకారుడైన సదాశివుని పూజిస్తే ప్రచురజ్ఞానం, ఆధ్యాత్మిక అత్యధిక కాంతి కలుగుతాయి. మృత్యుహరణము, బంధవిముక్తి ఏది కోరితే దాన్నిచ్చేవాడు శివుడు. నవమినాట దుర్గమ్మతల్లిని పూజించేవాడికి సంసార సాగరాన్ని తన ఇష్టప్రకారం దాటే శక్తితో బాటు ఇహలోకంలో సమస్త యుద్ధాలలోనూ విజయప్రాప్తి కలుగుతుంది. దశమినాడు యముని పూజిస్తే రోగవిముక్తి, మృత్యుభయ నాశనం, నరకనివాసవిముక్తి కలుగుతాయి. ఏకాదశినాడు విశ్వేదేవులను పూజించిన వారికి ధన, ధాన్య సంపత్తి, భూమి, సంతానము లభిస్తాయి. ద్వాదశినాడు విష్ణువును పూజించినవారు అన్నిటిలోనూ జయాన్ని పొందుతారు, చివర అన్ని లోకాల్లోనూ, సూర్యసమానులై, పూజలందుకుంటారు. త్రయోదశినాడు మన్మథుని పూజించినవారికి మంచిరూపం, రూపసియైన జీవితభాగస్వామి, వాంచాఫలం కలుగు తాయి. చతుర్దశినాడు భగవానుడు, దేవదేవేశ్వరుడునైన సదాశివుని పూజించిన వానికి సమస్త ఐశ్వర్యాలతో బాటు పుత్ర పౌత్ర ధనాభివృద్ధి ప్రాప్తిస్తాయి. పున్నమినాట చంద్రుని పూజించినవాడు తన స్థాయి వారికి అధిపతి కాగలడు. ఈ అధికారం శాశ్వతంగా వుండిపోతుంది. అమావాస్యనాడు పితృదేవతలను పూజించిన వారికి ఆయా దేవతలు సంతానవృద్ధినీ, ధనరక్షనూ, ఆయు, బలాది శక్తులనూ ప్రసాదిస్తారు. పూజల ద్వారానే జనులు తరించ గలరు. కాబట్టి కమలం మధ్యలో మనకి కావలసిన తిథిస్వామిని పెట్టుకొని పూజించి ఆ దేవత మూలమంత్రాన్ని జపించి, నామసంకీర్తనం చేసి అంశ మంత్ర జప, హోమాదులను నిరంతరం చేసే మానవులు ఇహపరాల్లో అద్భుత, అనంత సుఖాలను అనుభవించగలరు. ఆయాదేవతల లోకాలకు వెళ్ళగలరు. సారూప్యభాగ్యము నందగలరు. పునర్జన్మలో ఉత్తమ, రూపసియైన, శత్రునాశకులైన మహారాజులు కాగలరు కావున నిత్యపూజ ఎంతైనా ఉత్తమం.

ఇలాగే నక్షత్రపూజాశాస్త్రం కూడా విన్నవిస్తాను. ప్రతి అశ్వినీ నక్షత్రంలో అశ్వినీ కుమారులను పూజిస్తే దీర్ఘాయువు, ఆరోగ్యవంతుడూ అవుతాడు. భరణీ నక్షత్రంలో యమధర్మరాజును నల్లని సుందరపుష్పాలతో, కర్పూరాది గంధాలతో పూజించినవారికి అపమృత్యుబాధ కలగదు. కృత్తికానక్షత్రంలో అగ్నిదేవుని ఎర్రపూలమాలతో, హోమాలతో పూజించినవారికి కోరికలు నెరవేరుతాయి. రోహిణీ నక్షత్రంలో బ్రహ్మనైన నన్ను పూజిస్తే కోరిన వరాలిస్తాను. మృగశిర నక్షత్రంలో చంద్రుని పూజిస్తే జ్ఞానము, ఆరోగ్యము ప్రాప్తిస్తాయి. ఆర్ర్దా నక్షత్రంలో సుందర కమలాది పుష్పాలతో పరమశివుని పూజించినవానికి అన్ని శుభాలూ కలుగుతాయి.

పునర్వసు నక్షత్రంలో దేవమాత అదితిని పూజిస్తే ఆమె మనసు కన్నతల్లిలాగే కాపాడుతుంది. పుష్యనక్షత్రంలో బృహస్పతికి పూజచేస్తే ఆయన సద్బుద్ధిని ప్రసాదిస్తాడు.  (ఆశ్రేష అను మాట కూడా వాడుకలో వుంది)ఆశ్లేషనక్షత్రంలో నాగులకు పూజ చేసినవారికి నాగభయముండదు. మఘనక్షత్రం పితృదేవతలది. ఆ సమయంలో హవ్య - కవ్యాల ద్వారా వారిని పూజించినవారికి ధన, ధాన్య, భృత్య, పుత్ర, పశుసంపదలు కలుగుతాయి. పూర్వ ఫల్గుణిలో పూషారూపంలోనూ ఉత్తర ఫల్గుణిలో భగరూపంలోనూ, పుష్పాది పూజలను సూర్యదేవుడే అందుకొని విజయాన్ని, కన్యలకైతే అభీప్సితపతిని, బ్రహ్మచారులకు కోరుకున్న పత్నినీ, రూప, ద్రవ్య సంపదలనూ ప్రసాదిస్తాడు. హస్తనక్షత్రంలో సూర్యభగవానుని పుష్పాదులతో పూజిస్తే అన్ని సంపదలూ అమరుతాయి. చిత్రానక్షత్రంలో పూజిస్తే త్వష్టానామంతో నున్న సూర్యదేవుడు శత్రురహిత రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. స్వాతీనక్షత్రంలో వాయుదేవుని పూజిస్తే పరమశక్తినిస్తాడు. విశాఖా నక్షత్రంలో ఎర్రపూలతో ఇంద్రాగ్నులను పూజించేవారికి ధన, ధాన్య, తేజస్సులు ప్రాప్తిస్తాయి.

అనురాధా నక్షత్రంలో సూర్యుడే మిత్రరూపంలో పూజలందుకొని లక్ష్మీప్రాప్తిని, చిరాయువును కలుగజేస్తాడు. జ్యేష్ఠా నక్షత్రంలో ఇంద్రుని పూజిస్తే పుష్టి, గుణ, ధన, కర్మలలో అన్నింటా అగ్రేసరత్వము ప్రాప్తిస్తాయి. మూలా నక్షత్రం అందరు దేవతలకూ పితరులకూ ప్రీతిపాత్రమైనదే. అందుచేత ఈ నక్షత్రంలో ఎవరిని పూజించినా స్వర్గలోకంలో స్థిరనివాసంతో బాటు ఇంత వరకూ చెప్పబడిన ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. పూర్వాషాఢా నక్షత్రంలో జలదేవతలకు పూజలూ, హవనాలూ చేసేవారికి శారీరక మానసిక సంతాపాలు తొలగిపోతాయి. ఉత్తరాషాఢా నక్షత్రంలో విశ్వేదేవులనూ, విశ్వేశ్వరునీ పుష్పాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

శ్రవణ నక్షత్రంలో తెల్ల, పచ్చ, నీలపు పువ్వులతో విష్ణుభగవానుని పూజిస్తే ఉత్తమ లక్ష్మీ, సర్వం సహా విజయమూ ప్రాప్తిస్తాయి. ధనిష్ఠా నక్షత్రంలో గంధపుష్పాదులతో వసువులను పూజిస్తే ఎంత గొప్ప భయమైనా భయపడి పారిపోతుంది. శతభిషా నక్షత్రంలో చేయబడు ఇంద్రుని పూజ పుష్టి, ఆరోగ్య, ఐశ్వర్యాల ప్రదానానికి దారితీస్తుంది. పూర్వాభాద్రలో సూర్యదేవుని పూజిస్తే ఉత్తమ భక్తి, విజయప్రాప్తి కలుగుతాయి. ఉత్తరాభాద్రలో, అగ్నిరూపమైన అహిర్ ఋధ్న్యాన్ని పూజిస్తే పరమశాంతి ప్రాప్తిస్తుంది. రేవతీ నక్షత్రంలో తెల్లపూలతో పూషానామకుడైన సూర్యభగవానుని అర్చిస్తే సర్వశుభాలూ, చెదరని ధైర్యమూ, విజయమూ కలుగును. (నక్షత్రాలన్నీ స్త్రీల నామాలే కాబట్టి న్యాయంగా అన్ని నక్షత్రాల పేర్లకీ చివర దీర్ఘముండాలి. కాని ఎందుకో గీతాప్రెస్ వారి ప్రామాణిక ప్రచురణలో కొన్నిటికి దీర్ఘాలివ్వబడలేదు)

ముఖ్యంగా యాత్రలు చేయాలనుకొనేవారూ, యాత్రలకు బయలు దేరుతున్నవారూ నక్షత్రదేవతలను పూజిస్తే యాత్రలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వాగ్దానం స్వయంగా సూర్యభగవానుల చేతనే ఈయబడింది. హే మధుసూదనా! ఇక ఉపవాసమంటే సూర్యునకెందుకిష్టమో వాటి పద్ధతి యేమిటో చిత్తగించండి.

భోగపరాయుణుడైన వ్యక్తి ఏ కష్టమూ తెలియకుండా జీవిస్తూనే పూజలుచేస్తూ సుఖిస్తున్నాడు. ఎంతటి మహాభక్తునికైనా కొన్ని బాధలు తెలియాలి. అప్పుడే లోకకల్యాణం జరుగుతుంది.

పాపాలకు, భోగాలకు దూరంగా వుండి సద్గుణాలనే పెంచుకుంటూ పోవడం ఉపవాస మనబడుతుంది. ఉపవాసంలో ఆహార నియమం. ఈ ‘భోగాలకు దూరంగా వుండాలనే షరతు’ నుండి వచ్చి వుంటుంది. ఎందుకంటే ఒకపూట భోజనం అవసరం. రెండుమూడు పూటల తిండి భోగం అనే అభిప్రాయం ప్రాచీనులకుండేది.

ఉపవాస పరాయణుడైన పురుషుడెపుడైనా భోగపరాయణుడైన వ్యక్తికంటే, ఇద్దరూ ఒకలాటి భక్తులేయైనా, దేవునికి దగ్గరివాడవుతాడు. ఉపవాసపరాయణుడైన వ్యక్తి ఒకటి రెండు, మూడు రాత్రులు సూర్యభగవానుని ధ్యానంలోనే గడిపితే, సూర్యనామజపం చేస్తూనే వుంటే, చేసే అన్ని పనుల్లోనూ సూర్యదేవుని ఉద్దేశ్యమే వుంటే, ఆయనపైనే మనసును పూర్తిగా లగ్నం చేసి వుంచితే, ఈ వ్యక్తికి పరబ్రహ్మ పదమిచ్చి తనవద్ద నిలుపుకోకుండా సూర్యభగవానుడెట్లుండగలడు? ఏదైనా కోరికను మనస్సులో పెట్టుకొని ధ్యానపూర్వకంగా, సూర్యోపాసన చేస్తే, ఆ కోరిక నెరవేరుతుంది. అంతే.’

‘నాలుగు వర్ణాలవారూ పాపపంకిలంలో మునిగిపోతున్నారు. వీరికి సుగతులెలా వస్తాయి?’ అని స్థితి కారకుడైన విష్ణువడిగాడు.

హే వాసుదేవా! నిష్కపట భావనతో తిమిరహరుడైన భాస్కరభగవానుని ఆరాధించే వారెవరైనా సద్గతిని పొందగలరు. అంతేగాని, నిత్యం విషయాసక్తులై, సూర్యునిపై మనస్సును లగ్నం చెయ్యకుండా బతికే వారినెవరు బాగుచేయగలరు? ఉద్ధరించగలరు? సంసారంలో దుఃఖపీడితుడైన వ్యక్తి సద్గతి ప్రాప్తించు కోవాలనుకుంటే అతడు లోక పూజ్యుడు, సర్వేశ్వరుడు, భగవానుడు, గ్రహాధిపతియైన సూర్యుని పూజించాలి. పుష్పాలు, సుగంధితధూపం, అగరు, చందనం, వస్త్రం, ఆభూషణం, భక్ష్యనైవేద్యం మున్నగు ఉ పచారాలతో, ఉపవాసపరాయణుడై సూర్యారాధన చేయాలి. సంసారంపై విరక్తి చెందిన వ్యక్తి సద్గతిని పొందాలనుకున్నా అతడు సూర్యదేవునే ఆరాధించాలి. ఆతనికి పుష్పాలు దొరకకపోతే శుభప్రదమైన చెట్టు యొక్క లేత ఆకులు గాని దూర్వాంకురాలుగాని తెచ్చి పూజను చేయవచ్చును. అతని సామర్థ్యం ననుసరించి పుష్ప, పత్ర, ఫల, ధూపాలతో భక్తిపూర్వకంగా భాస్కరభగవానులను పూజిస్తే అతనికి సంతుష్టి లభిస్తుంది. సూర్యదేవునికి విధి విధానానుసారం చేసే ఒక్క ప్రణామమే పది అశ్వమేధాల పుణ్యాన్ని తేగలదు. పది అశ్వమేధాలను చేసినవాడు మరల మరల జన్మించవచ్చు. సూర్యదేవునికి పై విధంగా ప్రణామం చేసిన వానికి పునర్జన్మే ఉండదు.

ఏకోఽపి హేలేః సుకృతః ప్రణామో, దశాశ్వమేధా వభృథేన తుల్యః

దశాశ్వమేధీ పునరేతి జన్మ, హేలి ప్రణామీ నపునర్భవాయ (బ్రాహ్మ 103/45)

నిజానికి నేను ఆయనను ఆరాధించే ప్రపంచపూజితమైన ఈ స్థాయిని చేరుకున్నాను. మీరూ, శంకరభగవానులూ కూడా సూర్యారాధకులే కదా! ఆయన బ్రహ్మహత్యా పాపవిముక్తుడైనది కూడా సూర్యారాధన ఫలంగానే కదా! అందరూ, ముఖ్యంగా బ్రహ్మచారులు సూర్యదేవునే పూజించాలి. ఎందుకంటే ఆయనే యజ్ఞపురుషుడు, వివస్వతుడు. బ్రహ్మచారులకు గురువు తరువాత, స్త్రీలకు పతి తరువాత దైవము సూర్యభగమానుడే. గోపతి అంశుమానుడను పేర గృహస్థులకు, తమోనాశకుడను పేర వైశ్యులకు, విభావసుడను పేర సన్యాసులకు సూర్యుడే ఆరాధ్యదైవము.