భవిష్య పురాణము

115 - కౌసల్యా గౌతమీ సంవాదం

జనార్దనా! దేవలోకంలో గౌతమియను పేరుగల మహాతపస్విని, బ్రాహ్మణి ఒకరోజు అప్పుడే దేవలోకానికి వేంచేసిన తన చిరపరిచిత స్త్రీమూర్తియైన కౌసల్యను ఆమె పతితో సహా గాంచి ఆశ్చర్యచకితురాలై ఇలా అడిగింది. ‘కౌసల్యా! దేవలోకంలో ఎందరో దేవతలున్నారు, దేవాంగనలున్నారు. సిద్ధగణాలు, వారి పత్నులు ప్రకాశిస్తున్నారు. కాని ఎవరిలోనూ నీకున్నంతటి రూప, గంధ, ప్రకాశాలు లేవు. మీ శరీరాలతోబాటు అన్ని అలంకారాలు అనిర్వచనీయమైన వెలుగుతో శోభిస్తున్నాయి. ఇదంతా ఏదో పూజాఫలమై వుండాలి. చెప్పండి. ఏయే తప, దాన, హోమ కర్మాలను గావించారో వర్ణించండి.’

కౌసల్య ఇలా చెప్పింది. ‘గౌతమీ! మేమిద్దరమూ యజ్ఞేశ్వర భగవానుడైన సూర్యదేవుని ఆరాధించాము. సుగంధిత తీర్థ జలాలతో నేతితో ఆయనకు స్నానాలు చేయించాము. ఆయన కృపతోనే నిర్మల కాంతి, ప్రసన్నత, సుఖము, సౌమ్యత, స్వర్గలోకగమనము మాకు కలిగినాయి. మావద్దనున్న ఆభరణాలు, వస్త్రాలు, రత్నాలు మున్నగు ప్రియవస్తువులన్నిటినీ సూర్యభగవానుని కర్పించి ఆయన ప్రసాదంగానే మేము ధరిస్తాము. స్వర్గప్రాప్తి కోసం మేము ఆ దేవదేవుని ఆరాధించాము. ఫలస్వరూపంగా ఇదిగో ఇక్కడ ఇలా నిలువగలిగాము. నిష్కామభావనతో ఆయననారాధించిన వారికి ముక్తి లభిస్తుంది.’

విష్ణుదేవా! నేను (అంటే బ్రహ్మ) కూడా సూర్యభగవానుని పూజించి అభీష్ట సిద్ధులను అందుకున్నాను. ఈ ఫలాలు అనంతకాలం నిలుస్తాయి. చందనం, కర్పూరం, అగరు, కుంకుమ, వట్టివేరు, వీటిని కలిపి ముద్దచేసి ఆయనకు పూస్తే సంతుష్టుడై లక్ష్మీప్రాప్తిని కలుగజేస్తాడు. నల్లచందనం, తురుష్కమను పేరుగల ఒక సుగంధద్రవ్యం, రక్తచందనం, గంధం, విజయధూపం సూర్యునికి ఇష్టమైన పదార్థాలు, వాటిని ఆయనకు నివేదించాలి. కృష్ణతులసి, కేతకిపూలూ, ఆకులూ, ఎర్రచందనం అర్పించిన వెంటనే సూర్యుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు. నీలకమలాలు, తెల్లకమలాలు, అనేక సుగంధిత పుష్పాలు సూర్యునిపై వేయవచ్చునుగాని కుటజ, శాల్మలి, వాసనలేని పూలు వేయరాదు. పట్టువంటి వస్త్రాలలో మనం ఇష్టపడే వాటినే ఆయనకివ్వాలి. ఫలములూ అంతే.

ఆత్మానం భాస్కరం మత్వా యజ్ఞం తస్మై నివేదయేత్

తత్తదవ్యక్త రూపాయ భాస్కరాయ నివేదయేత్ (బ్రాహ్మ 115/38)

వ్రతి తనను తానే భాస్కరునిగా భావించుకొని అన్ని యజ్ఞ క్రియలనూ అవ్యక్త రూపుడైన

ఆ భగవంతునికి నివేదించాలి.