భవిష్య పురాణము

166 -167 - నిక్షుభార్క వ్రతాలు

            “మునీంద్రా! స్త్రీలు ఎన్నో నోములూ వ్రతాలూ చేస్తుంటారు కదా! సూర్యనారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి వారేమి వ్రతాలు చెయ్యాలి?”

            “పాలకుడు పురుషుడే యైనా స్త్రీల బాగోగులను గూర్చి కూడా ఆలోచించడం ఉత్తమ రాజలక్షణం. చక్కటి విషయాన్నడిగారు మహారాజా! అవధరించండి. ఉత్తమ పుత్రసంతానాన్ని ఆకాంక్షించే అతివ నిక్షుభార్క మను పేరుగల వ్రతాన్ని చెయ్యాలి. ఈ వ్రతం స్త్రీ పురుషుల మధ్య పరస్పర ప్రీతివర్ధకం. అవియోగకారకం, ధర్మార్థకామసాధకం. ఈ ప్రతాన్ని షష్ఠి, సప్తమి, సంక్రాంతి లేదా ఆదివారాల్లో చేయాలి. సూర్యభగవానునితో బాటు ఆయన పత్ని నిక్షుభా మహాదేవిని కూడా పూజించాలి. ఇరువురి రూపాలతో కాంస్య, రజత, లేదా సువర్ణ ప్రతిమను తయారుచేసి దానికి నెయ్యి మున్నగు వాటిచే స్నానం చేయించి గంధమాల్యాదులతో వస్త్రాలతో అలంకరించాలి. తరువాత దానిని విజ్ఞానంపై స్థాపించి గొడుగును కూడా ఏర్పాటు చేసి ఒక పాత్రపై అమర్చి ప్రతి తలపై పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మోస్తూ సూర్యమందిరానికి గొనిపోవాలి. అక్కడ ఒక వేది పై ఈ ప్రతిమను స్థాపించి ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి క్షమాయాచనను గావించాలి. ఉపవాసము చేసి అక్కడి గుండాలలో హవనం చెయ్యాలి. అనంతరం సూర్య భక్తులైన బ్రాహ్మణులకు శుక్ల వస్త్రాలనిచ్చి, ధరింపజేసి, భోజనాలు పెట్టాలి. ఈ వ్రతమును చేసిన వారికి ఇహలోకంలో ఉత్తమ పుత్ర సంతానం లభిస్తుంది. దేహాంతంలో సూర్యలోకంలో కొన్నేళ్ళూ, విష్ణులోకంలో అనంతవర్షాల పాటు నివసించేభాగ్యం ప్రాప్తిస్తుంది.

            సౌభాగ్యకాంక్షతో, సంయతేంద్రియయై ఏ స్త్రీ అయితే సప్తమినాడు గాని షష్ఠినాడు గాని కటిక ఉపవాసం ఏడాది పాటు చేసి యేటి చివర్లో నిక్షుభా సూర్యుల ప్రతిమను తయారుచేసి ఇంతకుముందే చెప్పిన విధంగా పూజాదికములను నిర్వర్తిస్తుందో ఆమెకు సౌభాగ్యంతోబాటు, సూర్య, విష్ణులోక వాసాలతోబాటు, సౌరాదిలోకాల్లో నివాసం, సర్వాభీష్టసిద్ధి తదనంతరం మరల భూలోకంలో జన్మించినపుడు రాజపత్నిగా విరాజిల్లు భాగ్యము ప్రాప్తిస్తాయి.

ఇదే వ్రతాన్ని ప్రతి కృష్ణ సప్తమినాడు ఉపవాస సహితంగా ఒక యేడాదిపాటు చేసి సంవత్సరాంతంలో బియ్యపు పిండితో సుందరమైన నిక్షుభాప్రతిమను నిర్మించి పచ్చటి పూలమాలతో, పీత వస్త్రాలతో దాని నలంకరించి పూజించాలి. అన్ని కర్మలనూ సూర్యునికి నివేదించాలి. ఇలా చేసిన స్త్రీ కి ఏనుగుదంతం వలె స్వచ్ఛమైన శ్వేతవర్ణం, బలిమి, సౌందర్యం కలిగిన విమానంలో అన్ని లోకాలూ చుట్టి వచ్చి, వందకోట్ల సంవత్సరాలపాటు సూర్యలోకంలో నివసించే మహాభాగ్యం ప్రాప్తిస్తుంది. మరల భూలోకంలో జన్మించినపుడు అభీప్సిత ధనధాన్య సంపత్తితో బాటు తన మనసున కన్ని విధాలా అనుకూలుడైన పతిని పొందుతుంది.

            మాఘ కృష్ణసప్తమినాడు ప్రారంభించి ఆనాటి నుండి ప్రతి సప్తమినాడూ కటిక ఉపవాసం ఒక సంవత్సరం పాటు చేసి ఆ యేటి చివర్లో ఇదివఱకు చెప్పిన విధంగానే నిక్షుభార్కుల పూజను చేసి మగుల అంటే సూర్యపురోహితులు, భార్యలకు సంతుష్టికరమైన భోజనాలను పెట్టించే స్త్రీ రత్నానికి గంధర్వశోభితమైన విచిత్ర దివ్య విమానంపై నెక్కి సూర్యలోకం చేరి అక్కడ అనేక సహస్ర వర్షాలు అన్ని భోగాలనూ అనుభవిస్తూ నివసించే భాగ్యమబ్బుతుంది. మరల భూమిపై పుట్టవలసి వచ్చినపుడు రాజపత్ని జన్మ ఆమెకు వస్తుంది. ఇలాగే యేడాదిపాటు చేసి భోజకులకు పత్నులతో సహభోజనాలు పెట్టి వారిని గంధమాల్యాలతో సుందర వస్త్రాలతో పూజించి తామ్రపాత్రలో వజ్రములతో అలంకరింపబడిన నిక్షుభార్కుల సువర్ణ ప్రతిమను భోజక దంపతులకు దానం చెయ్యాలి. దీనికి చెప్పబడిన ఫలం: పాపవిముక్తి, భయనాశనం, దేహాంతంలో పరమపదప్రాప్తి.