భవిష్య పురాణము

165 - ఉభయ సప్తమీ వ్రతం

            ధర్మార్థ కామ మోక్షాలను ప్రాప్తింపజేసే సూర్యభగవానుని ఉత్తమ వ్రతమొకటుంది. పుష్యమాసంలో రెండు పక్షాలలోనూ సప్తమి దినాల్లో దీనిని చేయాలి. బియ్యం, గోధుమలు పిండి చేసి పక్వంచేసి సాలలో కలుపుకొని రాత్రి తిని జితేంద్రియత్వము, సత్యవాదిత్వములను పాటిస్తూ దినమంతా ఉపవాసం చెయ్యాలి. మూడు సంధ్యలలోనూ సూర్యుని, అగ్నిని ఉపాసించాలి. అన్ని భోగాలనూ త్యజించి నేలపై శయనించాలి. ఆ మాసం పూర్తయ్యాక మరుసటి సప్తమినాడు నేతితో సూర్యదేవునికి స్నానం చేయించి పూజ గావించి నైవేద్యంగా మోదకాలను, మరిగిన పాలను, అన్నాన్ని సమర్పించాలి. ఎనమండుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి సూర్యదేవునికి కపిల గోవును ఇచ్చివేయాలి. ఈ వ్రతం చేసిన వారికి సూర్యసమ దేదీప్యమాన విమానమెక్కి భగవాన్ అంశుమాలి యొక్క పరమ స్థానాన్ని చేరుకొనే భాగ్యం ప్రాప్తిస్తుంది. సూర్యునికి సమర్పించిన కపిలగోవుకీ దాని సంతానానికీ ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు ఈ వ్రతం చేసిన వారు సూర్యలోకంలో ప్రతిష్ఠాప్రాప్తి నొందగలరు.

            కురునందనా! మొత్తం అన్ని సూర్యవ్రతాలలోనూ అహింస, సత్యవచన, అస్తేయ, శాంతి, క్షమ, ఋజుత, త్రికాల స్నాన హవనాలు, పృథ్వీశయనం, రాత్రి భోజనం ఇత్యాదులను నిష్ఠగా పాటించాలి. వ్రతం చేసే వ్యక్తి తేజస్వి కావడం వెంటనే కనిపించే ఫలం.”