భవిష్య పురాణము

4 - భూగోళం - జ్యోతిశ్చక్రం

            శ్రీ సూతమహర్షి ఇంకా ఇలా విజ్ఞానవీచికలను వెలువరించసాగాడు. “మునీంద్రులారా! ఇపుడు భూలోక వర్ణనను వినండి. ఇది సప్తద్వీప సమన్వితమైన పుణ్యలోకము. జంబు, పక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర నామకములైన ఏడు మహాద్వీపాలీలోకంలో వున్నాయి. ఇవి సప్తసముద్రావృతాలు. క్షీరోద, ఇక్షురసోద, క్షారోద, ఘృతోద, దధ్యోద, క్షీరసలిల, జలోద - ఈ ఏడూ సప్తసముద్రాలు. వీటినే మహాసాగరాలని కూడా అంటారు. ఇవి క్రమంగా ఒకదాని కంటే నొకటి రెండింతలు ఆకార విస్తీర్ణాలను కలిగివుంటాయి. ద్వీపాలు కూడా అంతే. మన ఈ పృథ్వీ ఏబది కోట్ల యోజనాల విస్తృతిని కలిగి వుంది. దీనికి నలువైపులా సముద్రముంది. జంబూద్వీపం అన్ని ద్వీపాలకూ మధ్య ప్రకాశిస్తున్నది. దాని మధ్యలోనే స్వర్ణకాంతులతో విరాజిల్లే మేరుపర్వతమున్నది. దీనియెత్తు ఎనభైనాలుగువేల యోజనాలు. ఈ మహామేరు పర్వతం భూమి క్రిందికి పదహారువేల యోజనాల మేరకు ప్రవేశించింది. ఇందుచేత ఇది కమలరూపపృథ్వికి కర్ణికగా వర్ణింపబడినది. ఈ పర్వతానికి దక్షిణంలో హిమవంతమైన హిమకూటము, నిషధము అనే పర్వతాలున్నాయి. ఉత్తరం వైపు నీల, శ్వేత, శృంగి అను పేర్లుగల వర్షపర్వతాలున్నాయి. నిషధ, నీల, పర్వతాలు లక్షయోజనాల విస్తీర్ణంలో వున్నాయి హిమవాన్, శృంగీ పర్వతాలు ఎనుబదివేల యోజనాల విస్తీర్ణంలో వున్నాయి.

            మేరు పర్వతానికి దక్షిణభాగంలో భరతవర్షము, కింపురుష, హరివర్షాలూ ఉన్నాయి. ఉత్తరంలో చంపక, అశ్వ, హిరణ్మయ, ఉత్తర కురువర్షములున్నాయి. ఇవన్నీ భారత వర్షంతో సమానాలే. వీటిలో ప్రతి యొకటి తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణంలో వుంది. వీటికి మధ్యలో ఇలావృత వర్షము, దానికి మధ్యలో ఉన్నతమేరువు కలవు. దీనికి నాలుగువైపులా నాలుగు పర్వతాలున్నాయి. తూర్పువైపు మందరపర్వతం, దక్షిణాన గంధమాదనం, పశ్చిమంలో విపుల, ఉత్తరాన సుపార్శ్వ ఉన్నాయి. వీటిపై కడిమి, జంబూ, రావి, మఱ్ఱి వృక్షాలుంటాయి. జంబూద్వీపమనే పేరు ఈ భూమికి మహాజంబు వృక్షాల కలిమి తెచ్చిన కలిమియే. వీటి పండ్లు ఏనుగు తలకాయంతేసి వుంటాయి. అవి కొండపై పడి పగిలినపుడు వాటి రసమే ఒక పెద్దనదిగా మారి పారుతుంది; అదే ప్రసిద్ధ జాంబూనదము. అక్కడి వారు ఆ నీటిని త్రాగుతారు కాబట్టే వారికి చెమట, దుర్వాసన, వృద్ధాప్యము, ఇంద్రియక్షయమూ దరిచేరవు. అక్కడ నివసించేవారు శుద్ధ హృదయులై వుంటారు. ఆ నదీతీరాన వుండే మట్టి ఈ ఫలరసాలతో కలవగా ‘జాంబూనద’ మనే సువర్ణం ఏర్పడుతుంది. సిద్ధపురుషుల స్వర్ణాభరణాలు జాంబూనద ప్రసాదాలే.

            మేరువుకి దగ్గర్లోనే కుడివైపు భద్రాశ్వవర్షమూ, పడమట కేతుమాల వర్షమూ ఉన్నాయి. ఈ దేశాల మధ్యలో ఇలావృత వర్షముంది. విప్రశ్రేష్ఠులారా! మేరువుపైనే బ్రహ్మ యొక్క ఉత్తమస్థానముంది. దానిపై ఇంద్రస్థానమూ ఆపై శంకరభగవానుల స్థానమూ విరాజిల్లుతున్నాయి. వాటిపై విష్ణు స్థావరమూ దానిపై దుర్గా స్థానమూ ఉన్నాయి. దానిపై స్వర్ణమయమై, నిరాకారమై, దివ్యమైన జోతిర్మయస్థానముంది. దానికిపైన భక్తుల స్థానముంది. అక్కడ సూర్యభగవానులుంటారు. ఆయన ఇక్కడ జ్యోతిర్మయమైన చక్రం మధ్యలో నిశ్చలరూపంతో వుంటారు. ప్రతిమాసమూ అక్కడ దక్షిణం నుండి ఉత్తరదిక్కు వైపు దిక్పాలకులు, గ్రహాలు తిరుగుతునే వుంటారు. క్షీణ, వృద్ధుల క్రమంలో రవి ద్వారా చంద్రగ్రహం లంఘితమైనపుడు దానిని మలమాసమంటారు. సూర్య, బుధ, చంద్ర, శుక్ర గ్రహలు వేగంగా పరుగెత్తే లక్షణం కలవి. దక్షిణాయన మార్గంలో సూర్యుడు వెడలేటప్పుడు గ్రహాల క్రింది నుంచి వెళతాడు. చంద్రుడు, సంపూర్ణ నక్షత్రమండలం, బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శనిగ్రహాలు ఒకదానికి బాగా పైకి ఒకటి పరిభ్రమిస్తుంటాయి. వీటికి పైన సప్తర్షిమండలమూ. దానికి పైన ధ్రువనక్షత్రమూ వుంటాయి.