181-182 - వివిధ స్మృతి ధర్మాలు - వాటి సంస్కారాలు

(ఇక్కడొక విశేషముంది. సూర్య సారథియైన అరుణుడు, గరుత్మంతుడు అన్నదమ్ములు, వైనతేయులే. అయినా ఆ విషయం ఇక్కడ ప్రస్తావింపబడలేదు. అయితే, తరువాతి అధ్యాయములో సూర్యుడు అరుణుని ‘గరుడాగ్రజా’ అని సంబోధించినట్లు చెప్పబడింది.)

            “బ్రహ్మర్షీ! స్మృతి మున్నగు ఐదు ధర్మాలున్నాయని విన్నాను. అంతకు మించి వాటి గురించి ఇంకేమీ తెలియలేదు. కృపాత్మకులై వినిపించండి” అని కోరినాడు శతానీకుడు. చెప్పసాగాడు సుమంతుడు.

            “మహారాజా! ఒకప్పుడిదే విషయమై అరుణుడు భాస్కర భగవానుని అడిగాడు. ఆయన ఇలా ఉపదేశించాడు.

            ‘హే గరుడాగ్రజా! స్మృతులలో చెప్పబడిన ధర్మమునకు మూలము సనాతనమైన వేదమే. పూర్వము నందనుభవించబడిన జ్ఞానమును గుర్తుకు తెచ్చుకొనుటయే స్మృతి యనబడును. స్మృత్యాది ధర్మములైదు రకములు. ఈ ధర్మాలను పాలించడం వల్ల, పాటించడం వల్ల ఇహలోకంలో సుఖ, యశ, ఐశ్వర్య ప్రాప్తీ, చివర మోక్ష, స్వర్గప్రాప్తీ కలుగుతాయి. మొదటిది వేదధర్మం. రెండవది ఆశ్రమ ధర్మము - అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసయుక్తము. మూడవది వర్ణాశ్రమ ధర్మము - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభాగితము. నాలుగవది గుణ ధర్మము. అయిదవది నైమిత్తిక ధర్మము. ఏ ధర్మమైతే గుణాలనుబట్టి యేర్పడుతుందో అది గుణధర్మము. ఒక నిమిత్తాన్ని ఆశ్రయించి వుండేది నైమిత్తిక ధర్మము. ఇది జాతి, ద్రవ్య, గుణాలనాశ్రయించి వుంటుంది.

            నిషేధమనీ విధిరూపమనీ శాస్త్రం రెండు ప్రకారాలుగా వుంటుంది. దృష్ట, అదృష్ట, దృష్టాదృష్ట, అనువాద, అదృష్టాదృష్ట - అని స్మృతులు పంచవిధాలుగా వుంటాయి. వీటన్నిటికీ మూలం వేదమే. స్మృతి ధర్మానికి సాధన స్థానాలు ముఖ్యంగా బ్రహ్మావర్త, మధ్యక్షేత్ర, మధ్యదేశ, ఆర్యావర్త, యజ్ఞియదేశాలు. సరస్వతి వృషద్వతి అనే రెండు నదుల మధ్య దేవనిర్మితమైన దేశం బ్రహ్మావర్తం. హిమాచల, వింధ్యపర్వతాల నడుమ కురుక్షేత్రానికి తూర్పున, ప్రయాగకు పశ్చిమాన వున్నది మధ్యదేశం. తూర్పు సముద్రానికీ పశ్చిమ సముద్రానికీ హిమాచల వింధ్యాచలాలకీ మధ్యన వున్నది. ఆర్యావర్తము. కృష్ణసార అనగా కస్తూరీ మృగాలు చరించేది, స్వభావసిద్ధంగా నివసించేది యజ్ఞయదేశం. ఇవి తప్ప మిగతావన్నీ మ్లేచ్ఛ దేశాలనబడతాయి. ఇవి యజ్ఞాదులకు యోగ్యాలుకావు.

            ఆశ్రమ ధర్మాల గూర్చి ఆకర్ణించు. ఇవి ఒక క్రమంలోనే సాగాలి. జీవనాన్ని ఈ ఆశ్రమాలలో గడపడమే ఆశ్రమ ధర్మానుష్టానము. ఒక ధర్మమే నాలుగు వరుస దశలుగా విభజింపబడింది. బ్రహ్మచారి గాయత్రిని ఉపాసించాలి. గృహస్థుకి సంతానోత్పత్తి, బ్రాహ్మణ, దేవాదులను పూజించుట విధ్యుక్త ధర్మాలు. వానప్రస్థి దేవవ్రతాలను చేయాలి. సన్యాసి నిష్ఠగా తపమాచరించాలి. ఈ నాలుగు ధర్మాలూ ఏకధర్మము, వేదమూలకము. సర్వశ్రేష్ఠము గృహస్థ ధర్మము. ఇక్కడ సూర్యుడు చెప్పిన జాతకర్మ ఉపనయన, పుంసవన, సీమంతోన్నవాదులు. రెండవ అధ్యాయము నుండి ఆరవ అధ్యాయము వరకు చెప్పబడి యున్నవే.

            కన్యలు నాలుగు ప్రకారాలుగా వుంటారు. ఏడేళ్ళమ్మాయిని గౌరి అంటారు. పదేళ్ళ పిల్లని నగ్నికాయని, పన్నెండేళ్ళ బాలికని దేవకన్యయని, రజస్వలయైన కన్యని రోహిణి అనీ వ్యవహరిస్తారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పరం మధురమైన, దృఢమైన ప్రేమబంధం వుంటేనే ధర్మార్థకామాల శ్రేష్ఠమైన ఉత్పత్తి జరుగుతుంది. అదే మోక్షానికి దారితీస్తుంది.’