భవిష్య పురాణము

12-13 - మండప మహాయూప చలివేంద్రము పౌంసలాది ప్రతిష్ఠ

బ్రాహ్మణులారా! ఇపుడు మనం యాగాది నిమిత్తమై నిర్మితములగు మండపాలనెలా ప్రతిష్ఠించాలో చెప్పుకుందాం. దీనిని శిలామయముగానూ, కాష్ఠమయంగానూ, తృణపత్రాదిమయంగానూ చేయవచ్చు. అంటే రాయి, కర్ర, గడ్డి, ఆకులు దేనితో నైనా మండపాన్ని చేసుకోవచ్చును. అధివాసన ప్రారంభంలో శుభలగ్న ముహూర్తాలు చూసుకొని కలశను స్థాపించి అందులో విష్ణువునీ సూర్య చంద్రులనూ అర్చించాలి. ఆపోహిష్ఠా.. (యజు. 11/50) అనే మంత్రం ద్వారా కుశోదకంతోనూ, ఆప్యాయస్వ.. (యజు. 12/114) అనే మంత్రం ద్వారా సుగంధజలంతోనూ ప్రోక్షణ గావించాలి. గంధధ్వారా... (శ్రీసూక్తం - 9) అనే ఋక్కు ద్వారా చందన సింధూర, ఆలతాంజనలను సమర్పించాలి. రెండవ రోజు పొద్దున్నే వృద్ధి శ్రాద్ధమునాచరించాలి. శుభలక్షణ సమన్వితమైన ఒక మండపంలో దిక్పాలకులను స్థాపించాలి. మధ్యలో వేదిపై మరొక మండలాన్ని చిత్రించి సూర్య సోమ విష్ణువులనూ, ఒక కలశను పెట్టి దానిపై గణేశుని నవగ్రహాలనూ పూజించాలి. సూర్యభగవానునుద్దేశించి 108 మార్లు పాయసహోమాన్ని చేయాలి. విష్ణువుకీ చంద్రునికీ పన్నెండేసి ఆహుతులను వేసి పాయస బలులనివ్వాలి. వాస్తు దేవతను పూజించి ఆయనకు అర్ఘ్యమిచ్చి విధిననుసరించి ఆహుతులివ్వాలి. అప్పుడా మండలాన్ని సంకల్ప పూర్వకంగా యోగ్యుడైన బ్రాహ్మణునికి సమర్పించి తగిన దక్షిణలిచ్చి సూర్యునికి ఆర్ఘ్యప్రదానం చేయాలి. తృణ - మండపంలో విశేషించి వాసుదేవునికీ సూర్యభగవానునికీ పూజలు చేయాలి. ఒక కలశపై వరదాయకుడైన విఘ్నేశ్వర స్వామికి పూజనొనరించి ఆ కలశను వదిలెయ్యాలి. ఈశాన్యంలో యూపాన్ని స్థాపించి అన్ని దిశల వైపూ ధ్వజాల నెగురవేయాలి.

ఇపుడు నాలుగు నుండి పదహారుహస్తాల ప్రమాణంలో నిర్మించవలిసిన యూప, కూప, పౌంసలాదుల ప్రతిష్ఠలను గూర్చి వచిస్తాను. వీటి ప్రతిష్ఠలో గర్గ - త్రిరాత్ర యజ్ఞాన్ని చేయాలి. పౌంసల (చలివేంద్రం) యొక్క పశ్చిమభాగంలో తెల్లకుండపై వరుణదేవుని స్థాపించాలి. గాయత్రి, ఆపోహిష్ఠా... లతో ఆయనకు స్నానంచేయించాలి. తరువాత గంధ, తైల, పుష్ప ధూపాలతో మంత్రపూర్వకంగా ఆయనను అర్చించి వస్త్ర, దీప, చందనాదులను నివేదించాలి. ప్రతిష్ఠ చివర్లో శ్రాద్ధము పెట్టి ఒక బ్రాహ్మణునికి ఆయన భార్యతో కలిపి భోజనం పెట్టాలి. ఎనిమిదిహస్తాల మండపాన్ని తయారుచేసి దానిపై నొక కలశను స్థాపించాలి. దానిపై నారాయణునితో బాటు రుద్రుని, వరుణుని, పృథ్విని వారి వారి మంత్రాలతో పూజించాలి. ఆ తరువాత స్థాలీపాక విధానంలో హవనం చేయడానికి కుశకండిక నేర్పాటు చేయాలి. వరుణదేవుని పూజించి వరుణస్య... (యజు. 4/ 36) మున్నగు మంత్రాలే పఠిస్తూ స్రువతో పది ఆహుతులనివ్వాలి. అన్య దేవతలకు క్రమంగా ఒక్కొక్క ఆహుతినివ్వాలి. తరువాత స్విష్టకృత్ హోమాన్ని చేసి అగ్ని యొక్క ఏడు నాలుకలనూ పేర్కొంటూ హోమయోగ్యమైన పక్వాన్నము (చరు) తో హవనం చేయాలి. అప్పుడు అందరు దేవతలకు నైవేద్యాలనూ బలులనూ సమర్పించి సంకల్ప పూర్వకంగా కృపకై ప్రార్థించాలి. బ్రాహ్మణులకు పాలిచ్చే ఆవులనూ దక్షిణలనూ సమర్పించుకోవాలి. చిన్నకూపాన్ని ప్రతిష్ఠిస్తే గణేశునీ, వరుణునీ కలశపై శాస్త్రోక్తంగా వుంచి పూజించాలి. ఎఱ్ఱటి దారంతో కలశను నాలుగైదు చుట్లు చుట్టాలి. యూపస్థాపన తరువాత సంకల్ప వాక్యాలను చదువుతూ దానిని జాతికి అంకితం చెయ్యాలి. చివర బ్రాహ్మణులకు ఆదర పూర్వకంగా దక్షిణలివ్వాలి.