బ్రాహ్మణులారా! ఇపుడు మనం వివిధ ప్రకారాల అపశకునాలనూ, ఉత్పాతాలనూ వాటి ఫలాలనూ చర్చిద్దాం.
ఒక వ్యక్తి యొక్క లగ్నకుండలి, లేదా గోచారంలో పాప - గ్రహాలు యోగిస్తే వాటికి శాంతి చేయించాలి. ఉత్పాతాలు దివ్య, అంతరిక్ష, భౌమ అని మూడు ప్రకారాలుగా వుంటాయి. గ్రహాలవల్ల నక్షత్రాల వల్ల కలిగే అనిష్ట భయము దివ్యోత్పాతమనబడుతుంది. ఉల్కాపాతాలు, ఆకాశంలో గంధర్వనగరం కనబడడం, మంటలు సూర్యచంద్రులచుట్టూ గోచరించడం, ఖడ్గవృష్టి, అతివృష్టి, అనావృష్టి వంటివి అంతరిక్ష జన్యోత్పాతాలు. జలాశయాల్లో, వృక్షమూలం వద్ద, పర్వతంలో భూమిపై కనిపించే భూకంపాలు భౌమోత్పాలనబడతాయి. ఈ రెండు ఉత్పాతాల ప్రభావమూ ఒక వారం దాకా ఉంటుంది. ఆలోగా శాంతి చేయించకపోతే చాలాకాలం వరకూ ఆ ప్రభావం అశాంతిని సృష్టిస్తూ అలాగే నిలబడిపోతుంది. దేవతల బొమ్మలు నవ్వడం, రక్తం స్రవించడం, మబ్బులేకుండా ఉన్నట్టుండి మెరుపూ, పిడుగూ రావడం, వచ్చి పడడం, హింసా, నిర్దయా పెరగడం, పాములు పైకి ఎక్కుతుండడం ఇవన్నీ దివ్య ఉత్పాతాలు. ఇవన్నీ దుర్నిమిత్తాలే. మేఘంలో పుట్టిన వాన కేవలం కొండపైనే కురిసి నేలపై బడకపోతే, ఒక వారం దాకా పుట్టే ప్రాణులన్నీ ఆ వారం లోపలే పోతాయి. ఒకేరాశిపై శని, మంగళ, సూర్యగ్రహాలు నిలబడితే, అప్పుడే భూమిపై ఎల్లెడలా పొగలు కనబడితే చాలా పెద్ద యెత్తున జన సంహారం జరిగే అవకాశాలుంటాయి. బృహస్పతి తన రాశి నుండి అతిచారం చేస్తే, అనగా తను ఉండ వలసినంతకాలం అందులో వుండకుండా తీవ్ర వేగంతో ముందుకు దూసుకుపోతే అక్కడ శని కూడా వుండకపోతే మొత్తం రాజ్యమే నష్టమైపోయే సంభావనవుంది. పగలే సూర్యుడు కొద్దిసేపు కనబడకుండా పోయి దిక్కులలో మంటలు రేగి, ధూమకేతువులు (తోకచుక్కలు) కనిపించి, మాటిమాటికి భూమి కంపించినా, రాజుగారి పుట్టినరోజు నాడు ఇంద్ర ధనుస్సు కనిపించినా అది చాల పెద్ద దుర్నిమిత్తము - అనగా అపశకునం. భయంకరమైన పెను తుఫానులు వస్తాయి. గ్రహాలు తమతో తాము, తమలోతాము యుద్ధాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. మూడునెలల్లోనే రెండు గ్రహణాలు పుట్టుకొస్తాయి. ఉల్కలు పెద్ద సంఖ్యలో పడి, రాలిపడిపోతుంటాయి. ఆకాశంలోనూ భూమిపైన కప్పలు పరిగెడుతుంటాయి, పచ్చటి చినుకులు పడతాయి. రాళ్ళలో సింహాకృతి, మార్జాలాకృతి కన్పిస్తాయి. ఈ అపశకునాలకి ఫలితం - రాజ్యంలో తీవ్రమైన కరువుకాటకాలు, రాజుయొక్క వినాశనం. చైత్రంలోగాని ఫాల్గునం లోగాని నదీవేగం అకస్మాత్తుగా అత్యధికంగా పెరిగిపోతే రాజ్యంలో విప్లవం వస్తుంది. ఇవన్నీ సూర్యజన్య అద్భుత ఉత్పాతాలు; హవనాదుల ద్వారా వీటిని శాంతింపజేయవచ్చు. ఆకృష్ణేన.. (యజు. 33/43) అనే సూర్య మంత్రం ద్వారా హవనం చేయించాలి. ధాన్యాదులు నిస్సారమై పోవడం, ఆవులు నిస్తేజమై పోవడం, నూతులలో నీరు ఉన్నట్టుండి పాడైపోవడం ఇవన్నీ సూర్యజనిత ఉత్పాతాలు. వీటి శాంతికి కమలపుష్పాలతో ఒక వేయి ఆహుతుల నివ్వాలి. వికృత పక్షి, పాలిపోయిన కపోతం, తెల్లని గుడ్లగూబ, బాగా నలుపై పోయిన కాకి, కరాకుల పక్షి - ఇందేదైనా ఇంటిలోకి వచ్చి పడిపోతే ఆ ఇంటికేదో మహాపద (మహా ఆపద) వచ్చి పడబోతోందని తెలుసుకోవాలి. మెడలో నున్న మాలలు, హారాలు మనిషి కదలకపోయినా అవి కొట్టుకుంటూ చిక్కుపడి పోయినా, అప్పుడే పుట్టిన బాలకునికి దంతాలు మొలుచుకు వచ్చినా, దేవతా ప్రతిమలు నవ్వుతున్నా, వాటికి చెమట పట్టినట్లు కనిపించినా, ఇంటిలో గాని గొడ్లచావిట్లో గాని పామైనా, కప్పయినా ప్రసవించినా ఆ ఇంటి ఇల్లాలు ఆరు నెలల్లో నశించిపోవచ్చు. ఇంటిమీదగాని ఇంటి ముందలి భాగంలో నున్న చెట్టుపై గాని పెద్ద శబ్దంతో పిడుగుపడి అగ్నిజ్వాలలు కనిపిస్తే గొప్ప ఆపద సంభవిస్తుంది. వీటి శాంతికై సూర్యభగవానుని ప్రసన్నుని చేసుకోవాలి. దానికేం చేయాలంటే నువ్వులు, పాయసంతో ఆయనకి ఒకవేయి ఆహుతులివ్వాలి. గోదానం చెయ్యాలి. బ్రాహ్మణులకి దక్షిణాలివ్వాలి. దీనివల్ల శీఘ్రమే శాంతి లభిస్తుంది. అనుకోకుండా ధ్వజాన్ని, చామరాన్ని, సింహాసన విభూషితమైన రథంపై రాజును, ఛత్రాన్ని, స్త్రీ పురుషుల దెబ్బలాటనీ చూడరాదు. అంటే అవే కనిపించకూడదు. నేల వణకుట, కొండలు కొట్టుకొనుట, కోయిల లేదా గుడ్లగూబ రోదించుట వంటివి వినిపించినచో ప్రమాదమే. రాజు, మంత్రి, రాజపుత్రుడు, ఏనుగు వంటి ప్రియ, ముఖ్యసంస్థలకు నష్టం వాటిల్లుతుంది.
తాడి, పోక ఒకేసారి పుడితే ఆ ఇంట్లో వారికి ఆపదకలగవచ్చు. ఒక చెట్టుకి మరొక చెట్టు యొక్క పూలు, పళ్ళూ పూసినా కాసినా అది సోమగ్రహజన్య ఉత్పాతముగా చెప్పబడింది. దీని శాంతికై సోమవారము నాడు చంద్రుని నిమిత్తం పెరుగు, తేనె, నేయి, పలాశాదులతో (ఆకు) ఇమందేవా... ( యజు. 1/40) అనే మంత్రాన్నుచ్చరిస్తూ వేయి ఆహుతులిచ్చి, చరూని కూడా హవనం చెయ్యాలి.
పాలు, పెరుగు, నెయ్యి, పక్వాన్నాలలో రక్తం కనిపించినా, ఉన్నట్టుండి ఇంట్లో మంటలు ఉవ్వెత్తున లేచినట్లు కనబడినా, మబ్బు లేకుండానే మెరుపులు మెరిసినట్లనిపించినా, ఇంటిలోని పశువులతో సహా మనుజులంతా రోగగ్రస్తులలాగై పోయినా, మంగళ గ్రహోత్పన్నమైన ఉత్పాతానికి ఆయిల్లు గురియైనదని గ్రహించాలి. దీనిలో రాజు, మంత్రి, ఇంటి యజమాని ఈ మువ్వురి మారకము సూచితము. ఇట్టి భయంకర ఉపద్రవాలు కనబడగానే మంగళుని శాంతి పఱచుటకై పెరుగు, తేనె, నెయ్యి కలిసిన ‘కీర్’ ను గూలర సమిధతో అగ్నిర్మూర్ధా.. (యజు. 3/12) అనే మంత్రం ద్వారా పదివేల ఆహుతులివ్వాలి. ముగ్గురు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణగా ఎఱ్ఱ రంగు వస్తువులనే ఇవ్వాలి. స్వర్ణంతో గాని రాగితో గాని మంగళుని ప్రతిమను తయారుచేయించి దానమివ్వాలి. ఈ గ్రహశాంతి కార్యక్రమానికి తప్పక మంచి ప్రయోజనముంటుంది.
ఎవరూ తోలకుండానే గోవులు తోకలను పైకెత్తి పరుగెత్తిపోతున్నా, కుక్కలూ, పందులూ ఇంటిమీదికెక్కిపోతున్నా, ఇంటిలోని ఆడువారు ఏవో తెలియని భయాలతో సతమతమై పోతున్నా ఉన్నట్టుండి గృహ యజమాని మిథ్యావాదిగా మారిపోయినా, పుడమి తల్లి కదలికలకు లోనైనా, రాజుగారు తీవ్రవాద వివాదాలలో ఇరుక్కున్నా, ఇంటిలోని గోవులు అకారణంగా పెద్దపెట్టున అరుస్తున్నా ఈ ఉత్పాతాలన్నీ బుధ గ్రహ జన్యాలని గ్రహించాలి. వీటిని తప్పించుకోవడానికి బుధవారము నాడు బుధునుద్దేశించి పెరుగు, తేనె, నెయ్యిలను అపామార్గ సమిధతో చరూ అన్నంతో ఉద్బుధ్యస్వ.. అనే మంత్రం (యజు. 15/54) ద్వారా పదివేల ఆహుతులివ్వాలి. బుధుని బంగారు ప్రతిమనూ, పాలిచ్చే ఆవునూ దానమివ్వాలి.
కాలంకాని కాలంలో పశువులు సంగమించడం, యమల సంతతి జన్మించడం, ఉన్నట్టుండి ధాన్యాదులు తరగిపోతుండడం, ఇంటిలోని స్తంభాలు ఏమీ తగలకుండానే పగుళ్ళు వేయడం, పిల్లులు, కప్పలు గోళ్ళతో ఇంటిలోని నేలను గీరుతుండడం ఇంటిమీది కెక్కడానికి ప్రయత్నించడం ఈ దోషాలన్నీ కనబడు ఇల్లు ఆరునెలల్లో సర్వనాశనమై పోతుంది. ఒక కుటుంబసభ్యుని మృతి, కుటుంబంలో తీవ్రకలహాలు, వ్యాధులుత్పన్నమగుట, ఇలాటి వెన్నో జరుగుతాయి. బిల్వవృక్షంపై ఆడు గ్రద్ద, మగగ్రద్ద ఒకే మారు కనిపించడం జరిగితే రాజుకి మతిభ్రమణం, ప్రాసాదానికి హాని, అమాత్య వర్గం రాజుకి వ్యతిరేకం అగుట మున్నగు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ బృహస్పతి జన్యదోషాలు. వీటి శాంతికై బృహస్పతినుద్దేశించి శాంతిహోమాలు చేసి పాలిచ్చే ఆవునీ బృహస్పతి బంగారు ప్రతిమనీ దానం చెయ్యాలి.
కుండల్లో బిందెల్లో నీళ్ళన్నీ రాక్షసులు త్రాగేస్తున్నట్లనిపించినా, పంచదార, తైలం, వెండి, తాండవనృత్య (గడ్డి) చిక్కుడుగింజల వంటివి, ధాన్యాలు లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కనబడినా, తామ్రం, కంచు, ఇనుము, గాజు వంటివి ఇంట్లో లేకున్నా ఉన్నట్లు కనబడినా, ధననష్టము అనేక వ్యాధులు కలుగుతాయి. రాజు భయంకర ఉపద్రవం వల్ల బంధనాల్లో చిక్కుకుంటాడు. గోవులు, అశ్వాలు, సేవకులు తగ్గిపోతుంటారు. పళ్ళపై పళ్ళు (అక్రమదంతాలు) మొలవడం, కుండలలోంచి, పాత్రలనుండీ మేఘగర్జనలు వినబడడం జరిగితే ఇంటి యజమానికి ఆపద వాటిల్లుతుంది. ఇవన్నీ శుక్రగ్రహజనిత దోషాలు. ఈగ్రహ శాంతికి శుక్రవారము పెరుగు, తేనె, నేతిలో ముంచిన శమీపత్రాలతో హవనం చేసి, బ్రాహ్మణునికి రెండు తెల్లని వస్త్రాలను, ఒక తెల్లావును, స్వర్ణ శుక్రప్రతిమనూ దానమివ్వాలి.
ఆలయభూమి రక్తవర్ణంలో గాని పుష్పితమై గాని కనబడితే అక్కడకూడా ఉత్పాతాలు సంభవించవచ్చు. ఆపదలు రావచ్చు. అన్ని ఓషధులూ, గుఱ్ఱాలు మత్తెక్కినట్లయిపోయి హింసాత్మకాలై ప్రవర్తించి, నగరాల్లో గ్రామాల్లో రాజుగారికి శత్రువులెక్కువైపోయి, పశువులన్నీ ఊరకనే ఉరుకులూ పరుగులూ పెట్టి ఉడుములూ (ప్రేతాత్మ) శంఖినులూ, పురప్రజల గుమ్మాల్లో కొచ్చి నిలబడి, ఒక రకమైన చిరాకు వాతావరణాన్ని ఆవరించివుంటే అశుభాలు జరుగుతాయి. రాజ - పీడా, ధనహానీ తప్పనిసరి. ఇవన్నీ శనిగ్రహ జన్యాలని గ్రహించాలి. వీటి శాంతికై వివిధ సస్యాలతో సమిధలతో శనివారము నాడు శంనోదేవీ.. (యజు. 36/12) అనే మంత్రంతో పదివేల ఆహుతులనిచ్చి ‘చరు’ తో కూడా హవనం చేయాలి. నల్లనిదూడను కలిగిన ఆవును, రెండు వస్త్రాలను, బంగారాన్ని, వెండినీ, శనిదేవుని ప్రతిమనూ బ్రాహ్మణునికి దక్షిణగా సమర్పించాలి.
మేఘాలు గర్జించకుండానే ఎఱ్ఱని పచ్చని శిలావర్షం వస్తే, కురిస్తే, కనిపిస్తే, గాలి వీయకుండానే చెట్లు ఊగినట్లనిపిస్తే, ఇంధ్రధనువూ, ఇంద్రధ్వజమూ నేల రాలిపోతే, పగలు నక్కల, రాత్రి గుడ్లగూబల రోదన ధ్వనులు వినిపిస్తే, ఒక ఎద్దు మరొక యెద్దు మూపురం పై మోరతో గీరుతూ కనిపిస్తే దేశంలో పాపం యెక్కువై పోతుంది. రాజు ధర్మచ్యుతినీ రాజ్యచ్యుతినీ కూడా పొందుతాడు. గోవులలో బ్రాహ్మణులలో పరస్పరం యుద్ధవాతావరణం నెలకొంటుంది. వాహనాలు వాటంతట అవే ధ్వంసమైపోతాయి. ఆకాశంలో ధ్వజం నీడ వ్యాపించినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో తిరుగుబాటు లేస్తుంది. నీటిలో మంటలు కనిపించినట్లవుతుంది. ఉరుములూ, మెరుపులూ ప్రజల శరీరాలపైనే పడుతున్నట్లుంటాయి. జీవనము దుర్లభమైపోతుంది. తలుపుల మూలల్లో స్తంభాలపై మంటలు గాని పొగలు గాని గోచరించి కొందరికి ప్రాణాలు పోతాయి. శవయాత్ర మధ్యలో ఆశవం లేచి కూర్చొని మళ్ళీపడిపోవడం, స్థాపిత లింగము జరిగి జరిగి మరొక చోటుకి చేరుకోవడం, ఆకాశం అగ్నిలేకుండానే పొగలు గ్రమ్మడం, కాలం కాకపోయినా వృక్షాలకు పువ్వులూ పండ్లూ పూసేసి కాసేయడం వంటి అసంభావ్యాలన్నీ నగరంలోనే సంభవమైపోయి జనులకు ఏకోశానా శాంతిసుఖాలు లేకపోతే అది రాహుజన్య ఉత్పాతమే. దీని శాంతికై పెరుగు, తేనె, నెయ్యి, గరిక, దుబ్బు, అక్షతాదులతో కయానశ్చిత్ర.. (యజు. 27/39) అనే మంత్రం ద్వారా ఆదివారం నాడు పదివేల ఆహుతులను రాహువుకి చేసి చరుతో హవనాలు సమర్పించాలి. పాలిస్తున్న నల్లని గోవునీ, అతసీ, తిల, శంఖ, వస్త్రయుగ్మాలను బ్రాహ్మణునికి దానమివ్వాలి. వారుణహోమం కూడా చేస్తే మరీ మంచిది. సర్వదోషాలూ, పాపాలూ నశిస్తాయి.
నక్కలు, గ్రద్దలు, కాకులు భయంకరంగా అరుస్తుంటే, కరాళనృత్యం చేస్తూ వుంటే, మనిషికి మృత్యుభయం కలుగుతుంటే, నిలువెల్లా అగ్నిజ్వాలలతో ప్రజ్వలిస్తూ తోకచుక్క నింగిలో నిలబడి దర్శనమిస్తే నేలబీటలు వేస్తున్నట్లుంటే రాజు పీడితుడు కావడం, రాజ్యంలో కరువు రావడం అనేక ప్రకారాల అనిష్టాలు కలగడం జరిగితే సూర్య, ఇంద్ర దేవులకు మనపై అనుగ్రహం తప్పిందని అర్ధం చేసుకోవాలి. వారి దయకై స్వర్ణఛత్రంతో ఏడు గుఱ్ఱాలతో ప్రకాశించు సూర్యమండపాన్ని నిర్మించి బ్రాహ్మణులకు దానమిచ్చెయ్యాలి. ఐంద్రమంత్రంతో హవనం చెయ్యాలి.
అకస్మాత్తుగా తాటి, సాల, అక్ష, ఖదిర కమలాది వృక్షాల మొలకలు ఇంటిలోపల మొలుచుకు వస్తే అరిష్టం. ఇది కేతు గ్రహ జన్యదోషం. దీనికి త్ర్యంబకం.. (యజు. 3/60) మంత్రం ద్వారా పెరుగు, తేనె, నెయ్యిలతో పదివేల ఆహుతులిచ్చి ‘చరు’ నికూడా అగ్నికి దానమివ్వాలి. నల్లని దూడగల పయస్వినీ ధేనువునీ, వస్త్రాలనూ, కేతు ప్రతిమనూ బ్రాహ్మణునికి దానమివ్వాలి.
దక్షిణ దిశలో మన నీడ మన పాదాలకే మిక్కిలి సమీపంగా వచ్చి, నీడలో రెండో అయిదో తలలు కనిపించినా, ఒక శిరస్సే ముక్కలైనట్లు కనిపించినా ఒక వారంలోనే మృత్యువు రావచ్చు. దీని శాంతికై శనివారం నాడు శని దేవతకై ఇదివఱకులాగే హోమం చెయ్యాలి. ఇలాగే కన్నులు, బాహువులు, పాదాలు దడదడలాడుతూ అదురుతుంటే సోమగ్రహానికి శాంతిచేయించాలి. పుస్తకాలకీ, జందేనికీ, చరుకీ, ఇంద్ర ధ్వజానికి నిప్పంటుకుంటే సూర్యభగవానునికి శాంతి చేయించాలి. అయితే ఈ శాంతి కర్మలన్నీ తు.చ తప్పకుండా శాస్త్రాలు చెప్పినట్లే చేయాలి”. అని ప్రవచించాడు సూతమహర్షి.
మధ్యమ పర్వ తృతీయభాగం సంపూర్ణం