భవిష్య పురాణము

28 - స్త్రీల శుభాశుభ లక్షణ వర్ణన

బ్రహ్మదేవుడు కార్తికేయునికి చెప్పసాగాడు.

(గ్రీవ శబ్దానికి కంఠమనే అర్థం కూడా వుంది.) మెడ మీద రేఖ వుండి కనుకొలకులలో ఎరుపు జీరగల స్త్రీ ఏ యింటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్థమానమవుతూనే వుంటుంది. లలాటంపై త్రిశూల రేఖ వున్న లలన వేలాది మంది దాసదాసీ గణానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడి కనులు, అదే శరీర వర్ణము, తెల్లనై సమముగా నున్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రునికి జన్మనిస్తుంది. అతడే రాజవుతాడు. హంసవలె మృదువచనము, తేనెవలె శరీర వర్ణము గల తెఱవ ధన, ధాన్య సమృద్ధిని కలిగియుంటూ ఎనిమిది మంది కొడుకుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందర నాసికను, విల్లువలె వంపు తిరిగిన కనుబొమలను కలిగిన కాంత అతిశయ సుఖాలను అనుభవిస్తుంది. మృదువుగా, నున్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామలవర్ణం, మధుర భాషణం, శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛతగల పలువరుస గల పడతి అన్నిరకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది. విశాల నేత్రాలు, విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్తనంపై గానీ, చెవి, గుండె, చేతులపై గానీ ఉలిపిరి కాయయైనా, అంతపరిమాణము గల పుట్టుమచ్చయైనా గల మహిళ తొలి కాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణపాదాలతో, ఎత్తు ఎక్కువ లేని కాలిపై భాగంతో, చిన్న చీలమండతో, సుందరమై కలిసివుండే వేళ్ళతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలకూ అర్హురాలవుతుంది. పెద్ద, పెద్ద పాదాలు, అన్ని అంగాల పై రోమాలు, లావుగా నున్న చేతులు గల మహిళ దాసీదవుతుంది. పెద్దపాదాలు, వికృత వదనము, పై పెదవిపై రోమాలు వుండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు.

ఇక శీలాన్ని బట్టి వీరిని ఈ రకంగా పేర్కొనవచ్చు. పవిత్రురాలు, పతివ్రత అయి వుండి, దేవతా, గురు, బ్రాహ్మణ భక్తి కలిగివుండే తరుణి మానుషీ అవుతుంది. నిత్య స్నానాలు నిష్ఠగా చేస్తూ సుగంధ ద్రవ్యాలను అలదుకుంటూ, మధురంగా మాట్లాడుతూ, నిద్రా తిండి పెద్దగా అవసరంగా లేకుండా ఎపుడూ శుచిగా పవిత్రంగా వుండడం దేవతా స్త్రీ లక్షణం. ఎవరూ చూడలేదు కదాని పాపాలు చేయుట, తనను తానే దాచుకొనుట, మనసులోని మాటనెవరికీ తెలియనీయకుండుట మార్జారీజాతి లక్షణాలు. ఒకమారు నవ్వుతూ, ఒకమారు ఆడుతూ పాడుతూ, ప్రసన్నంగా నొకమారు, క్రోధాగ్నిలో మండుతూ మండిస్తూ ఒకమారు, పురుషుల మధ్య ఎక్కువ కాలాన్ని గడపడానికి సరదా పడుతూ వుండే స్త్రీని గర్దభీశ్రేణి మహిళగా పేర్కొంటారు. పతీ, బంధువులూ చెప్పే హితాన్ని తిరస్కరించి తన ఇచ్ఛానుసారం విహరించేది ఆసురీ అనబడుతుంది. ఎక్కువ తింటూ, తెగవాగుతూ, భర్తని కొట్టే స్త్రీది రాక్షసజాతి. శౌచమూ, ఆచారమూ, రూపం పై శ్రద్ధా లేకుండా నిత్యం మలినంగా వుంటూ భయంకరంగా వుండేది పైశాచీ అనబడుతుంది. మిక్కిలి చంచల స్వభావి, చపలనేత్రి, లోభినారీ వానరి. చంద్రముఖి, మత్తగజగమన, రక్తవర్ణనఖములు గలది, శుభలక్షణాలున్నది విద్యాధరి వీణా, మృదంగ, వంశీ వంటి వాద్య శబ్దాలు వినడంలో, పుష్పాలంకరణలో, సుగంధ ద్రవ్యానుభవంలో ఎక్కువ మక్కువ చూపే శుభలక్షణను గాంధర్వి అంటారు. ఈ విధంగా తనను ప్రార్థించిన కార్తికేయుని కరుణించి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు.”