భవిష్య పురాణము

1-2 - మధ్యమపర్వ 2వ భాగం - యజ్ఞమండల నిర్మాణం - పక్షి దర్శన ఫలం

సూతుడు మునులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. “బ్రాహ్మణోత్తములారా! ఇపుడు మీకు పురాణ వర్ణితమైన మండల నిర్మాణ విషయాన్ని వివరిస్తాను. ఋద్ధిమంతుడైన వ్యక్తి చేతితోనే కొలతలు తీసి మండల పరిమాణంపై ఒక నిశ్చయానికి రాగలడు. ఆయా స్థానాలలో అవసరమనిపించిన రక్తాది వర్ణాలను పూసి వుంచాలి. బయటి, మధ్య, లోపలికోణాల్లో మండలస్థులు కాబోయే దేవతల అస్త్రాలను వ్రాసి ప్రదర్శించాలి. శంభు, గౌరి, బ్రహ్మ, రామ, కృష్ణాది దేవతలను ఒక క్రమంలో పెట్టుకోవాలి. హద్దుగానున్న గీతకు అంగుళంపైన రెండు అర్ధభాగాలను గావించి శివ, విష్ణు దేవతలనక్కడ పరికల్పించుకోవాలి. శివయాగమైతే శివునితో మొదలు పెట్టి అందరు దేవతలనూ స్తుతించి విష్ణుప్రార్థనతో పూర్తిచేయాలి. అలాగే విష్ణు యాగమైతే శివునితో పూర్తి చేయాలి. మండల నిర్మాణమును అధముడైన బ్రాహ్మణుని చేతగానీ శూద్రుని చేతగానీ చేయించరాదు.

ఇక క్రౌంచస్వరూపాన్ని వర్ణిస్తాను. అన్ని శాస్త్రాల్లోనూ దీని ప్రశస్తి వుంటుంది. ఇది గోపనీయం అంటే రహస్యం. మామూలు విషయం కాదు. మహా, మధ్య, కనిష్ఠ భేదాలతో నిది వర్ణింపబడింది. క్రౌంచ దర్శనం వల్ల వందలాది జన్మల పాపాలు నశిస్తాయని చెప్పబడింది. మయూర, వృషభ, సింహ, క్రౌంచ, కపి - వీటిని ఇంటిలో, పొలంలో చెట్టుమీద అనుకోకుండా చూసిన వెంటనే భక్తిగా నమస్కరిస్తే బ్రహ్మహత్యాపాతకం కూడా నశిస్తుంది; ఏ జన్మనాటిదైనా. వాటిని పోషించడం చాలా మంచిది. దాని వల్ల కీర్తి లభిస్తుంది. దర్శనం వల్ల ధనమూ, ఆయువూ వృద్ధి చెందుతాయి. మయూరంలో బ్రహ్మ, వృషభంలో సదాశివుడూ, సింహంలో దుర్గమ్మా, క్రౌంచంలో నారాయణుడూ, పెద్దపులిలో త్రిపురసుందరీ, లక్ష్మీ అంశాంశ రూపాలలో వుంటారు. వీటికి నమస్కరిస్తే వారిని పూజించినట్లే. స్నానం చేయగానే ప్రతిరోజూ వీటిలో ఏ ఒక్కదానిని దర్శించినా గ్రహదోషాలు నశిస్తాయి. కాబట్టి వీటిని పెంచాలి. సర్వతోభద్రమండలం అన్ని యజ్ఞాలలో అన్ని విధాల పుష్టినీ ప్రదానం చేస్తుంది. సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడు, సాధకులహితం కోసం ఈ ఫలాన్నేర్పాటు చేశాడు. సంపూర్ణమండలాలను సంపూర్త - స్మార్త - యాగాల్లో సర్వతోభద్రమండలాలను ప్రత్యేకంగా విశేషరూపంలో, కోరికకు తగినట్లుగా నిర్మిస్తారు. ఎక్కడెక్కడ ఏయే రంగులువేస్తే ఏయే ఫలితాలు వస్తాయో కూడా శాస్త్రంలో చెప్పబడినది. (క్రౌంచపక్షియే రామాయణ ప్రారంభానికి కారణం. రావణునికి క్రౌంచుడు, క్రుచుడు అనే పేర్లున్నాయి.)