భవిష్య పురాణము

66 - 67 - సూర్యభగవానుని బ్రహ్మరూపత ఆదిత్యారాధనా మాహాత్త్యము

సూర్యభగవానుని ఆరాధనను గూర్చి ఇంకా వినాలని వుందన్నాడు శతానీకుడు. సుమంతుమహాముని చెప్పసాగాడు.

“మహారాజా! శంఖ, ద్విజ సంవాదమని ఒక విషయముంది. దీనిని విన్న మానవులు సంపూర్ణంగా పాపాలనుండి విడుదల పొందుతారు.

ఒక అత్యంత రమణీయమైన ఆశ్రమముంది. అక్కడ అన్ని వృక్షాలూ ఫలాల భారంతో వంగి వుంటాయి. జింకలూ లేళ్ళూ హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ కొమ్ములతో ఒకదానినొకటి గోకుతూ, గీరుతూ ఆనందిస్తాయి. మయూరాల నృత్యం, దానికి వాద్యసహకారమా అన్నట్లు అత్యధిక సంఖ్యలో పూచే రంగురంగుల పూలపై ఆడుకొను అసంఖ్యాక భ్రమరాల గీతాలు - వీటన్నిటితో హృద్యంగా విలసిల్లే ఆశ్రమంలో అనేక మహాతపస్వుల సేవలందుకొంటూ సూర్యభగవానుని శిష్యుడైన శంఖముని నివసించేవాడు.

ఒకనాడు భోజకుమారులాయన వద్దకు వచ్చి మిక్కిలి వినయంతో అంజలి ఘటించి నిలబడి ఇలా వేడుకున్నారు.

‘మునికుల తిలకా! వేద విషయంలో మాకు సందేహాలున్నాయి. మీరు వాటిని తీర్చాలి.’

ఈ ప్రార్థనకు ప్రసన్నుడైన శంఖముని ముందు వారిచేత సమగ్ర వేదాధ్యయనం చేయిచాడు. ఒకరోజు వారలా వేదపాఠం చేస్తుండగా మహాతపస్వియైన, ద్విజుడనే పేరుగల శ్రేష్ఠముని అక్కడకు వచ్చాడు. అమిత తేజస్వియైన శంఖముని ఆయనను విధి విధాయకంగా అర్చించి ఉన్నతాసనంపై కూర్చుండచేశాడు. భోజకుమారు లాయనకు వందనం చేశారు. ఆయన ప్రసన్నుడయ్యాడు. శంఖముని వారితో శ్రేష్ఠులు వచ్చినపుడు వారి భోధనలు వినడం కోసం వేదపఠనాన్ని ఆపినా దోషంలేదని చెప్పడంతో వారు ఆపి సావధానులై నిలబడ్డారు.

‘ఈ బాలకులెవరు, ఏమి చదువుతున్నారు? అడిగాడు ద్విజుడు. ఋషివరా! వీరు భోజక కుమారులు. సూత్ర కల్పాలతో సహా నాలుగు వేదాలనూ, సూర్యనారాయణ పూజన, హవన విధాలను, ప్రతిష్ఠావిధి. రథయాత్ర, సప్తమీ తిథి కల్పాలను అధ్యయనం చేస్తున్నారు’ చెప్పాడు శంఖముని.

‘మునీంద్రా! సూర్యప్రసన్నత నాకూ కావాలి. సూర్యనారాయణ మాహాత్మ్యాన్ని విశేషరూపంలో నేనూ వినాలనుకొంటున్నాను.’ అని ప్రార్థించాడు ద్విజుడు.

ఈ విషయంలో సాంబమహారాజు, వసిష్ఠమహర్షి సంవాదాన్ని మీ దృష్టికి తెస్తాను. ఒకరోజు సాంబుడు వసిష్ఠులవారి పవిత్రాశ్రమానికి వెళ్ళాడు. ఆయన పాదాలకు శిరస్సునంటించి ప్రమాణం చేసి భక్తిపూర్వకంగా చేతులు జోడించి వినీతుడై నిలబడ్డాడు. మహర్షి ప్రసన్నుడై ఇలా అడిగాడు.

“నాయనా సాంబా! నీ సంపూర్ణ శరీరమంతా ఒకప్పుడు కుష్ఠురోగం తగిలి భయంకరంగా వుండేది కదా! నీకా రోగవిముక్తి కలిగి శరీరం దివ్యకాంతి శోభలతో మెరుస్తోంది. ఇదెలా సాధ్యమైంది? అడిగాడు వసిష్ఠుడు.

‘గురుదేవా! నేను సూర్యభగవానుని ఆరాధనను ఆయన సహస్రనామాల ద్వారా చేశాను. ఆయన ప్రసన్నులై సాక్షాత్ దర్శనమిచ్చి వరములను కూడా ప్రసాదించారు. ‘

సూర్యోపాసన విధిని కూలంకషంగా తెలుసుకోదలచుకొని సవిస్తరంగా తనకు వచింపుమని ఆదేశించాడు వసిష్ఠమహర్షి.

చెప్పసాగాడు సాంబుడు.

‘బ్రహ్మర్షీ! నేనొకనాడు విపరీతమైన అజ్ఞానాహంకారాలతో మిడిసిపడి దుర్వాస మహర్షిని అపహసించాను. ఆయన కోపించి కుష్ఠురోగివైపొమ్మని శపించారు. అపుడు నేను దుఃఖం, సిగ్గు, భయం ముప్పిరిగొనగా శరీరం ధ్వనులు చేస్తుండగా, గొంతు కీచుమంటుండగా, వైద్యం నిర్వీర్యముకాగా నాతండ్రి శ్రీకృష్ణభగవానుల వద్దకు పరుగుపరుగున పోయి ఆయన పాదాలపై పడిపోయాను. ఆయన నాపై దయతో మార్గం సూచించారు. భక్తి పూర్వక దేవారాధనయే మార్గమని బోధించారు. నేను ఏ దేవుని ఎలా ఆరాధిస్తే నాకు రోగవిముక్తి కలుగుతుందని అడిగాను.

కృష్ణ భగవానులిలా చెప్పసాగారు “నాయనా! ఒకప్పుడు యోగి శ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మదేవునికి ప్రమాణం చేసి మోక్షప్రాప్తి అనే ఏకైక ఇచ్ఛగల ప్రాణి ఏ దేవతనారాధించాలి? ఈ దృగ్గోచరమగుచున్న చరాచర విశ్వం ఎవని నుండి ఉత్పన్నమగుచున్నది? ఎవనిలో కలిసిపోనున్నది?” అని అడిగాడు.

బ్రహ్మ ఇలా ఉపదేశించాడు. ‘మహర్షీ! చాలా మంచి ప్రశ్న వేశావు. ప్రశ్నను వినడంతోనే నేను ప్రసన్నుడనయ్యాను. ధ్యానపూర్వకంగా విను. ఏ దేవశ్రేష్ఠుడు తాను ఉదయిస్తూనే సమస్త జగత్తు యొక్క అంధకారాన్ని నశింపజేస్తూ మూడులోకాలనూ వెలిగిస్తున్నాడో, ఆయనే అజర - అమర, అవ్యయ, శాశ్వత, అక్షయ, శుభాశుభకర్మసాక్షి, సర్వదేవతాదికి స్వామి స్వరూపుడు. ఆయన మండలము క్షయము లేనిది. పితరులకు పితృమూర్తి, దేవతలకే దేవుడు, జగదాధారుడు, సృష్టి, స్థితి, సంహారాలకు కర్త ఆయనే. ఎవరి సహస్రకాంతులలో మునులు, సిద్ధులు, దేవతలు నివసిస్తారో, జనక, వ్యాస, వాలఖిల్య, శుకదేవాది ఋషిగణాలు, పంచశిఖాది యోగిగణాలు ఎవరి ప్రభా మండలంలో ప్రవిష్టులై వుంటారో ఆ సర్వమయుడే ప్రత్యక్షదైవమైన సూర్య నారాయణుడు. యాజ్ఞవల్క్యా ఆ సూర్యుని ఆరాధిస్తే అన్ని ఫలాలూ ప్రాప్తిస్తాయి.’

యాజ్ఞవల్క్యుడు మళ్ళా ఇలా అన్నాడు “దేవదేవా! మీరు నాకు దయ చేసిన ఈ ఉపదేశం అత్యుత్తమం. పరమసత్యం. నేనిదివరకు సూర్యనారాయణ స్వామి మాహాత్మ్యాన్ని గూర్చి వినియున్నాను. ఆయన దక్షిణాంగమునుండి విష్ణువు, వామాంగము నుండి స్వయంగా తాము, లలాటము నుండి రుద్రదేవుడు ఉత్పన్నులైనారని కూడా విన్నాను. ఆయనతో సాటివచ్చు దైవమెవ్వరు? ఇపుడు నేను సంసారసాగరాన్ని దాటించే శక్తిగల సూర్యారాధనావిధిని మీ ద్వారా విని తరించాలనుకుంటున్నాను. ధర్మ, అర్థ, కామ ప్రాప్తి కోసం ఎన్నో అనుష్ఠానాలను చేసినా సూర్యదేవుని ఆరాధించే అనుష్ఠానాలే సంపూర్ణంగా సఫలమవుతాయి.

దుర్గ సంసారకాంతారం అపారమభిధావతాం

ఏకః సూర్యనమస్కారో ముక్తిమార్గస్యదేశకః

ఈ మాటలకు ప్రసన్నుడైన బ్రహ్మ ఇలా ప్రవచించాడు. ‘ఆద్యంతరహితుడు, సర్వవ్యాపియైన పరబ్రహ్మ తన లీలగా ప్రకృతి పురుషుల రూపాన్ని ధరించి (అక్షరమనగా క్షరములేనిది. అంటే ఆగిపోనిదని, రమ్యమైనదని) అక్షర సృష్టిరచనా వేళలో బ్రహ్మగా భాసిస్తాడు. దానిని పాలించుటకు విష్ణువై విరాజిల్లుతాడు. దానిలో చెడును సంహరించడానికి పరమేశ్వరునిగా ప్రకాశిస్తాడు. ఈ పరమాత్మయే సూర్యభగవానుడు. భేదాభేదస్వరూపుడైన ఆయన ఆరాధనను ఆయనే నన్ను అనుగ్రహించి నాకు చెప్పాడు. విను.

“యాజ్ఞవల్క్యా! ఒకనాడు నేను భాస్కరభగవానులను స్తుతించాను. ఆయన ప్రసన్నులై ప్రత్యక్షమయ్యారు. అపుడు నేను ఇలా అడిగాను. ‘దేవా! వేదవేదాంగాల లోనూ, పురాణాలలోనూ మీ తత్త్వమే ప్రతిపాదింపబడినది. శాశ్వత, అజ, పరబ్రహ్మస్వరూపులైన మీలోనే ఈ జగత్తు వున్నది. సర్వాశ్రమమూలమైన గృహస్థాశ్రమంలో ప్రతి ఇంటిలోనూ మీ పూజలే జరుగుతున్నాయి. కాని, మీరు స్వయంగా ధ్యాన నిమగ్నులై నాకు దర్శనమిచ్చారు. మీరెవరిని ధ్యానిస్తారో పూజిస్తారో నేను ఊహించ లేకున్నాను. దయచేసి చెప్పండి.

సూర్యదేవులిలా సెలవిచ్చారు ‘బ్రహ్మా! ఇది మిక్కిలి గుప్తమైన విషయము. ఐనా నీవు నా పరమభక్తుడవు కాబట్టి చెప్తున్నాను. పరమాత్మ అన్ని ప్రాణుల్లోనూ వ్యాప్తుడై, అచలుడై, నిత్యుడై, సూక్ష్మంగానూ, ఇంద్రియాతీతంగానూ వుంటాడు. ఆయనను క్షేత్రజ్ఞపురుష, హిరణ్యగర్భ, మహాన్, వృద్ధి, ప్రధానాది నామాలతో పిలుస్తారు. మూడులోకాలకీ ఏకమాత్ర ఆధారం ఆయనే. నిర్గుణ పరబ్రహ్మమై యుండి తన ఇచ్ఛతోనే సగుణరూపం ధరిస్తూ, అంతటికి సాక్షిగా, తాను స్వయంగా కర్మను చేయకుండా, కర్మఫలప్రాప్తికి కట్టుబడకుండా అన్నివైపులా అన్ని ఇంద్రియాలనూ కలవాడై సమస్త జగత్తునూ పర్యవేక్షిస్తూ వుంటాడు. ఆనంద పూర్వకంగా విహరిస్తూ వుంటాడు.

ఈ శరీరాన్ని కర్మరూప బీజానికి క్షేత్రంగా భావిస్తారు. అందుకే పరమాత్మను క్షేత్రజ్ఞుడని పిలుస్తారు. అవ్యక్తపురంలో శయనించడంవల్ల ఆయనను పురుషుడని, ఎన్నో రూపాలు ధరించడంవల్ల విశ్వరూపుడని, విశ్వధారణ, పోషణలు చేసేవాడు కావడం వల్ల మహాపురుషుడని అంటారు. ఒకే వాయువు ఎలాగైతే మన శరీరంలో ఎన్నో పేర్లతో వ్యాపించియుంటుందో, ఒకే అగ్నిస్థాన భేదాలవల్ల ఎన్నో పేర్లతో ఎలాగైతే పిలువబడుతోందో అలాగే పరమాత్మ ఒకడే ఐనా భిన్నభిన్న అంశాలుగా విస్తరిస్తాడు. ఈ మొత్తం సంసారాన్ని సంహరించిన తరువాత ఈయన ఏకాకిగా మిగిలిపోతాడు. నేను సూర్యరూపుడనైన పరమాత్మను. ఇతరరూపాల్లో వెలిగే పరమాత్మను పూజిస్తాను.’