భవిష్య పురాణము

119 - యమదూతల నారకీయుల సంవాదం

విష్ణుదేవా! ఒకమారు నరకంలో పడి ఆకలితో, ఆర్తితో, దుఃఖితులై గోలగోల పెడుతున్న జీవులను చూసి యమదూతలిలా అని యున్నారు. మూఢజనులారా! ఇపుడెంత విలపించి ఏమి లాభము? మీ అంతరాత్మను నిర్లక్ష్యం చేసి చేటు తెచ్చుకున్నారు. మీ కర్మఫలాలను ముందు ముందు మీరే అనుభవించాలనే తెలివి మీకు లేకపోయింది. శరీరం గాని, విషయాలు గాని చిటికెలో నశిస్తాయని ఎవరికి తెలియదు? మీకూ తెలుసు. వేల జన్మల తరువాత ఒక మానవ జన్మ లభిస్తుంది. ఆ జన్మలోనే మూఢజనులు భోగాల వెంట పరుగుదీస్తారు. ఇల్లాలు, పిల్లలు, పొలము, ధనము మున్నగువాటిపైనే దృష్టి పెట్టుకొని, వాటి తోడిదే జీవితముగా బ్రతికి లెక్కకు మిక్కిలిగా దుష్కర్మలు చేస్తూ తన ఇహమునే గాని పరమును పట్టించుకోరు. సూర్యుడు, చంద్రుడు, కాలము, ఆత్మ ఇవన్నీ మనిషి యొక్క శుభాశుభ కర్మలను గమనిస్తూనే వుంటాయని, అవే వ్యక్తి పరలోక జీవితానికి సాక్షీభూతాలౌతాయని తెలుసుకోరు, నమ్మరు. ఒక్క జన్మమే అని కాదు. ఒక ఆత్మ ఎన్ని జన్మలెత్తితే అన్ని జన్మలలోని పుత్ర, స్త్రీ, ధనాదులకై వీరు చేసే పనులను అవి తెలుసుకునే వుంటాయి. సాక్షులుగా నిలుస్తునే వుంటాయి. ఈ నరకమునకు మూలమే మోహము. మీ బాధంతా దాని మహిమే! మమత, మోహములలో చిక్కువడి జీవనం గడపిన పరిణామంగా భయంకర విషయ సుఖాలవైపు ఆకృష్ణచిత్తులైన మానవుల బుద్ధి పరమార్థతత్త్వం వైపు మళ్ళదు. నాలుక ద్వారా సూర్యనారాయణుని నామమును పలుకుటయే మీకు కష్టమైపోయినది కదా! మందిరంలో దీపాన్ని వెలిగించడానికి ఏమంత కష్టపడిపోవాలి? ఆ మాత్రం కూడా అప్పట్లో చేయలేని వారిప్పుడెంత యేడ్చి యేమి లాభం? చేసిన దానికి అనుభవిస్తున్నారు. ఏదైనా పాపకర్మ చేయగానే భయపడి సూర్యభగవానుని ఆరాధించి వుంటే ఆ పాపమూ దగ్ధమయ్యేది, అనంతరం జీవితమూ పాపపంకిలమయ్యేదికాదు.’

‘నరకంలోని జీవులిలా ప్రశ్నించాయి. ‘ఓ సాధు జనులారా! మేము ఏమంత పాపాలు చేసేశామని... ఇక్కడ పడివున్నాం?’ యమదూతలు చెప్పారిలా:

‘పూర్వజన్మలో యవ్వనోన్మాదంలో పిచ్చెత్తిపోయి డబ్బుకోసం కక్కుర్తిపడి మీరు సూర్య మందిరాల్లో నేతిని, దీపాలను దొంగిలించారు, ఆ కారణం వల్లే ఘోరనరకం వాటిల్లింది.’

బ్రహ్మ ఈవిధంగా చెప్పి, మరోమాట కూడా చెప్పాడు. ‘అచ్యుతా! దీపాదానం వల్ల సర్వత్రసుఖాలూ, శుభాలే కలుగుతాయి. సూర్యదీపం వల్ల చాల ఎక్కువ ఫలితముంటుంది. ఆ దీపాలను దొంగిలించినవారే ఈ రోజున మనం చూస్తున్న వికలాంగులు, వివేకహీనులు.